`ఈటెలకు పెద్ద పీట వేద్దాం?
`బండి వర్గం కలవరం?
`అధిష్టానం ఆలోచనపై బండి వర్గం అంతర్మధనం?
`బిజేపి కేంద్ర నాయకత్వం నిర్ణయం?
`ప్రజల ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి?
`కర్ణాటకతో బిజేపిలో మొదలైన కలవరం?
`మార్పుకు తగ్గట్టు మారితేనే మనగలుగుతాం?
`కర్ణాటక లో నిండా మునిగాం?
`అయోధ్య కార్పోరేటర్ సీటు కోల్పోయాం?
`మతమొక్కటే ప్రాతిపదికైతే నష్టం?
`బండి తెచ్చింది పాలపొంగు మాత్రమే?
`చప్పున చల్లారుతుంది?
`దేశ వ్యాప్తంగా సరళి మారుతోంది… మనమూ మారుదాం?
`బండిని మార్చేద్దాం?
`లేకుంటే కష్టం ఇబ్బందులు పడతాం?
` ఇక చేరికలు శూన్యం?
`వున్న వారికి కాపాడుకోవడం ముఖ్యం?
`ఉభయకుశలోపరిగా ఈటెలకు స్థానం?
`పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ వైపు మొగ్గు?
`తాజాగా రాజగోపాల్ రెడ్డి మీద వార్తలు?
`ఈటెలను కాపాడుకోవాల్సిన తరుణం?
హైదరబాద్,నేటిధాత్రి:
చేను ఎంత ఏపుగా పెరిగినా పంట లేకపోతే ఏం లాభం? ఆ కష్టం పగవాడికి కూడా రావొద్దు? ఇప్పుడు అచ్చంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్దితి అలాగే వుందని అనుకుంటున్నారు. మొన్నటిదాకా ఆహా, ఓహో అని బండి సంజయ్ను పొగిడినవాళ్లే ఇప్పుడు రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుకుంటున్నారట. కర్నాకట పలితాలు చూసిన తర్వాత రాష్ట్రంలో బిజేపి ఉనికి కాపాడుకునేందుకు అవసరమైన నాయకత్వమే మేలన్న ఆలోచన చేస్తున్నారట. సహజంగా ఏది జరిగినా కొందరికి మోదం…కొందరికి ఖేదం సహజం. బండి సంజయ్ విషయంలో అన్నీ అనుకోని సంఘటనలే అని చెప్పాలి. పార్టీ పరంగా ఆయన ఒక సైనికుడు. ఇది ఎవరూ కాదనలేనిది. కాని రాజకీయాలన్నవి ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు. వ్యవస్ధకు సంబంధించినవి. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా బండి సంజయ్ పోటీ చేశారు. ఒక దశలో ఆయనకు గెలుస్తున్నానన్నంత ధీమా కనిపించింది. తీరా ఫలితాలు చూస్తే, బండి సంజయ్ ఓడిపోయారు. ఇక ఆ రోజు బండి సంజయ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఆయన అభిమానులు ఏడ్చిన ఏడ్పులు రాష్ట్రంలో ఒక రకంగా సంచలనంగానే మారింది. అది కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికలు బండి సంజయ్కు బాగా కలిసి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓటమి ఆయనకు సానుభూతిని అందించింది. పార్లమెంటు సభ్యుడిని చేసింది. ఒక వేళ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వుంటే ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కాదు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు పార్లమెంటు సభ్యుడు అయిన ఆనందంతో వున్న బండి సంజయ్ను రాష్ట్ర ఆధ్యక్షుడిని చేసింది బిజేపి. ఇక ఆయన ఆనందానికి అవధులులేకుండాపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే నాయకుడిగా తాను చూపించాల్సినంత విశ్వరూపం చూపించే అవ కాశం దక్కింది. తొలి రోజుల్లో ఆయన పనితనం ఎలా వుంటుందో అని అందరూ అనుకున్నారు. కాని రానురాను రాటు దేలిపోయారు. ఆ తర్వాత దేశంలో అనేక రాష్ట్రాలలో బిజేపి గెలుస్తూ రావడం, కేంద్రంలో రెండుసార్లు ప్రధాని మోడీ కావడం వంటివన్నీ బండి సంజయ్కు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాములా కనిపిస్తుందని ఆయనకు సంతోషం ఎంత వేగంగా వచ్చిందో…ఇప్పుడు వచ్చిన సంతోషం కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కర్నాకట ఎన్నికల పుణ్యమా అని బండి సంజయ్ పదవికి ఎసరొచ్చిందనే అంటున్నారు.
