*మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి..
ఇంటికో పారిశ్రామిక వేత్తను చేయడమే ప్రభుత్వ లక్ష్యం..
*ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
పలమనేరు(నేటి ధాత్రి) మే 08:
స్థానికంగా మనకున్న అవకాశాలను అంది పుచ్చుకుని మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాథమిక టైలరింగ్ శిక్షణను పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం యొక్క ఉద్దేశాన్ని డిఆర్డిఏ పిడి శ్రీదేవి మహిళలకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న. ఈ కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరమైందన్నారు. ప్రాథమిక టైలరింగ్ శిక్షణ ద్వారా మహిళలకు కుట్టు మరియు డిజైన్ నైపుణ్యాల అందించడంతో వారికి ఆర్థిక మరియు మహిళా సాధికారత కల్పించడం జరుగుతుందన్నారు.

ఈ శిక్షణ ద్వారా ఆర్థిక స్వావలంబనతో పాటు తక్కువ పెట్టుబడితో జీవనోపాధి అవకాశాలు, గ్రామీణ మరియు పట్టణ పేద మహిళలకు ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో టెక్స్ టైల్ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయని దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణ రెడ్డి, ఎంపీడీఓ ఖాదర్ భాషా, బాలాజీ కోపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ, నాయకులు నాగరాజు రెడ్డి, అర్బీసి కుట్టి, గిరిబాబు, నాగరాజు,మదన్, కిరణ్, బీఅర్సీ కుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు..