
Samantha
తప్పు చేసినా.. ఎప్పుడూ నా వెంటే ఉన్నారు
సమంత తానా (TANA) సభలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అక్కడికి చేరుకున్నాక అభిమానులు చూపించిన ప్రేమ పట్ల భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా.. ‘తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా? లేదా?’ అనే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. మీరంతా నాకంటూ కొక ఐడెంటిటీ, కుటుంబాన్ని ఇచ్చారు’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సమంత(Samantha). ఆమె ‘తానా’ (TANA) సభలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అక్కడికి చేరుకున్నాక అభిమానులు చూపించిన ప్రేమ పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ‘‘తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 ఏళ్లు పట్టిందంటే నమ్మలేకపోతున్నా. ప్రతి ఏడాది తానా, ఇక్కడ ఉన్న తెలుగువారి గురించి వింటూనే ఉంటాను. నా తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’ నుంచి నన్ను మీ మనిషిలా , మీలో ఒకరిగా చూస్తున్నారు. నాపై ఎంతో ప్రేమను చూపించారు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇన్ని ఏళ్లు పట్టింది’’ అంటూ తల వంచి నమస్కారం చేశారు.
సినీ కెరీర్ గురించి చెబుతూ ‘‘నటనా జీవితం ఎంతో బావుంది. నటిగా మంచి స్థానంలో ఉన్నాను. ఇప్పుడు నిర్మాతగా కూడా కెరీర్ ప్రారంభించా. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను మొదలుపెట్టా. ‘శుభం’తో తొలి అడుగు వేశా. నార్త్ అమెరికాకు చెందిన తెలుగువారు మా చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు, ప్రశంసల వర్షం కురిపించారు. మంచి సక్సెస్ అందించారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏదైనా తప్పు చేసినా.. మీరు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. అందుకు గర్వపడుతున్నా. మీరంతా నాకొక ఐడెంటిటీ, కుటుంబాన్ని ఇచ్చారు. ‘ఓబేబీ’ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరడం మీవల్లే సాధ్యమైంది. ప్రాంతాలను బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు.. కానీ మీరెప్పటికీ నా మనసులోనే ఉంటారు’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.