Absconding Accused Arrested After 14 Years
భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
14 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి రిమాండ్
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
సిరిసిల్ల (నేటి ధాత్రి):
ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (27), తండ్రి బాల నరసయ్య, 2007 సంవత్సరంలో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి (5 సంవత్సరాలు), నైపున్య (2 సంవత్సరాలు) ఉన్నారు.
2012 సంవత్సరంలో భాగ్యలక్ష్మి మూడవసారి గర్భవతిగా ఉన్న సమయంలో,మళ్లీ అమ్మాయి పుడుతుందని అనుమానంతో భర్త ఆంజనేయులు,అలాగే అత్తమామలు ఆమెను మానసికంగా,శారీరకంగా వేధించాగా,అట్టి వేధింపులను భరించలేక భాగ్యలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.ఈఘటనపై 2012లో ఆంజనేయులుపై కేసు నమోదు చేయబడింది.
అప్పటి నుండి ఆంజనేయులు పరారీలో ఉండగా దీంతో న్యాయస్థానం అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయగా జిల్లా టాస్క్ఫోర్స్, ముస్తాబాద్ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
పోలీసులకు ఎల్లవ్వ కృతజ్ఞతలు
భాగ్యలక్ష్మి తల్లి ఎల్లవ్వ తన కూతురు మరియు మనవరాళ్లను హత్య చేసిన అంజనేయులు ను పట్టుకోవడంలో 14 సంవత్సరాల నుండి న్యాయం కోసం తిరుగుతున్నానని జిల్లా ఎస్పీకి ఈ నెల 6 వతేదీన పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం మూడు రోజుల్లోనే నిందితుడు అంజనేయులను అరెస్ట్ చేయడం పట్ల బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా వేగంగా ముందడుగు పడింది.ఈసందర్భంగా ఎల్లవ్వ జిల్లా పోలీసుల తక్షణ స్పందనకు,నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి కృషి చేసిన ప్రత్యేక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్, ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్, టాస్క్ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
