మందమర్రి, నేటిధాత్రి:-
జాతీయ రహదారి నిర్మాణ పనుల భాగంగా పట్టణంలోని యాపల్ ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపుల ఉన్న బస్ స్టాప్ లను తొలగించి, రహదారి నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రజలు రోడ్డు దాటేందుకు వీలు లేకుండా స్టీల్ రేళ్లను వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు ఇబ్బందులు కలకుండా చూడాలని యాపల్ ప్రాంత వాసులు ఎండి అబ్బాస్, డాక్టర్ వేముల నరసయ్య, నోముల శ్రీధర్ లు కోరారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంచార్జ్ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, యాపల్ ప్రాంతంలో ఇరువైపులా బస్ స్టాప్ లు ఏర్పాటు చేసి, బస్ షెల్టర్లను నిర్మించి, రహదారి మధ్యలో ఉన్న స్టీలు రేళ్లను తొలగించి, ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్లు చూడాలని కోరారు. ఈ విషయంపై ప్రాజెక్ట్ అధికారి సానుకూలంగా స్పందించి, యాపల్ వాసులకు శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.