ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు…

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ 85.21 శాతం

వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ 86.23 శాతంగా నమోదు

వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ కేంద్రాలలో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 20 పోలింగ్ కేంద్రాలలో 86.23 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 10,526 మంది ఓటర్లలో 9,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు.
రెండు మున్సిపాలిటీలలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. గుర్తించిన ఆరు సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు.పోలింగ్ ముగిసిన అనంతరం నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు మరియు పోలింగ్ సామగ్రిని సంబంధిత వర్ధన్నపేట మునిసిపల్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌కు భద్రతా ఏర్పాట్ల నడుమ సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఎన్నికల సిబ్బంది, పోలీసు శాఖ, అధికారులు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములైన ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా అధిక శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులు సందర్శన…

ఎన్నికల వ్యయ పరిశీలకులు సందర్శన

నర్సంపేట, నేటిధాత్రి:

 

రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఎన్నికల వ్యయ పరిశీలకులు శివకుమార్ నాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్న మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన పంపిణీ ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న ఎన్నికల సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. పోలింగ్ సామగ్రి సకాలంలో, సురక్షితంగా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిశీలకులు, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించి, బ్యాలెట్ పేపర్లు మరియు బ్యాలెట్ బాక్సుల భద్రతకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎన్నికల వ్యయ నియంత్రణ, నియమ నిబంధనలు కచ్చితమైన అమలుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు
చేసుకోవాలని తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ ఉమారాణి,జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి,జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి,మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version