కర్నాటక ఎన్నికలు బండి సంజయ్కు పదవీ గండం తీసుకొచ్చేలా కనిపిస్తుంటే, ఈటెల రాజేందర్కు కాలం కలిసివచ్చేలా కనిపిస్తోంది.
రాజకీయాలంటేనే అంత..అని ఊరికే అనలేదు. కాలం ఎంత స్పీడ్గా పరుగెత్తుతుందో…పరిస్ధితులు కూడా అంతే చకా, చకా తారుమారవుతున్నాయి. తాజాగా కర్నాకటలో జరిగిన ఎన్నికల్లో బిజేపి ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కారణం దేశంలో బిజేపి ఆలోచనా విధానానికి, నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వ పాలనకు ప్రజలు అలవాటు పడిపోయారా? అన్నంతగా దేశ వ్యాప్తంగా వస్తున్న ఫలితాలు కర్నాకటలో కూడా రిపీట్ అవుతాయనే అనుకున్నారు. కాని కర్నాటక ప్రజలు చారిత్రక తీర్పునిచ్చాయి. ఈ తీర్పును మెజార్టీ మీడియా కూడా పసిగట్టలేకపోయింది. ఎంత ధరలు పెరిగినా, ఎన్ని రకాల పన్నులు వడ్డిస్తున్నా, బిజేపి చెబుతున్న దేశం, కోసం ధర్మం కోసం అనే రెండు పదాలకు ప్రజలు అలవాటు పడిపోయారా? అన్నంతగా బిజేపి అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేసింది. కాని ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తే బండకేసి ఉతికేస్తారని కర్నాకట ప్రజలు మరోసారి నిరూపించారు. దాంతో ఒక్కసారిగా బిజేపిలో కలవరం మొదలైంది. కర్నాటక రాష్ట్రంలో ఫలితాలు ఎలా వుండబోతున్నాయో అర్ధమైన తర్వాతే రంగంలోకి మోడీ ద్వయం రంగంలోకి దిగిందనేది భహిరంగ రహస్యమే. అయినా ప్రజలు బిజేపిని ఆదరించలేదు. పెద్దఎత్తున సభలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలు, రోడ్షోలతో దేశమంతా కర్నాటక బిజేపిదే అనుకున్నది. కాని కర్నాకట ప్రజలు బిజేపిని కర్రు కాల్చి వాతలు పెట్టారు. ఇక దాంతో దేశంలోని మీడియా మొత్తం ఒక్కసారిగా భవిష్యత్తు రాజకీయాలపై నిజంలోకి వచ్చాయి. ఇంత కాలం ఇక మీడియా ఏదిచెప్పినా, ప్రజలు నమ్మరు? అన్నంత దూరం వెళ్లిన బిజేపి రాజకీయాలు ఒక్కసారిగా నేల వైపు చూసినంత పనిచేశాయి. కేంద్రంలో వున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా తప్పబిజేపిలో మరెవరూ కనిపించే పరిస్దితి లేదు. అంతెందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఈ ఇద్దరు నేతలు చెప్పింది వినాల్సిందే? అంతకన్నా మరో మార్గం లేదు. ఒకప్పుడు బిజేపి అధ్యక్షుడు అంటే ఆ పార్టీకి సుప్రింలా వుండేవారు. కాని పరిస్దితులు మారిపోయాయి. పైగా బిజేపిలో ఎవరు ఏ తప్పు చేసినా ఆరెస్సెస్ నిక్కచ్చింగా ప్రశ్నించేది. కాని ప్రధాని మోడీ అయ్యాక ఆరెస్సెస్ కార్యకలాపాలేకాదు, పర్యవేక్షణ కూడా అంతా తెరచాటుకు వెళ్లిపోయింది. బిజేపి పార్టీకన్నా, మోడీ బలవంతుడైపోయాడు. మోడీ పేరు చెప్పుకునే బిజేపి బలపడిరదన్నదాకా వెళ్లింది. దాంతో ఇద్దరు నేతల కననుసైగలతోనే పార్టీ నడిచే స్ధితికి చేరుకున్నది. అదే కర్నాకట బిజేకి సంకటంగా మారింది. కేంద్రం ఏది చేసినా బిజేపి నేతలు గుడ్డిగా సమర్ధిస్తూ వచ్చారు. కనీసం తమ అభిప్రాయాలను కూడా వెల్లడిరచేస్ధితిలో లేరు. ఆఖరుక కర్నాటకలో నందినిపాలపై,గుజరాత్ పెత్తనాన్ని ఆహ్వానించి బిజేపి నేతలు తప్పు చేశారు. ఇలా కేంద్రం పెంచుతున్న ధరల వల్లపార్టీకి భవిష్యత్తులో నష్టమన్న మాట ఎవరూ చెప్పకపోవడం కూడా ఆ పార్టీ ఉన్న రాష్ట్రాన్ని కోల్పోవడానికి కారణమైంది. అదే దారిలో నడిచే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కర్నాకట ఫలితాలు పదవీ గండాన్ని తెచ్చిపెట్టనున్నాయి. ఇక బండిదిగిపో అనేదాకా వచ్చాయి.
