Farmers Say No to NIMZ Land Acquisition
సచ్చినా భూములు ఇవ్వం………”
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: దేశానికి రైతు వెన్నుముక అంటున్నారు.సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను పరిశ్రమల పేరిట తీసుకోవడం సమంజసం కాదని, ఇప్పటికే 2 వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చాం. ఇకముందు సచ్చినా భూములు ఇవ్వం అని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి రైతులు ముక్తకంఠంతో రెండో విడత భూసేకరణను వ్యతిరేకించారు. గ్రామంలో రైతులు ఆందోళన చేస్తారని అనుమానంతో జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) భూసేకరణలో భాగంగా మంగళవారం ఎల్గోయి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీబాయి అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్ తిరుమలరావు, స్థానిక రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. గ్రామంలో రెండో విడత భూసేకరణలో 103 మంది రైతులకు గాను 195 ఎకరాల భూముల భూసేకరణ అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు. గతంలో గ్రామంలో 1,800 ఎకరాలకు పైగా భూమిని పరిశ్రమల కోసం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గతంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రైతుల అభిప్రాయ సేకరణలో ముక్తకంఠంతో మేము ప్రాణాలైనా అర్పిస్తాం, భూములు మాత్రం ఇచ్చేది లేదు అని తేల్చిచెప్పారు. సభఅనంతరం తహసిల్దార్ తిరుమలరావు సభ మినిట్స్ను రైతులకు వివరించారు. రైతులకు ఎంత నచ్చజెప్పినా ఒక్క రైతు కూడా సంతకం పెట్టలేదు. సంతకాలు పెట్టకుండా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
