మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట డిపో జేఏసీ విజ్ఞప్తి
నర్సంపేట,నేటిధాత్రి:
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జూన్ 5 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగు మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావాలని 40 వేల మంది యావత్ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహా విశేష కృషి చేశామని, గెలుపులో భాగస్వామ్యం అయ్యామని వారు గుర్తు చేశారు.
ఆర్టీసీ ప్రభుత్వ విలీనం అయితే తమ జీవితంలో అద్భుతం జరుగుతుందని కార్మికులు ప్రతి రోజు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం అయినటువంటి ప్రభుత్వ విలీనం అడుగు దూరంలో ఆగిందని, దాన్ని కేబినెట్ సమావేశంలో “విలీనం అమలు తేదీ” ని సగర్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని వారు కోరారు.

మహిళా ప్రయాణీకుల కోసం ఉచిత మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.
పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని, ప్రతి నెల మహాలక్ష్మి డబ్బులతోనే ట్రెజరరీ నుండి జీతాలు సులభంగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చెల్లించవచ్చని వారు అన్నారు.
విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021 మరియు 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులందరం జీవితాంతం ఋణపడి ఉంటామని రంగయ్య, వేణు తెలిపారు.