యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు
* ఒక రైతుకు రెండు బస్తాలేనా…!
మహాదేవపూర్ ఆగస్టు 19 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి మహాదేవపూర్ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో మంగళవారం రోజున పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు బారు తీరారు. ఉమ్మడి మండలమైన మహాదేవపూర్ కి 27 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.