అదేంటో దేశంలో ఏ మార్పు వచ్చినా అది దక్షిణాది నుంచే మొదలౌతుంది.
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన గతం తాలూకు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలు కీలక భూమిక పోషించిన సంఘటనలు అనేకం వున్నాయి. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ చీలికకు దక్షిణాది రాజకీయాలేకారణం. అప్పటి నుంచి కాంగ్రెస్ దక్షిణాదికి పెద్ద ప్రాధానత్యం కల్పిస్తూ వచ్చింది. ఈ విషయం తెలిసినా బిజేపి దక్షిణాదిని నిర్లక్ష్యం చేసింది. రియాక్షన్ కర్నాటక ఎన్నికలతో తొలి ఎదురు దెబ్బ రుచి చూసింది. అది దేశమంతా పాకితే బిజేపికి తీరని నష్టం జరిగే అవకాశాలే వున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బిజేపికి దేశంలో జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఇక ప్రజలు గుండెల్లో పెట్టుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రజలకు తత్వం బోధపడుతోంది. తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన ప్రగతి ఎంత? నిర్మాణం చేసిన ప్రాజెక్టులెన్ని? కొత్తగా వచ్చిన రైళ్లేన్ని? కొత్తగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన పరిశ్రమలెన్ని? పెరుగుతన్న ధరల సంగతి ఏమిటి? పోతున్న ఉద్యోగాలేమిటి? నిరుద్యోగ సమస్యకు కారణం ఏమిటి? ఇవన్నీ మతం మాటతో మారిపోతాయా? బతడానికి దారి చూపుతాయా? అన్నది ప్రజల్లో ఆలోచన మొదలైంది. ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే అన్నది ఇలాంటి సందర్భాలలోనే తెలిసేది. దేశం, ధర్మం వరకు సరే ప్రతీది మతమేనా? మతం ఆకలి తీర్చుతుందా? అభివృద్దిని ప్రోత్సహిస్తుందా? సమ్మతంలేని పనులు చేస్తూ, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది బిజేపికి వికటించే రోజులదాకా తెచ్చుకున్నది ఆ పార్టీ పెద్దలే. నిజానికి బిజేపి అంటే హైందవ సమాజమంతా ముక్త కంఠంతో మురిసిపోయేది. కాని అదే హైందవ సమాజం ఆకలికి అలమటించేలా చేస్తున్నది కూడా బిజేపేనా అని మధనపడుతున్నది. సిలిండర్ ధర పెరిగితే ఆందోళన చేసిన వాళ్లు, అదికారంలోకి వచ్చి తగ్గిస్తారని అనుకుంటారుగాని, మరింత పెంచుతారని ఎవరైనా అనుకుంటారా? ఈ లాజిక్ బిజేపికి తెలియక కాదు…తాము చెప్పిందే ప్రజలు వింటున్నారన్న అతినమ్మకం కూడా కొంప ముంచుతుందనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిజేపి పరిస్ధితి ఏమిటన్నది ఆలోచిస్తే, బండిని దించి, ఈటెలను కర్చీ ఎక్కిస్తేఏమైనా లాభమొస్తుందా? అన్న ఆలోచన చేయడం మొదలైనట్లుంది. ఇంతకన్నా చేసేదేమీ లేదు? అని కూడా పెద్దలే అనుకుంటున్నారట. లేకుంటే పెరగకముందే విరిగడం కూడా కొత్త అనుభవాన్ని తెలంగాణలో చూడాల్సి వస్తుందా? అని ఆందోళన చెందుతున్నారట.