శ్రీరామనవమికి సీతారామ క్షేత్రం ముస్తాబు…
◆”-: రాములవారి కళ్యాణానికి సర్వం సిద్ధం
◆”-: హాజరుకానున్న పీఠాధిపతులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రకృతి రమణీయత మధ్య ఆకుపచ్చని అటవీ ప్రాంతంలో వెలసిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈనెల 27న సందర్భంగా భక్తులతో కిటకిటలాడనుంది. దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటు పల్లకి సేవను ఘనంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, నిత్యార్చనలు, హోమాలు, హరినామ సంకీర్తనలు, అన్నదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి 1008 మహామండలేశ్వరులు సిద్దేశ్వరానందగిరి మహరాజ్, తంగేడు పల్లి కోటి లింగేశ్వర మఠం పీఠాధిపతి 108 శివయోగి శివచార్య మహాస్వామి, కుప్పా నగర్ -చిలేపల్లి మల్లన్న గట్టు ఆశ్రమ పీఠాధిపతి బసవలింగ అవధూత హాజరుకానున్నట్లు తెలిపారు. శ్రీరాముని భక్తులు, హిందూ బంధువులందరూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
