సైబర్ నేరాలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రామానంద్*
*నర్సంపేటలో సైబర్ క్రైమ్పై అవగాహన సదస్సు
* ఐసీడీఎస్, మెప్మా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమం
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మెప్మా, పోలీసు శాఖల సమన్వయంతో మెప్మా కార్యాలయంలో సైబర్ క్రైమ్, బాలల రక్షణ, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీఓ మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ సెల్ఫోన్లు సైబర్ నేరాలకు దారితీస్తున్నాయని, పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే స్పందించాలని, షీ టీం, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930ను వినియోగించుకోవాలని సూచించారు. కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ టెక్నాలజీలో మంచిని మాత్రమే స్వీకరించాలని, వేసవిలో కంప్యూటర్, శరీర దారుఢ్య శిక్షణలు తీసుకోవాలన్నారు.
సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఒంటరిగా ఉంటారని, డ్రగ్స్కు ముందు సిగరెట్లకు అలవాటు పడతారని, తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు. డాక్టర్ శ్రావణ్, కౌన్సిలర్ రోజా రాణి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిస్థితులు గమనించాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్లకార్డుల ప్రదర్శన, సైబర్ క్రైమ్ ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, షీ టీం నాగభవ్య, అంగన్వాడీ అధ్యక్షురాలు నల్లా భారతి, కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
