Collector Visits ICRISAT Colony
ఐక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియా కాలనీని సందర్శించిన
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవిణ్య
బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి
నేటి ధాత్రి, పాటన్ చేరు :
పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్లోని ఐక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియా కాలనీని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవిణ్య, పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కలిసి సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు నేపథ్యంలో ఇళ్లు కూల్చి అపార్ట్మెంట్లు నిర్మించే ప్రతిపాదనపై కాలనీ ప్రజల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ ప్రవిణ్య తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో జీఓ 58 జీఓ 59 ద్వారా తమ ఇళ్లకు రెగ్యులరైజేషన్ పట్టాలు పొందామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రతి ఇంటి యజమానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినందున, ప్రస్తుతం ఉన్న ఇళ్లను కూల్చి
అపార్ట్మెంట్లుగా నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు తమకు వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. తమకు ఇప్పటికే ఉన్న ఇళ్లలోనే అభివృద్ధి చేసుకునే విధంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
2017 సంవత్సరంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా 221 ఇళ్లు కోల్పోయిన బాధితులకు అప్పట్లో రెవెన్యూ శాఖ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు కేటాయించలేదని ఆదర్శ్ రెడ్డి కాలనీ ప్రజల తరఫున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లు కోల్పోయిన వారు అద్దె ఇళ్లలో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీలో ఉన్న ఇళ్లకు ఇంటి పన్ను విధించే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాలనీ ప్రజలు వినిపించిన సమస్యలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవిణ్య సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖలతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
