భూపాలపల్లి లైబ్రరీలో ఘనంగా విద్యా వారోత్సవాలు
మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకు వచ్చిందన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రంథాలయంలోని పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులు, యువత పుస్తక పఠన అలవాట్లను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. స్థానిక గ్రంథాలయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపాలిటీ తరుపున తనవంతు సహాయం సహకారాలు అందిస్తానని ఆయన చెప్పారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదని, అవి జ్ఞాన వికాసానికి ప్రధాన కేంద్రాలని పేర్కొన్నారు. గ్రంథాలయంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. పాఠకులు, యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం లైబ్రరీలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పుస్తకాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రంథాలయంలో బెస్ట్ పాఠకురాలును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి ముద్దమల్ల రాజేందర్, కౌన్సిలర్లు బొడ్డు అశోక్, రాధ, నాయకులు చల్లూరి సమ్మయ్య, చల్లూరి మధు, వివిధ సంఘాల నాయకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
