వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం సబ్బపల్లి లోని గోదాము,నస్పూర్ మండల కేంద్రంలోని గోదాము,లక్షెట్టిపేట మండలం గుల్లకోట లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వెంకట్రావుపేట లోని గోదాము,లక్ష్మీపూర్ లలో గల రైస్ మిల్లులను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్,దండేపల్లి మండలం కన్నేపల్లిలో గల రైస్ మిల్లును మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు,నిల్వ,తరలింపు ప్రక్రియలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు,టార్పాలిన్ కవర్లు,తేమ యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు,గోదాములకు తరలించాలని తెలిపారు.రైస్ మిల్లుల నిర్వాహకులు కొనుగోలు కేంద్రాలనుండి వచ్చిన ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని, ఇందుకు అవసరమైన హమాలీల సంఖ్యను పెంపొందించుకోవాలని తెలిపారు.రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో త్వరగా సాధించే విధంగా అధికారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.లారీల యజమానులు ధాన్యం తరలింపులో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.గోదాములకు తరలించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని,తదుపరి ఆదేశాల ప్రకారం తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
