కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…
నేటి ధాత్రి -గార్ల :-3
భూస్వాములు,బడా రైతులు గార్ల పెద్ద చెరువు శిఖం భూములను దర్జాగా కబ్జా చేశారని, అక్రమంగా భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారుపెద్ద చెరువు భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని శనివారం మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ, చెరువు భూములు కబ్జా చేయడంతో చెరువు విస్తీరం తగ్గిపోవడం మూలంగా నీటి నీల్వ లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతుల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.కబ్జాదారులు చెరువులో ఎక్కువ లోతులో బావులు, బోర్లు, కరెంటు స్థంబాలు ఏర్పాటు చేసుకొని అక్రమంగా నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఒక్కసారి చెరువు నిండితే పంటలు పండే గార్ల చెరువు, రెండుసార్లు నిండి అలుగు పోసినప్పటికీ పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల పెద్ద చెరువు శిఖం భూములపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, ఇప్పటికే తప్పుడు పత్రాలు సృష్టించే పట్టాలు చేయించుకున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జి. సక్రు, మాన్య, యాకయ్య, సైదులు, వెంకన్న, వీరన్న, సురేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.