దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకోని చూసుకుంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని, ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని, దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపించిందన్నారు. దీంతో రాష్ట్రంలోని 30 లక్షల రైతుల యొక్క 25వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. అలాగే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినట్లుగా రాళ్ళకు, గుట్టలకు, వెంచర్లకు, రోడ్లకు కాకుండా పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులతో మళ్లీ సర్వే చేయించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సన్న వడ్లు పండిస్తే క్వింటాల్ కు 500 చొప్పున బోనస్ చెల్లించడంలాంటి పథకాలతో రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం గర్వకారణమన్నారు. ఈ ఘనత దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందిన్నారు. సబ్సిడీలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే..బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని బొంద పెట్టి కేవలం వారి కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా సబ్సిడీ ట్రాక్టర్లను ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పథకాన్ని తీసుకురావాలనే ఆలోచన క్యాబినెట్ సమావేశంలో తీసుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ..అటు సంక్షేమం..ఇటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ..తెలంగాణ రైసింగ్ నెంబర్ 1 విజన్ 2047తో ముందుకు వెళుతుంటే ఇది ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు వారి స్థాయిని మరిచి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీపైన గానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గానీ ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు.