వెంకట్రామ్‌ రెడ్డి విజయం ఖాయం.

https://epaper.netidhatri.com/view/263/netidhathri-e-paper-11th-may-2024%09

 

`మెదక్‌ లో కారు జోరు!

-వెంకట్రామ్‌ రెడ్డి వైపే మొగ్గు.

-చేతులెత్తేసిన కాంగ్రెస్‌, బిజేపి.

-మెదక్‌ ఉమ్మడి జిల్లాతో సుదీర్ఘ అనుబంధం.

– ఉన్నతాధికారిగా ప్రజలతో మంచి సంబంధాలు.

-మంచి అధికారిగా గుర్తింపు.

-ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం.

-ఎప్పుడూ ప్రజల్లో వుండే వ్యక్తిత్వం.

-పేదలకు మేలు చేయాలనే సంకల్పం.

-అంకిత భావంతో చేసిన కృషికి మెదక్‌ సస్యశ్యామలం

-మెతుకు సీమకు నీటి సిరులు తేవడంలో అహర్నిశలు శ్రమ.

-కాంగ్రెస్‌కు మెదక్‌ పార్లమెంటు పరిధిలో బలం లేదు.

-బిజేపికి అంత సీన్‌ లేదు?

-బలమైన క్యాడర్‌ బిఆర్‌ఎస్‌ సొంతం.

-ముఖ్యమంత్రి ‘‘కేసిఆర్‌’’ సొంత జిల్లా…

-‘‘బిఆర్‌ఎస్‌’’కు ఎదురులేని ‘‘ఖిల్లా’’.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికల ప్రచారం ముగిసే సమయం వచ్చింది. పోలింగ్‌ దగ్గరపడిరది. ప్రజల నాడి అందుతోంది. మెదక్‌ పార్లమెంటుకు పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి వెంకట్రామ్‌రెడ్డి విజయం ఖాయంగా కనిపిస్తోంది. మెదక్‌ పార్లమెంటు పరిధిలో ఎవరిని కదిలించినా వెంకట్రామ్‌రెడ్డినే గెలిపిస్తామంటున్నారు. ఎందుకంటే ఆయన ఉన్నతాధికారిగా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు ఎంతో సుపరిచితుడు. డ్వామాలో పనిచేశారు. ఆర్డీవోగా పనిచేశారు. కలెక్టర్‌గా కూడా ఆయన సిద్దిపేటలో పనిచేశారు. ఉద్యోగ జీవితం తొలి నాళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ సమయం ఆంద్రాలో పనిచేశారు. కాని ఉద్యోగ జీవితమంతా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే ఎక్కువగా పనిచేయడం వల్ల ఆ జిల్లాతో వెంకట్రామ్‌రెడ్డికి ఎంతో అనుబందంవుంది. మెదక్‌ జిల్లా పరిస్దితులు ఆయనకు పూర్తిగా తెలుసు. మెదక్‌ జిల్లాలలో ఊరూరు తెలుసు. ఏఏ ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి అవసరాలు వుంటాయో కూడా..అలా ప్రజా సమస్యల మీద పూర్తి స్దాయి పట్టున్న వెంకట్రామ్‌రెడ్డిని దాదాపు జిల్లా ప్రజలందరూ గుర్తుపడతారు. ఆర్డీవోగా, కలెక్టర్‌గా ఆయన ప్రజలతో చాలా దగ్గరగా పని చేశారు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధతోపాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన ప్రజలతో మమేకమై పనిచేశారు. మెదక్‌ జిల్లా అంటేనే కరువు జిల్లా. ఆ కరువు జిల్లాలలో ఎక్కడెక్కడ విపరతీమైన కరువు పరిస్ధితులు తలెత్తుతుంటాయో కూడా ఆయనకు బాగా తెలుసు. దాంతో ఆయన మిషన్‌ కాకతీయ పనులు చేపట్టిన విధానం అందరి చేత మన్ననలు పొందేలా చేసింది. ముందు విపరీతమైన వర్షాబావ పరిస్దితులు, కరువు తాండవమాడే ప్రాంతాలను, గ్రామాలను ఎంపిక చేసి, వాటికి తొలి ప్రాదాన్యమిస్తూ ముందుకు సాగారు. దాంతో ఆయనకు ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభించింది. అలా మిషన్‌ భగీరధ పనులను సకాలంలో పూర్తి కావడంలో వెంకట్రామ్‌రెడ్డి పాత్ర ఎంతో గొప్పది. ఇక సాగు నీటి ప్రాజెక్టుల నిర్మానం ఆయన ఉద్యోగ జీవితంలో గొప్ప మైలు రాయి. అయితే ప్రాజెక్టుల నిర్మాణం అన్నది కత్తి మీద సాము లాంటిది. అదికారులు కూడా అనేక ఇబ్బందులు పడాల్సివస్తుంది. అయినా వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడం అన్నది ఎంతో అంత సమాన్యమైన విషయం కాదు. ఇక పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలను ఆయన అమలు చేసిన వి ధానం మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు మరింత దగ్గర చేసింది. అధికారిగా వెంకట్రామ్‌రెడ్డి సాదించిన విజయాలు కేసిఆర్‌ చేత అనేక ప్రశంసలు అందుకునేలా చేసింది. వెంకట్రామ్‌రెడ్డి లాంటి వారు ఉద్యోగిగానే ప్రజల గురించి అంతగా ఆలోచిస్తే, ప్రజా ప్రతినిధిగా వుంటే జనానికి మరింత మేలు చేస్తారని రాజకీయాల్లోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీని చేశారు. ఇప్పుడు మెదక్‌ పార్లమెంటును పోటీ చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వెంకట్రామ్‌రెడ్డికి వున్న పేరు, బిఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లోవున్న క్రేజు రెండూ కలిస్తే కారుకు తిరుగులేదని చెప్పడంలో సందేహం లేదు.

