ధాన్యం నిల్వ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు,నిల్వ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదామును బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మండల తహసిల్దార్ కృష్ణ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా కేటాయించిన ప్రకారం గోదాములు,రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో గోదాములకు వచ్చే ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకొని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని తెలిపారు.రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి మండల కేంద్రంలో గల సింగరేణి క్లబ్,బూదకలాన్ గ్రామంలో గల సింగరేణి క్లబ్ లను సందర్శించి ధాన్యం నిల్వకు గల అవకాశాలను పరిశీలించారు.
సింగరేణి క్లబ్ లలో ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన అనుమతులు పొందాలని అధికారులకు సూచించారు.ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల కమ్యూనిటీ హాల్ ను కాసిపేట మండల తహసిల్దార్ సునీల్ దేశ్ పాండే తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల సమత రైస్ మిల్లును మండల తహసిల్దార్ సదానందం తో కలిసి పరిశీలించి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు.కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యం దిగుమతి వేగంగా చేసుకోవాలని, అవసరమైన మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని తెలిపారు.రైస్ మిల్లులకు నిర్దేశించిన సి.ఎం.ఆర్.లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
