ఈనెల 8న సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
భూపాలపల్లి నేటిధాత్రి
ఈనెల 8న మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బుధవారం కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, పూజారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో వడివట్టం కట్టి ఘన స్వాగతం పలికారు.
భద్రత, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలపై సమీక్ష
అనంతరం దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ప్రతి సెక్టార్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. దేవాలయాన్ని సుందరంగా అలంకరించాలని, పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ముమ్మరంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాలన్నారు.
ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటన దృష్ట్యా నాలుగు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా దారి సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
సీఎం పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్తు శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, ఆర్డబ్ల్యుఎస్ ఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎంపిఓ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
