క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….?

కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గానికే పీఠమా..?

మున్సిపల్ పీఠానికి సీపీఐ కీలకం కాబోతుందా..?

రిజర్వేషన్ అనుకూలిస్తే బడా నేతలు బరిలోకి…!

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.బీఆర్ఎస్, సిపిఐ, బిజెపి పార్టీల నుంచి కూడా పలువురు టికెట్ల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గమే మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే..క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త నేతలకు పాత నేతలకు మధ్య సయోధ్య కుదరకపోవడమే ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకరికి మించి ఒకరు టికెట్ల కోసం స్థానిక మంత్రి వద్ద అపాయింట్మెంటు లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే టికెట్ దక్కేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్టు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుండే కొత్త నేతలు అంతా కలిసి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారిన నేతలు మళ్లీ పాత పార్టీకే వెళదామా లేదా ఇదే పార్టీలో కొనసాగుదామా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పార్టీ నుండి వెళ్లిన వారిని తమ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు అన్నట్లు సంకేతాలు పంపిస్తున్నప్పటికీ, బలమైన నేతలు మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్లు రాజకీయ వర్గాలుచెబుతున్నాయి. మున్సిపాలిటీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంత్రి ఇలాఖాలో మున్సిపాలిటీ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో అని రాష్ట్ర ప్రజానీకం,పుర ప్రజలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ పీఠానికి సిపిఐ పార్టీ కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్లపై చర్చ….

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అన్ని పార్టీల నాయకుల్లో రిజర్వేషన్ పై చర్చ జరుగుతుంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్ ఉంటుందని సంకేతాలు వస్తున్నా సరే రొటేషన్ లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగానే ఉంది.మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ స్టేట్ ప్రాతిపాదికన జరిగే అవకాశం ఉన్నందున ఆ జాబితాను పరిశీలించిన తర్వాతే కొందరు కీలక నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version