బిసి యుద్ధం మల్లన్న!

`ఇప్పటి వరకు ఉద్యోగుల పరంగానే ఉద్యమాలు.

`మల్లన్నతో మొదలైన రాజకీయ పోరాటాలు.

`రాజకీయ ఐక్యత కోసం వేధికలు.

`రాజకీయంగా బిసిలు బలపడాలని గతంలోనూ సభలు.

`నాయకత్వ లేమితో చతికిలపడ్డాయి.

`ఆధిపత్య పోరులో మరుగునపడ్డాయి.

`బిసి నినాదమే రాజకీయంగా మల్లన్న.

`బిసిలందరినీ ఏకం చేసే ప్రయత్నం.

`తొలిసారి బిసిల ఐక్యత చైతన్యం.

`మల్లన్న భవిష్యత్తు బిసిల ఆశాకిరణం.

`తెలంగాణ ఉద్యమం తరహాలో బిసి ఉద్యమం జరగాలి.

`తెలంగాణ ఉద్యమాన్ని మించిన బిసిల పోరాటం రావాలి.

`బిసిలంతా నడుంబిగించాలి.

`మలితరంలోనైనా బిసిలు పాలక వర్గం కావాలి.

`ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది.

`బిసిలంతా మేలుకుంటేనే మంచిది.

`ఎన్నేళ్లైనా గొర్రెలే కాద్దామా!

`బర్రెలే మేపుకొని బతుకుదామా!

`చేపలు పట్టుకుంటూనే కూర్చుందామా!

`కుర్చీలలో కూర్చున్న వాళ్లను దేహీ అందామా!

`ఇప్పటికైనా కదలండి..బిసిలంతా మేలుకోండి.

`మానవ వనరులంటే గొర్రెలు, బర్రెలు కాదు.

`పాలకులంటే బిసిలకు బిక్షం వేసే వాళ్లు కాదు.

`పంచే స్థాయిలో బిసిలు వున్నారు.

`అడుక్కునే స్థాయిలో నిలబడ్డారు.

`పెట్టే స్థాయి కోసం ఐక్యం కావాలి.

`బిచ్చగాళ్లను చేస్తున్న వారిని తరిమేయాలి.

`బిసిలంతా రాజ్యాధిపతులు కావాలి.

`సామాజిక న్యాయం రాజకీయం నుంచే మొదలుకావాలి.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో బిసిలంటే ఎల్లకాలం ఓట్లకోసమేనా? నాయకుల పల్లకి సేవల కోసమేనా? వారికి నినాదాలు చేయడంకోసమేనా? కార్యకర్తలుగా మారి ఊడిగం చేయడానికేనా? బిసిలు సీట్లకోసం పనికిరారా? నాయకులుగా అసలే పనికిరారా? నాయకత్వం వహించే శక్తి బిసిలకు లేదా? బిసిల వాదన వినిపించేవారు లేరా? బిసిల ఐక్యత కూడగట్టే నాయకులే కానరారా? బిసిలలో ఈ తరం చైతన్యం కోసం కృషి చేసేవారు లేనే లేరా? అనుకుంటున్న తరుణంలో ఒక్కడు వచ్చాడు. కసితో వస్తున్నాడు. బిసిలకు జరుగుతున్న అన్యాయం నుంచి మొక్కై మొలిచాడు. బిసిల నినాదాన్ని వృక్షం చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని మించిన పోరు సలిపేందుకు వ్యూహం రచిస్తున్నాడు. ఆ ఒక్కడే మల్లన్న. తెలంగాణకు తెలిసిన తీన్మార్‌ మల్లన్న. ఒకప్పుడు ఒక సాదారణ జర్నలిస్టు మల్లన్న. ఇప్పుడు బిసిల గొంతు మల్లన్న. బిసిల నినాదం మల్లన్న. బిసిల ఆశాకిరణం మల్లన్న. బిసి రాజకీయ చైతన్యానికి వేదిక మల్లన్న. అవును.. కనుచూపు మేరలో కనిపించని బిసిల నాయకత్వానికి చుక్కానిలా మారింది మల్లన్న. ఇప్పటికైనా బిసిల సమాజం మేలుకోవాలి. మన హక్కుల సాధన కోసం ముందుకు రావాలి. మనం తయారు చేసిన నాయకులు బిసి భుజాల మీద కూర్చొని, పాలిస్తుంటే ఎంత కాలం మోస్తాం. బిసిల నెత్తి మీద నిలడబి తాండవం చేస్తుంటే ఎంత కాలం భరిస్తాం. అసలు బిసిలకు రాజకీయం వద్దా? పాలించే స్ధానం రావొద్దా? అరవైఏళ్ల తెలంగాణ రాజకీయంలో బిసిల ఆదిపత్యం ఎందుకు కానరావడం లేదు. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ విముక్తి కోసం ఆరాపటడిరది బడుగులే. పోరాటం చేసింది బడుగులే. తెలంగాణ విమోచనం జరిగితే సమిధలైంది బడుగులే. నైజాంకు నూకలు లేకుండా చేసి, దొరలను గడీల నుంచి తరమిస్తే, రాజకీయ సింహాసనం మీద కూర్చున్నారు. పల్లెలు వదిలి పట్నం చేరుకొని వ్యాపారులయ్యారు. రాజకీయాలలో చేరి పాలకులయ్యారు. నాడు కొట్లాడినా తెలంగాణ ఒరిగిందేమిటి? తెలంగాణ తెచ్చుకుంటే మిగిలిందేమిటి? వచ్చిన తెలంగాణలో బిసిల జాడ చూస్తే కనిపిస్తున్నదేమిటి? ఒక్క కేసిఆర్‌కు మంత్రి పదవి రాకుంటే తెలంగాణ ఉద్యమం చేశాడు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేశాడు. తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి పదవి కోసం జనాన్ని పరుగులు పెట్టించాడు. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయన్నాడు. మన నిధులు మనవే అన్నాడు. మన నీళ్లు మనకే అన్నాడు. తెలంగాణ వస్తే దళితుడే తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అధికారంలోకి వచ్చి మాట మర్చాడు. కాని ప్రశ్నించిన వాళ్లేరి. కొట్లాడిన వాళ్లేరి. నాలుగు కోట్ల జనంలో పిడికెడు ఉద్యోగాల్చి, పాలన కుర్చీల్లో ఉన్నత వర్గాలు కూర్చున్నాయి. మన నిధుల మనకే అంటూ మాయ మాటలు చెప్పారు. నిధులు రాలేదు. కొలువులు గతిలేదు. కాని పదేళ్ల పాలన మాత్రం దొరలు చూశారు. బడుగులేం చేశారు. పదవులు కోసం ఆశగా ఎదురుచూశారు. మళ్లీ దొరలకు వంగి వంగి దండాలు పెట్టారు. దొరలు కనికనించి ఇచ్చే పదవుల కోసం పాకులాడారు. బిసిలను విడదీసి కులాల కుంపట్లలో పదవులు పంచితే బొక్కాశకు ఎదురుచూశారు. ఇదేనా తెలంగాణ. ఇంతేనా తెలంగాణ. ఇంత కాలమైనా బడుగుల రాజ్యాదికారం రాదా? వద్దా? 

