Don’t Trust Congress Promises
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు చల్లా
నడికూడ,నేటిధాత్రి:
అమలుకు సాధ్యం కాని హామీల్చిన కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయి గోస పడవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని నడికూడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి తరపున గ్రామంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.పంచాయతీ ఎన్నికలున్నాయని గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని, కానీ,పట్టణాల్లో ఎన్నికలు లేవని మహిళలు ఇవ్వలేదన్నారు.ఓట్ల కోసమే చీరలను అందించిన విషయాన్ని మహిళలు గ్రహించాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో 420 మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని అన్నారు. కేసీఆర్ 14ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి పదేళ్ల తన పాలనలో ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి,షాదీముబారక్, దళితబంధు,రైతుబంధు, రైతుబీమా,కేసీఆర్ కిట్ వంటి ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందారన్నారు. సబ్బండవర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషిచేసిన మహనీయుడిని కాదనుకొని ఓ మాయలోడిని తీసుకొచ్చి సీటులో కూర్చోబెట్టారని అన్నారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు,రైతులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు.బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి మరియు వారి వార్డుల అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
