సీఎం సార్‌…జరదేఖో..!

సీఎం సార్‌…జరదేఖో..!
ఆఖరి మజిలీకి…అంతులేని కష్టం
”మనిషి జీవితం అనేక మలుపులతో కొనసాగుతుంది. కష్ట సుఖాల మధ్య సాగే మనిషి జీవితంలో ఆఖరి మజిలీ కూడా అంతులేని కష్టంగా మారింది. చివరి అంకమైన మనిషి మరణం వారి కుటుంబాలకు బొందల గడ్డ రూపంలో మరింత ఇబ్బందులను తెలిచ్చిపెడుతుంది. మరణించిన తమ కుటుంబ సభ్యున్ని ఖననం చేయటానికి కూడా  స్మశానవాటికలు సరిగా లేకపోవటం, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ సౌకర్యాలు లేకపోవటం పలు గ్రామాలలో తీరని సమస్యగా మారింది”.
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో శ్మాశానవాటికల దుస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2017సంవత్సరంలో దృష్టి సారించింది. ఇందుకు గాను వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 126  స్మశానవాటికలను మంజూరు చేస్తూ 2017-18 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది.  ఒక్కో శ్మాశానవాటిక నిర్మాణానికి రూ.10 లక్షల 13 వేల తో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయి సౌకర్యాలతో నిర్మించాలని సూచించింది. అయితే ఇందులో జిల్లాలోని 14 మండలాల్లో 121  స్మశానవాటికలను నిర్మించేందుకు రూ. 12 కోట్ల 76 లక్షల ప్రతిపాధనలకు అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్దం చేసింది. ఈ  స్మశానవాటికల నిర్మాణాలు ఈజీఎస్‌ పనుల కింద పూర్తి చేయాలని, ఇందులో గ్రామ పంచాయతీల పాత్ర, ఈజీఎస్‌ కూలీల పాత్ర వారికి సంబంధించిన ఖర్చుల వివరాలను బడ్జెట్‌ కేటాయింపుల్లో పేర్కొనటం జరిగింది. అయితే 2017-18 బడ్జెట్‌లోనే పూర్తి కావాల్సిన  స్మశానవాటికల నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అ్కడే అన్న చందంగా మారటం గమనార్హం.
పనులు ప్రారంభమైనవి 64 మాత్రమే…
జిల్లా పరిధిలో 121 స్మశానవాటికలు నిర్మించేందుకు ప్రతిపాధనలు రూపొందించినప్పటికీ నిర్మాణ పనుల్లో మాత్రం జాప్యం జరుగుంది. ఇప్పటి వరకు కేవలం 64 మాత్రమే నామమాత్రపు పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన 57  స్మశానవాటికల ఊసే లేకపోవటం గమనార్హం. ఇందులో పనులు మొదలు పెట్టిన వాటిలోనూ ఒక్కటి కూడా పూర్తి చేయకపోవటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  స్మశానవాటికల పట్ల నిర్లక్ష్యనికి కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిధులు సైతం పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  స్మశానవాటికల నిర్మాణ పనులు ప్రారంభించకపోవటం, కొన్నింట్లో నామమాత్రపు పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి చేయకపోవటం పట్ల  గ్రామీణ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్మశానవాటికల్లో కల్పించాల్సిన సౌకర్యాలు…..
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో 126  స్మశానవాటికల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేయగా, జిల్లా యంత్రాంగం ఒక్కో శ్మాశానవాటిక నిర్మాణానికి  రూ. 10 లక్షల 13 వేల ప్రతిపాధనలు రూపొందించి జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్ల 17 లక్షల ప్రతిపాధనలు పంపింది. దీని ప్రకారం ప్రతి స్మశానవాటికలో అంత్యక్రియలు జరుపుకోవటానికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అంత్యక్రియలకు రెండు ప్లాట్‌ఫామ్‌లు, ఒక్క ఆఫీసు రూం, ఓపెన్‌హాల్‌, మహిళలు, పురుషులు స్నానం చేయటానికి విడివిడిగా స్నానపు గదులు, సిమెంట్‌ గెద్దె ఒకటి, శ్మాశాన వాటిక స్థలం చుట్టూ పెన్సింగ్‌, ముఖద్వారం వద్ద కమాన్‌, గేటు, ముఖ్యంగా కరెంట్‌ నీటి సౌకర్యాలు కల్పించాలి . అవసరమైతే  నీటి సౌకర్యం కోసం బోర్‌ వేయాలి. స్మశానవాటికల నిర్మాణ పనుల్లో వీటన్నింటినీ నిర్మించాల్సిన అవసరం ప్రతిపాధనల్లో రూపొందించినప్పటికీ అందుకనుగుణమైన పనులు జరుగకపోవటం గమనార్హం.
జిల్లాలో ప్రతిపాధించిన స్మశానవాటికలు – వివరాలు
    మండలం     -మంజూరైనవి      – మొదలైనవి                 – పూర్తికానివి      – పూర్తి అయినవి
1. వర్థన్నపే     –      9                   6                      3                           0
2. పర్వతగిరి    –      6                   3                       3                          0
3. రాయపర్తి     –     15                  2                      13                         0
4. సంగెం        –    13                   9                       4                          0
5. నెక్కొండ    –     11                   6                       5                           0
6. నర్సంపేట    –      9                   6                       5                          0
7. నల్లబెల్లి      –    1                      1                       0                         0
8. ఖానాపూర    –   2                      0                        2                        0
9. చెన్నారావుపేట     8                      3                      5                         0
10. దుగ్గొండి           14                   5                       9                         0
11. శాయంపేట          2                   2                       0                         0
12. గీసుగొండ             9                  7                       2                         0
13. ఆత్మకూర్‌           11                  7                      4                          0
14. పరకాల            11                   10                    1                          0
పై వివరాల ప్రకారం జిల్లాలోని స్మశాన వాటికల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందనేది గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజా పత్రినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ పాలకవర్గాలు యుద్ద ప్రతిపాధికన నిర్మాణ పనులకు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *