పోలేక పొగబెట్టుకుంటున్నారు?

`ఈటెల, రాజగోపాల్‌ డిల్లీలో చర్చలు జరుపుకుంటున్నారు?

`బిజేపి కి దూరమయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు?

`పార్టీని బలోపేతం చేయలేమని గ్రహించారు?

`కుర్చీ వేసి కూర్చోబెడతారనుకున్నారు?

`కనీసం పట్టించుకోవడం లేదు?

`బిజేపి లో ఇంకా వుంటే ఎటూ కాకుండా పోతామని గ్రహించారు?

`నిన్నటి దాకా రాష్ట్ర బిజేపి మీద నిందలేశారు?

`ఇప్పుడు కేంద్ర పార్టీకి గట్టిగా చెప్పామని చెప్పుకుంటున్నారు?

`కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పామన్నారు?

`అవేంటో చెప్పమంటే ముఖం చాటేశారు?

`తెలంగాణ లో ఆత్మగౌరవంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు?

`కనీసం పార్టీ ఆఫీసులోకి వెళ్లలేక గేటు ముందు పడిగాపులు కాశారు?

`విధిలేక మాడిపోయిన ముఖాలతో వెనుదిరిగారు?

`ప్రగతి భవన్‌ ముందు నాడు పరువుపోయిందన్నారు. నేడు డిల్లీలో పరువు తీసుకున్నారు?

`పార్టీ మారే చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

వుండాలని లేదు. నచ్చజెప్పినా వినాలని లేదు. బలవంతం చేసినా ఆగాలని లేదు. బిజేపి లో ఇంకా కొనసాగితే భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకం లేదు. బిజేపి తెలంగాణలో అధికారం రాదు? ఆ పార్టీనే ఇంకా నమ్ముకుంటే లాభం లేదు? వాళ్లకు మంచి రోజులొస్తాయన్న విశ్వాసం అసలే లేదు ? బిజేపి బలపడుతుందనే ఆశలు లేవు. కళ్ల ముందు కనిపించడం లేదు. పార్టీ ఊపు మీదుందన్న ప్రచారం లేదు. దానికి తోడు వాళ్లకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఒక రకంగా పార్టీలో పెద్దగా పట్టించుకునే వారు లేదు. పైకి కనిపించేదంతా నిజం కాదు. బిజేపి లో నిష్టూరాలు ఇంకా భరించడం వారి వల్ల కాదు. ఇంటా, బైట విలువ లేదు. ఎన్నికలొస్తే తప్ప వారికి పని లేదు. ప్రజల్లోకి నేరుగా వెళ్ల స్వేచ్చ లేదు. గతంలో లాగా అభిప్రాయాలు చెప్పుకునే వీలు లేదు. చర్చలకు ఆస్కారం లేదు. కలిసి సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంత కాలమైనా వలస వాదులన్న ముద్ర చెరిగిపోలేదు. పార్టీ కోసం ఎంత పని చేసినా గుర్తింపు లేదు. గౌరవం అంతకన్నా లేదు. వారి ప్రయత్నం వారు చేస్తున్నారనే వాళ్లు లేరు. మొదట్లో వున్నంత హడావుడి ఇప్పుడు లేదు. అక్కున చేర్చుకున్నంత గొప్పగా మాట్లాడుతున్న వారు లేరు. ప్రతి దానిని భూతద్దంలో చూస్తున్నారు. ప్రతి అడుగును శంకిస్తున్నారు. ఎవరు కలిసినా పెడర్థాలు తీస్తున్నారు. ఎవరితో మాట్లాడినా గుసగుసలు రాజేస్తున్నారు. ఊహాగానాలు సృష్టిస్తున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే కొందరు కుంపటి పెడుతున్నారు. పొగ మా వైపునుంచి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. అయినా వెళ్లడం లేదని అంటున్నారు. వెళ్లే వారిని ఆపాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మమ్మల్ని తరిమేయాలనే చూస్తున్నారు. అయినా పట్టుకొని వేళాడుతున్నా అడుగడుగునా ఎలా అవమానానికి గురి చేయాలో అంతా చేస్తున్నారు. ఇది ఈటెల రాజేందర్‌, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిల మనసులో వున్న ఆవేదన, ఆందోళన, ఆక్రోశం అంటూ వస్తున్న వార్తల సారాంశం. ఇవి నిజమా? కాదా? అన్న దానిపై చర్చతో పాటు వీళ్లిద్దరూ ఏం చేస్తారన్న దానిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 