మెదక్‌ జిల్లాలలో బిఆర్‌ఎస్‌ బలమైన పార్టీ.

ముఖ్యంగా కేసిఆర్‌ స్వంత జిల్లా. ఉమ్మడి జిల్లాలోపాటు, కొత్తగా ఏర్పాటైన జిల్లాలు కూడా బిఆర్‌ఎస్‌ కంచుకోటలు. అసలు మెదక్‌ జిల్లా రాజకీయాలే తెలంగాణ ఉద్యమానికి పుట్టిల్లు లాంటివి. ఒకప్పుడు కేసిఆర్‌ గురువైన మదన్‌మోహన్‌ సిద్దిపేట నుంచి తెలంగాణ ఉద్యమ శంఖారావం పూరించాడు. తర్వాత కేసిఆర్‌ ఆ ఉద్యమానికి ఊపరి పోశాడు. తెలంగాణ పోరుకు ఆయువు పంచాడు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడాడు. అలాంటి జిల్లాలో ఇతర పార్టీలకు చోటు లేదు. కాంగ్రెస్‌, బిజేపిలకు చెప్పుకోదగ్గ క్యాడర్‌ లేదు. గుర్తింపు పొందిన నాయకులు కూడా లేరు. బిఆర్‌ఎస్‌ నాయకులకు ఎదురు నిలబడేంత ప్రజల ఆదరణ వున్న వారు అసలే లేరు. అందుకే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా బిఆర్‌ఎస్‌కు గట్టి పునాదులున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో యువకులుగా వున్న వాళ్లంతా ఇప్పుడు బలమైన నాయకులుగా వున్నారు. వారంతా ప్రజల్లో గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ కారులుగా గౌరవాన్ని పొందుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు వివిధ స్ధాయిల్లో ప్రజా ప్రతినిధులైన వారు వున్నారు. కాని కాంగ్రెస్‌, బిజేపిలలో అలాంటి నాయకత్వం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కూడా బిఆర్‌ఎస్‌ బలంగా వుంది. ప్రజల్లో కేసిఆర్‌ నాయకత్వం మీద అచెంచలమైన విశ్వాసం వుంది. మెదక్‌ పార్లమెంటు పరిదిలో వున్న గజ్వెల్‌, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్‌, పటాంచెరు, సంగారెడ్డి, నారాయణ్‌ ఖెడ్‌లలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే వున్నారు. గజ్వెల్‌ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. అక్కడ కాంగ్రెస్‌ ఓటు ఆశించడం భంగపాటునే మిగుల్చుతుంది. సిద్దిపేట సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ నియోజకవర్గం మొత్తం వన్‌ సైడే వుంటుంది. దుబ్బాక కూడా అదే పరిస్ధితిలోవుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి బంపర్‌ మెజార్టీతో గెలిచారు. పటాన్‌ చెరులోనూ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బలంగా వున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఓడిరచిన ఊపుతో వున్నారు. నర్సాపూర్‌ సునీత లక్ష్మారెడ్డి నాయకత్వం ఎంతో బలంగా వుంది. ఇన్ని నియోకవర్గాలలో బిఆర్‌ఎస్‌ బలం ముందు కాంగ్రెస్‌,బిజేపిలకు ముచ్చెమటలే మిగులుతాయి.

