*కమిషనర్ ఎన్.మౌర్య.
తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ లో ఉన్న బి.పి.ఎస్., ఎల్.ఆర్.ఎస్.కి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 వ సంవత్సరంలో దరఖాస్తు సమర్పించి ఇప్పటికీ క్రమబద్దీకరణ కాకుండా పెండింగ్ లో ఉన్న అర్జేదారులకు మార్చి 31 వ తేదీవరకు మరో అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే 2020వ సంవత్సరంలో ప్రభుత్వం జారీచేసిన లేఔట్ రేగులరైజేషన్ స్కీం-2020 నందు అనుమతిలేని లేఔట్లు, ప్లాట్లు కమబద్ధీకరించుకోవడానికి మరో అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. భవనాలు క్రమబద్ధీకరించుకోవడం వలన ప్రత్యేకంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందవలసిన అవసరము లేదని, భవిష్యత్తులో భవన నిర్మాణ ఫీజు లో మినహాయింపు ఉంటుందని, ఆస్తిపన్ను పై ఎటువంటి పెనాల్టీ ఉండదని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్. ను 2007 తరువాత తిరిగి అమలులోకి తేవడం.జరిగిందని అన్నారు. లేఔట్ల, ఫ్లాట్లు క్రమబద్ధీకరించుకోవడం వలన 14శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు మినహాయింపు ఉంటుందని, పీనల్ చార్జీల నుండి మినహాయింపు ఉంటుందని, రోడ్డు మరియు యాజమాన్య హక్కులు ద్రువీకరించబడతాయని తెలిపారు.కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.