చాలా మంది అంటున్న మాట. అనుకుంటున్న మాట. ఈటెల, కోమటి రెడ్డి ఇద్దరూ పోలేక పొగబెట్టుకుంటున్నారు?

 అందుకే డిల్లీ లో మంత్రాంగం నడుపుతున్నారు. డిల్లీ వేదికగా ఈటెల, రాజగోపాల్‌ డిల్లీలో చర్చలు జరుపుకుంటున్నారు? ఎటు వెళ్తే బాగుంటుందన్న దానిపై మధనపడుతున్నారు. మల్లగుల్లాలు పడుతున్నారు. హైదరాబాదు లో వున్నా బాగుండేది. డల్లీ వచ్చి పరువుపోగొట్టుకున్నట్లైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలవాలని వస్తే ఆయన హైదరాబాదు వెళ్లారు. ఆ విషయం బిజేపి కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్తే గాని తెలియలేదు. అంత పెద్ద పార్టీలో ఇంత చిన్న విషయం ఇద్దరు నేతలకే తెలియలేదు. ఇదిలా వుంటే వాళ్ళిద్దరూ కావాలనే డిల్లీ వెళ్లారు. కావాలనే తమకు సానుభూతి కోరుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడు హైదరాబాదు వస్తున్న సంగతి తెలిసి కూడా కావాలనే డిల్లీ వెళ్లారు. ఇది పార్టీలో చెప్పుకుంటున్న మాట. ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్దం అన్నది వాళ్లకే వదిలేద్దాం!!

బిజేపి కి దూరమయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు? పార్టీని బలోపేతం చేయలేమని, అది కష్టమని ఇద్దరు నేతలు గ్రహించారు?

బిజేపి లో తమకు కుర్చీ వేసి కూర్చోబెడతారనుకున్నారు? కానీ రోజులు గడుస్తున్నా అది కనిపించడం లేదు. కనీసం తమ స్థాయిని కూడా పట్టించుకోవడం లేదు? బిజేపి లో ఇంకా వుంటే ఎటూ కాకుండా పోతామని గ్రహించారు? నిన్నటి దాకా రాష్ట్ర బిజేపి మీద నిందలేశారు? ఇప్పుడు కేంద్ర పార్టీకి గట్టిగా చెప్పామని చెప్పుకుంటున్నారు? అసలు జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాదు లో నేరుగా ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇద్దరే డిల్లీ వెళ్లి చెప్పేంత సీక్రెట్‌ ఏముంటుంది? ఇక్కడ చెప్పలేనంత రహస్య విషయం ఏం దాగుంది? అధిష్టానానికి గట్టిగా చెప్పే అవకాశం రాష్ట్ర నాయకులకు వుంటుందా? వాళ్ల ముందు నోరు పెద్దది చేసుకునే అవకాశం ఇస్తారా? కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పామన్నారు? అవి ఏమిటో చెప్పలేకపోతే ప్రజలకెలా తెలుస్తుంది? అవేంటో చెప్పమంటే ముఖం చాటేశారు? తెలంగాణ లో ఆత్మగౌరవంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? కనీసం పార్టీ ఆఫీసులోకి వెళ్లలేక గేటు ముందు పడిగాపులు కాశారు? గేటు ముందు పడిగాపులు కాసే వారి మాటలు ఎక్కడైనా విన్నట్లు చరిత్ర వుందా? 

 విధిలేక మాడిపోయిన ముఖాలతో వెనుదిరిగారు? ఇంతకన్నా పరువు తక్కువ ఏమైనా వుంటుందా? 