అందుకే ఒక్కడు గొంతు విప్పాడు. నేను యుద్దంచేస్తానంటున్నాడు.

 నేను ముందు నడుస్తానంటున్నాడు. రేపటి తరం కోసం కొట్లాడదామంటున్నాడు. బిసిల ఐక్యత కోరుతున్నాడు. కులాల మధ్య కుత్సితాలు పెంచేవారి దూరం కొట్టాలంటున్నాడు. బిసిలంతా ఐక్యమైతే తిరుగులేదంటున్నాడు. యాచించేస్ధాయి నుంచి శాసించే స్ధాయికి బిసిలు రావాలంటున్నాడు. రాజకీయంగా ఎదగాలంటున్నాడు. పాలకులు వేసే పేలాల కోసం ఎదురుచూడడం కాదు. పాలకులుగా మారి సంపదల సమన్యాయంచేద్దామంటున్నాడు. సామాజిక న్యాయం జరగాలంటున్నాడు. బిసిలు పాలించే స్ధాయిలో కూర్చోవాలంటున్నాడు. అందుకు పాలకులుగా మారాలంటున్నాడు. గ్రామం నుంచి ఆ చైతన్యం రావాలని కోరుకుంటున్నాడు. ఆ దీప్తి కోసం తాను కదులుతున్నాడు. సర్పంచ్‌ స్ధాయి నుంచి మండల,జిల్లా స్ధాయిలు దాటి నాయకులు కావాలంటున్నాడు. చట్టసభల్లో బిసిల ప్రాతినిద్యమే కనిపించాలని కోరుతున్నాడు. చట్టాలు చేసే స్ధాయిలో బిసిలు వుంటే, పదేళ్లలో బడుగుల ప్రగతి పరుగులు తీస్తుందంటున్నాడు. అరవై ఏళ్లులో ఎంతో మంది మాటలు విన్నారు. నాడు బిసిల సదస్సులు ఎన్ని జరిగినా నాయకులు పడికెడు మంది బలపడ్డారు. పాలకుల ఆశీస్సుల కోసమే ఆ బిసిలు పాకులాడారు. బిసిలను అడ్డంపెట్టుకొని రాజకీయం చేశారు. కాని బిసిల కోసమే రాజకీయం చేసే నాయకుడు వచ్చాడు. మల్లన్న రూపంలో బిసిల తీన్మార్‌ మోగించనున్నాడు. తెలంగాణ బిసి సమాజాన్ని మల్లన్న ప్రశ్నిస్తున్నాడు. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైయినా గొర్రెలే కాచుకుందామా? తెల్లారిలేస్తే గొర్రెల కాపరిగానే బతుకుదామా? గొర్రెలు కాయందే బతుకు తెల్లారని బతుకులతోనే ముడిపడదామా? అంటున్నాడు. ఉన్నోడు గొర్రెల ఫామ్‌లు ఏర్పాటు చేసుకొని, కూలీలుగా బిసిలను పెట్టుకొని కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాడు. బ్యాంకుల వాళ్లనే నమ్ముతున్నాయి. వాళ్లకే రుణాలిస్తున్నాయి. వాళ్లు మునిగామని చెప్పి, బ్యాంకులను ముంచినా వదిలేస్తున్నాయి. అదే బిసిలు సాగు కోసం రుణం తీసుకుంటే తలుపు చెక్కలు ఎత్తుకెళ్తున్నాయి. ఈ సూక్ష్యం అర్దం ఇంకెప్పటికి అర్ధమౌతుంది. జీవితాంతం నాలుగు బర్రెలు కాచుకుంటేనే బతుకుదామా? భూస్వాములు వంద బర్రెలకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకొని, బిసిలతో పాలు పిండిస్తుంటే, పేడ కడులు ఎత్తిస్తుంటే అదే బాగ్యమని బతుకుదామా? చెరువుల్లో చేప పిల్లలు వేశాం..పట్టుకొని అమ్ముకొని బతకండి. బురదల్లో జీవించండి. చెరువు గట్ల మీద తాడి చెట్లు, ఈత చెట్లు పెంచుతామంటే బతుకంతా కళ్లు గీసుకొనే బతుకుదామా? కాలు జారి ప్రమాదంలో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా కోసమే ఎదుచూద్దామా? కాలు , చెయ్యి విరిగితే పించన్లకోసమే ధరఖాస్తులు చేసుకుంటేనే వుందామా? ఇంతకు మించి గీతకార్మికులకు బతుకు లేదా? ఉన్నత వర్గాలు బార్లు, హోటళ్ల వ్యాపారాలు సాగిస్తుంటే వాటిలో కూలీలుగా మారుదామా? అని మల్లన్న ప్రశ్నిస్తున్నాడు. 

