సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం..
ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి
వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్, భీమారంలో పోలీస్ స్టేషన్ మంజూరుకు కృషి
డీజీపీ బీ శివధర్ రెడ్డి
రుద్రంగిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి డీజీపీ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన
హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల ప్రతినిధి (నేటి ధాత్రి):
రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని డీజీపీ బీ శివధర్ రెడ్డి తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో రూ.2 కోట్ల 50 లక్షలతో ఎకరం స్థలంలో ఆధునిక హంగులతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డీజీపీ బీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ బీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిజం అంతమైందని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసింగ్ లో నూతన మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. ప్రజల కేంద్రగానే సేవలు అందించేలా పోలీసులకు శిక్షణ ఇస్తామని, అదే స్థాయిలో విస్తృత సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమ కోసం.. తమ కుటుంబ సంక్షేమం కోసం హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. హత్యలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో ఎక్కువ మరణాలు జరగడంలేదని, రోడ్డు ప్రమాదాల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ద్విచక్ర వాహనదారులు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. పౌరులు బాగుంటే రాష్ట్రం.. దేశ అభివృద్ధి సాధ్యమని, ఇందులో భాగంగానే అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో వేములవాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, భీమారంలో పోలీస్ స్టేషన్ మంజూరుకు కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నానని తెలిపారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అండగా ఉంటున్నారని చెప్పారు.
ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకం
ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమైనవి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. అన్ని సెలవుల్లో విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి హోమ్ శాఖ తాను నిర్వహిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు దాడులు చేస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ఇటీవల ప్రారంభించామని గుర్తు చేశారు. అరైవ్.. అలైవ్ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. తాను కోరిన వెంటనే రుద్రంగికి సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ మంజూరు చేశారని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనులు రూ.150 కోట్లతో కొనసాగుతున్నాయని, మూడో బ్రిడ్జి పనులు చేయిస్తున్నామని, రుద్రంగికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు అయిందని, కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వేములవాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని, భీమారంలో పోలీస్ స్టేషన్ ఇవ్వాలని, వేములవాడలో ఆలయ భద్రత సిబ్బంది సంఖ్యను పెంచాలని డీజీపీని కోరారు.రుద్రంగి, భీమారంలో రెవెన్యూ, మండల పరిషత్ భవనాలు ఇస్తానని మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో తాను భాగస్వామి కావడం అదృష్టమని పేర్కొన్నారు.
నూతన పోలీస్ స్టేషన్ ఎంతో కీలకం
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత.. మెరుగైన సేవలు అందించేందుకు నూతన పోలీస్ స్టేషన్ ఎంతో కీలకమని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఎకరం 10 గుంటల స్థలం కేటాయించామని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ, అధికార యంత్రాంగంతో కలిసి ఇటీవల జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జనవరిలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించామని తెలిపారు.
రోడ్డు భద్రత అందరి బాధ్యత..
జిల్లాలోని రుద్రంగి మండలం చిన్నదని, రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని తెలిపారు. మండల ప్రజల సహకారంతో మండల కేంద్రంలో నేరాల నియంత్రణ కోసం ఇటీవల హై క్వాలిటీ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏ ఎన్ పి ఆర్) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మితమయ్యే ఈ పోలీస్ స్టేషన్ ద్వారా మండల ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే కాకుండా, ప్రజల్లో భద్రతాభావాన్ని మరింత పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషించనుందన్నారు.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఇటీవల అరైవ్.. అలైవ్ కింద జిల్లాలో నో హెల్మెట్.. నో ఎంట్రీ అమలు చేస్తున్నామని, ఇప్పటికే అన్ని గ్రామాల సేఫ్టీ కమిటీలకు తెలిపామని,ఆర్టీసీ, ప్రైవేట్ స్కూల్ బస్, ఆటో మున్సిపల్ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించామని, సీపీఆర్, ప్రాథమిక ఆరోగ్య చికిత్స పై అవగాహన కల్పించామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మెన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాభాయ్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్లు పుష్పలత, జయంత్ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు, సీఐ లు, ఎస్ఐలు, పోలీస్ హౌసింగ్ బోర్డ్ అధికారులు సుందర్, రాజశేఖర్, వినేయ్ , సుదర్శన్,సర్పంచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
