రైతులు, అధికారుల ముందే కొనుగోలు సమీక్ష.
ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దని ఆదేశాలు.
రైతులకు చెల్లింపులలో జాప్యం జరగొద్దని సూచన.
హన్మకొండ జిల్లాలో వడ్ల కొనుగోలు జరుతున్న కేంద్రాలను రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్.చౌహాన్ శనివారం సందర్శించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
అందులో భాగంగా పి.ఎ.సి.ఎస్. ఉనికిచెర్ల,పి.ఎ.సి.ఎస్. ధర్మసాగర్, ఐకేపి ధర్మసాగర్, పి.ఎ.సి.ఎస్. తెల్లాకులగూడెంలలో వడ్ల కొనుగోలు తీరును పర్యవేక్షించారు. వడ్ల కొనుగోలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలోనే అటు అధికారులు, ఇటు రైతులతో చౌహాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా జరగడానికి హార్వెస్టర్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుండి అందే వాతావరణ సూచనల ఆధారంగా ప్రతి పిసిసి లో కొనుగోలు చర్యలను సక్రమంగా కొనసాగించాలని సూచించారు. వడ్ల నాణ్యత కోసం ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు ఉపయోగించాలన్నారు.
ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు చెల్లింపులు త్వరగా చేయాలని ఆదేశించారు. వడ్లు కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వడ్ల కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలన్న కృత నిశ్చయంతో వుందని చౌహాన్ తెలిపారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చౌహన్ తెలిపారు.