ఉన్నత వర్గాలను కుర్చీలెక్కించి, ఏసిల్లో కూర్చోబెట్టి వారి సంపాదనలకు మార్గం మనమే అవుదామా? వాళ్లను ప్రతిసారి దేహీ అంటూ కాలం గడుపుదామా? 

మానవ వనరులంటే గెర్రెలు, బర్రెలు కాదు. వాటితో ఉపాదితో జీవితాలు మారవు. బిసిలంటే పాలకులు వేసే బిక్షానికి ఆశపడే వారు కాదు. చరిత్ర కారులు కావాలి. చరిత్ర సృష్టించే వాళ్లు కావాలి. చరిత్రలో బిసిల చరిత్రకు మూలం కావాలి. పాలకులు కావలి. పాలించే స్దాయిలో బిసిలు నిలబడాలి. బిసిలే ఆదాయం. కాని ఎందుకు ఎంగిలి మెతుకుల కోసం ఆరాటపడుతున్నామో! ఆలోచించుకోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్నది మొదటికే మోసం తెచ్చింది. దశాబ్ధాలుగా పోరాటం చేసిన బిసిలకు ఆ సంకెళ్లె మిగిలాయి. వారి జీవితాలు అక్కడే ఆగిపోయాయి. పోరాడితే పాలించే కాలం వస్తుందన్న నిజాన్ని బిసిలు నమ్మాలి. ఒకప్పుడు తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం చేసింది. ఏం లాభం? భూమి రాలేదు. భుక్తి సమకూరలేదు. విముక్తి జరిగిందన్న ఆశ తప్ప, నాటి ఆశయాలేమీ నెరవేరలేదు. ఇప్పుడు కూడా బిసిలు చేయాల్సింది ఆకలిపోరాటం కాదు. రాజకీయ పోరాటం. ఆధిపత్య పోరాటం. సామాజిక న్యాయం కోసం పోరాటం. బిసిల రాజ్యాదికార పోరాటం. పాలనలో కీలక భూమికోసం పోరాటం. బిసిలు రాజకీయ పోరులో ఆరాటం వుంటే సరిపోదు. ఆచరణ కావాలి. బిసిలందరూ ఐక్యం కావాలి. ఏకం కావాలి. సమిష్టి పోరాటం దిశగా అడుగులు వేయాలి. ఓటు బ్యాంకు రాజకీయం బిసిలు చేయాలి. మన ఓటు మన రాజకీయం అన్న చైతన్యం రావాలి. ఆ బాటలో మల్లన్నను అనుసరిద్దాం. మల్లన్నతో పాటు అడుగులు వేద్దాం. మల్లన్నతో నడుద్దాం. బిసిల ఐక్యత సాదిద్దాం. బిసిలంతా నడుంబిగించి, పాలితులుగా ఎదిగేదాకా సాగుదాం…తెలంగాణలో బిసిల రాజ్యం ఎందుకు రాదో చూద్దాం..ఒక ప్రయత్నం చేద్దాం! తరతరాల బానిసత్వాన్ని పారద్రోలుదాం…మనల్ని మనం పాలించుకుందాం..మన జాగృతి కోసం మనమే బాటలు వేసుకుందాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *