ఎస్ఐఆర్ 2026పై సమీక్ష సమావేశం
పరకాల,నేటిధాత్రి
ఓటరు జాబితా సవరణలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియను వేగవంతం చేయడానికి పరకాల తహసిల్దార్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు.2002 సంవత్సరం ఓటరు జాబితాలో ఉన్న పేర్లను 2025 ఓటర్ జాబితాకు అనుసంధానం(మ్యాపింగ్)చేసే అంశంపై ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి తహసిల్దార్ టి.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ కె.నారాయణ హాజరయ్యారు.పరకాల మండలంలో మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా చేపట్టాలని ఇంకా మ్యాపింగ్ కాని వ్యక్తుల వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించాలని ఆయన సూచించారు.2002 ఓటరు జాబితాను ఆధారంగా తీసుకుని సంబంధిత వ్యక్తుల పేరు,తల్లిదండ్రులు లేదా తాతల వివరాలను నమోదు చేయాలని బూత్ లెవల్ అధికారులకు(బిఎల్ఓ)ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి సమన్వయం అవసరమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీఎల్ఓలు, చౌక ధరల దుకాణ డీలర్లు,మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు,వార్డు ఆఫీసర్లు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
