భద్రాచలం నేటి ధాత్రి
– ఏర్పాట్లను పూర్తిచేసిన నిర్వాహకులు.
– రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాద్రికి తరలి రానున్న క్రీడాకారులు.
నెహ్రూ కప్ ను విజయవంతం చేయండి : నెహ్రు కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి.
భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం నుంచి 29 వ నెహ్రూ కప్ తాళ్లూరి భారతీదేవి స్మారక అంతర్రాష్ట్ర ప్రైజ్ మనీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్, ఐటిసి పి.ఎస్.పి.డి, బత్తినేని ప్రకాష్, డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్, పాకాల దుర్గాప్రసాద్ ల సౌజన్యంతో పట్టణ ప్రముఖుల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోక్ లు తెలిపారు.
1994లో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంటును తోటమళ్ళ బాలయోగి (లెక్చరర్, గిరిజన గురుకులం) భద్రాచలం, వాతాడి దుర్గా అశోక్ (కేటీపిఎస్ ఉద్యోగి ) ప్రారంభించడం జరిగింది. మారుమూల ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం పుణ్యక్షేత్రంలో భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరు మీదుగా ఈ టోర్నమెంట్ ప్రారంభించటం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతూ 29వ సంవత్సరం కూడా నెహ్రూ కప్ క్రికెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానమును ఇందుకోసం అందంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ లో నలుదిక్కుల షామీయనాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పిచ్ నిర్మాణం చేశారు. సైడ్ వాల్ స్క్రీన్ ల మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి మొత్తం 21 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి. స్థానికుల యొక్క సహాయ సహకారాలతో ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే తొలి ప్రధాని నెహ్రూ పేరు మీదుగా ఇన్ని సంవత్సరాలు టోర్నమెంట్ నిర్వహించిన చరిత్ర లేదని, ఆ ఘన కీర్తి భద్రాచలంలో నిర్వహిస్తున్న నెహ్రూ కప్ కే దక్కిందని నెహ్రు కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోకులు వెల్లడించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ ద్వారా ఎంతోమంది యువతి, యువకులు క్రికెట్ లో రాణించి ఉన్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు.
నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని, నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకకు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ సభ్యులు, ఐటీసీ అధికారులు,పట్టణ ప్రముఖులు తదితరులు హాజరు కానున్నారని, ఈ వేడుకకు పట్టణ ప్రజలు, క్రికెట్ అభిమానులు తదితరులు తరలి రావాలని నెహ్రూ కప్ టోర్నమెంట్ గౌరవ సలహాదారులు ఎస్.కే అజీం, నెహ్రూ కప్ అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కన్వీనర్ ఎస్ కే సలీం, కోశాధికారి కుంచాల సదానందం, ఉపాధ్యక్షులు గుమ్ములూరు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఎం నాగార్జున, నిర్వాహక కమిటీ సభ్యులు పూనెం ప్రదీప్ కుమార్ తదితరులు వెల్లడించారు.