మెదక్‌ లో బీఆర్‌ఎస్‌ ప్రచారం దూసుకుపోతోంది.

వెంకట్రామ్‌రెడ్డికి ప్రజల ఆదరణ మరింత పెరుగతోంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మెదక్‌ జిల్లా రూపు రేఖలే మారాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. కొన్ని ప్రభుత్వ పధకాలకు తొలి గడప అయ్యింది. మల్లన్న సాగర్‌ లాంటి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం వుంటే వచ్చేవి కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మరో పార్టీ అదికారంలోకి వచ్చినా ఆలోచించడానికి కూడా తావుండేది కాదు. ఎందుకంటే తెలంగాణ సాధన, వచ్చిన తెలంగాణ భవిష్యత్తు గురించి ముందు నుంచే ప్రణాళికలు వేసిన కేసిఆర్‌ వల్ల మెదక్‌ జిల్లా బంగారు తునక అయ్యింది. ముఖ్యంగా ఒకప్పుడు మెదక్‌ జిల్లా మెతకు కోసం ఏడ్చింది. ఇప్పుడు అన్న పూర్ణగా మారింది. అదంతా కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. గత శాసన సభ ఎన్నికల్లో అందుకే ప్రజలంతా బిఆర్‌ఎస్‌ను గెలిపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పధకాలు అందిన మొదటి ఉమ్మడి జిల్లా కూడా మెదకే కావడం గమనార్హం. పల్లె ప్రగతి వంటి అనేక కార్యమ్రకమాలకు శ్రీకారం కూడా మెదక్‌ నుంచే మొదలైంది. ఒకప్పుడు కరువు కోరల్లో చిక్కుకొని వున్న మెదక్‌లో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. రైతులకు రైతు బంధు అందింది. మంచి నీటి కోసం గోసపడిన జిల్లాలో ఇప్పుడు చెరువుల్లో కాలాలతో సంబంధం లేకుండా నిండి వున్నాయి. రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడాయి. ఆసరా పించన్లు, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పధకాలు అందాయి. అయితే గత ఐదు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతోనే ఎంతో కళకళలాడిన మెదక్‌ జిల్లా మళ్లీ కరువు కోరల్లో చిక్కుకున్నది. మంజీర ఎండిపోతోంది. మల్లన్న సాగర్‌కు నీటి విడుదలలేదు. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఒకప్పుడు వున్న నీటి కట కట మళ్లీ వచ్చింది. కాంగ్రెస్‌ వచ్చింది కరువు తెచ్చిందనేది ప్రజలకు అర్దమైంది. కేసిఆర్‌ను కాదనుకున్నందుకు తెలంగాణ ఇప్పుడు బాధపడుతుంది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలిస్తే తప్ప, ప్రజల కోసం మాట్లాడేవారు వుండరన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ఇదిలా వుంటే కేసిఆర్‌ ప్రజల్లోకి రాక ముందు ఒక లెక్క. ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. ఒక్కసారి కేసిఆర్‌ బస్సు యాత్ర మొదలు పెట్టిన తర్వాత కాంగ్రెస్‌, బిజేపి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. కేసిఆర్‌ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కేసిఆర్‌ను చూసేందుకు చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా, హోర్డింగులను పట్టుకొని వేళాడుతూ చూస్తున్నారు. చుట్టుపక్కల వున్న బిల్డింగులు నిండిపోతున్నారు. అలా కేసిఆర్‌ ప్రజల మధ్యకు రాగానే పల్లెలనుంచి, పట్టణాల నుంచి ప్రజలు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. మరోసారి బిఆర్‌ఎస్‌ ప్రభంజనం ఎలా వుంటుందో ప్రజలే చూపిస్తున్నారు. అందుకే మెదక్‌ లో వెంకట్రామ్‌ రెడ్డి విజయం ఖాయమని అందరూ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *