ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి…

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి

 

 

 

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

 ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు.తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.

మహిళా శక్తి – సమాజ ప్రగతికి బలమైన పునాది…

మహిళా శక్తి – సమాజ ప్రగతికి బలమైన పునాది

ఆత్మవిశ్వాసంతో ముందుకు నేటి మహిళలు.

మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సేవలకు కృతజ్ఞతా వందనం.

వరంగల్, నేటిధాత్రి.

 

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేసే ప్రత్యేక రోజు ఇదే. కుటుంబ నిర్వహణ నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

మహిళల విద్యా హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సామాజిక సంస్కర్తల్లో ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రీబాయి పూలే. మహిళలకు విద్య అవసరమని సమాజానికి చాటి చెప్పిన ఆమె సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన కవయిత్రి సరోజినీ నాయుడు మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

దేశ రాజకీయ చరిత్రలో ధైర్యవంతమైన నాయకురాలిగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మహిళలు కూడా అత్యున్నత పదవులను అధిరోహించగలరని నిరూపించారు. అంతరిక్ష రంగంలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కల్పన చావ్లా యువతకు ప్రేరణగా నిలిచారు.

క్రీడా రంగంలో కూడా భారత మహిళలు విశేష విజయాలు సాధిస్తున్నారు. ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు మరియు ప్రపంచ స్థాయి బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ భారత మహిళల ధైర్యం, పట్టుదల ప్రపంచానికి చాటిచెప్పారు.

ఇలాంటి గొప్ప మహిళల స్ఫూర్తితో నేటి మహిళలు కూడా విద్య, స్వావలంబన, ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధిలో కూడా మహిళలు కీలక పాత్ర పోషించాలని వారు పేర్కొంటున్నారు.

నేటి మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను నిరూపించుకుంటే సమాజ ప్రగతికి మరింత బలమైన పునాది ఏర్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని నిపుణులు పేర్కొంటున్నారు.

విద్య, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం వంటి అనేక రంగాల్లో మహిళలు తమ ప్రతిభతో సమాజ ప్రగతికి బలమైన పునాది వేస్తున్నారు. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధించగలదని నిపుణులు పేర్కొంటున్నారు.

మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ వారి సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్ని మహిళా దినోత్సవం ఇస్తోంది.

✍️✍️
గంగరాజు కందికొండ
స్టాఫ్ రిపోర్టర్, నేటిధాత్రి, వరంగల్.

అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం…

అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం

 

 

 

సౌదీ అరేబియాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్ర వనిత చేతనకు తన అభిప్రాయాలను పంచుకునే అరుదైన అవకాశం దక్కింది. విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల ఆరోగ్య భద్రతపై ఆమె ప్రసంగించారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అరబ్బు దేశంలో జరిగిన ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్మిక సదస్సులో పాల్గొని కీలకమైన అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అరుదై అవకాశం ఒక ఆంధ్ర వనితకు దక్కింది.

సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐరోపా యూనియన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో, సరైన వసతులు, వెలుతురు, గాలి లేకుండా నివసించే కార్మికుల పరిరక్షణలో సామాజిక బాధ్యత అనే అంశంపై ఈ సదస్సులో జరిగిన చర్చలో తాను ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో మాట్లాడానని చేతన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version