ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు.

ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించండి

ప్రజల ఇబ్బందులు తీర్చండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ నేటిధాత్రి:

గురువారం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 25.85 కోట్లతో పునరాభివృద్ధి చేసిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరీంనగర్లో జరిగిన రైల్వేస్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి వినతి పత్రం అందజేశారని, ఈవిషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ తీసుకొని, ఈఅభ్యర్థనకు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కోరారని తెలిపారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి, ఉప్పల్ రైల్వే బ్రిడ్జి కంప్లీట్ అయ్యేలా, తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాజేందర్ రావు కోరారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి రాజేందర్ రావు తీసుకొచ్చారు. వీటిపై ప్రత్యేక దృష్టిసారించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకొని, ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు తీర్చాలని రాజేందర్ రావ్ కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో నూటమూడు స్టేషన్లలో తెలంగాణ నుండి కరీంనగర్ , వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్ లను పునరాభివృద్ధి చేసి ప్రారంభించుకోవడం రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ ప్రజలు రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారని గుర్తు చేశారు. నాడు యూపీఏ ప్రభుత్వ హయంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడానికి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖ అధికారులు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version