ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సహకారం అందజేస్తాం-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని బూరుగుపల్లి గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధి హామీ నిధులు ఎనిమిది లక్షలతో నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించారు. అనంతరం గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సహకారంతో పాఠశాలలో ఏర్పాటుచేసిన లైబ్రరీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలలో డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొత్త పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు సహకరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఈసందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈకార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, స్థానిక సర్పంచ్ దూలం కల్యాణ్, తాహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రాము, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ముద్దం నగేష్, ఉప సర్పంచ్ తిరుపతి, సాగి అజయ్ రావు, దూలం శ్రీనివాస్, దూలం అంజయ్య, బుర్గు గంగన్న, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
