చట్టబద్ధమైన విధానం లోనే ప్రజలకు న్యాయం
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం – ప్రతి సోమవారంప్రజాదివాస్ కార్యక్రమం
మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ గారు ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పిర్యాదుదారుల నుండి మొత్తం 20 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు జారీ చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