 ప్రగతి భవన్‌ ముందు నాడు పరువుపోయిందన్నారు. నేడు డిల్లీలో పరువు తీసుకున్నారు? ఇది స్వయం కృతాపరాధం కాదా? పార్టీ మారే చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు? అనే దానికి సంకేతం కాదా? డిల్లీ పెద్దలను కలిశాం…అన్నీ చెప్పాం…అనుకున్నాక ఇంకా అక్కడే ఎందుకు మకాం వేశారు? లోకో భిన్న రుచి…ఇప్పుడు ఈ ఇద్దరిదీ ఎటు దారి!!

ఫ్రస్ట్రేషన్ పీక్..బీజేపీ బెదిరింపుల రాజకీయం

 

BJP Politics :

బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ, హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో వారు షాక్ అయ్యారు. పార్టీ వీడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిన తీరు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది.

తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ మొదలైంది. ఇప్పుడు అది ఢిల్లీ వరకు చేరింది. బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అంచనాలు వేసినా సఫలం కాలేదు. బండి సంజయ్ నాయకత్వం పైన ఒక విధంగా పార్టీలో నేతలు తిరుగుబాటు చేసారు. పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు చేసారు బండిని మార్చాలంటూ డిమాండ్ చేసారు. పార్టీలో పరిణామాల పైన రిపోర్టులు ఇచ్చారు. బీజేపీ అధినాయకత్వం లైట్ తీసుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని స్థాయిలోనూ నేతలు కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ ..బీజేపీ నాయకత్వాల తెర వెనుక రాజకీయం తమ మనుగడకే ముప్పు తెస్తుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ నేతలను కాంగ్రెస్ లో చేరాలంటూ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఒక హైకమాండ్ తో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని తాజాగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పార్టీలో పరిస్థితి వివరించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం మార్చాలని కోరారు. తమను ఢిల్లీకి పిలిచి అటు కేటీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వటం పైన సందేహాలు ఉన్నాయని స్పష్టం చేసారు. కవిత అరెస్ట్ కాకపోవటంతో అనుమానాలు బల పడుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ ను దెబ్బ తీసే నిర్ణయాలు తీసుకోకుంటే తాము పార్టీలో కొనసాగే అవకాశాలు లేవని.. నియోజకవర్గాల్లో తమ పైన ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేసారు.

వీరి వాదన విన్న తరువాత పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సమాధానంతో ఈ ఇద్దరు నేతలు షాక్ కు గురయ్యారు. కేటీఆర్ తో అమిత్ షా సమావేశం అయితే చివరి నిమిషంలో రద్దు అయింది. కానీ పార్టీ మారేలా తమ పైన ఒత్తిడి ఉంది..కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందంటూ సొంత పార్టీ నేతలు చెప్పిన సమాచారం మాత్రం బీజేపీ నాయకత్వం జీర్ణించుకోలేక పోయింది. పార్టీ వీడే ఆలోచన చేస్తే సహించేది లేదని పార్టీ అధినాయకత్వం హెచ్చరించినట్లు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. సహజంగా బీజేపీ నాయకత్వం విచారణ సంస్థలతో వేధించే విధానం తెలిసిన ఆ ఇద్దరు నేతలకు ఏం చెబుతున్నారో క్లారిటీ వచ్చేసింది. అప్పటికప్పుడు ఏం చెప్పలేక బయటకు వచ్చేసారు. కానీ, నడ్డా తెలంగాణకు వచ్చినా ఆ ఇద్దరూ ఢిల్లీలోనే ఉండిపోయారు. మరోసారి ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భవిష్యత్ నిర్ణయాల పైన మల్ల గుల్లాలు పడుతున్నారు.

పార్టీని బతికించమని అడిగితే హెచ్చరికలు చేయటం వారికి అంతు చిక్కటం లేదు. అటు వ్యాపారాలు..ఇటు రాజకీయాలు దేనిని పణంగా పెట్టలేక సతమతం అవుతున్నారు. ఇటు ఇదే రోజున ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నారు. పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్దమైంది. ఇటు కాంగ్రెస్ లో పెరుగుతున్న జోరు.. నాయకత్వం నుంచి హెచ్చరికలతో ఈటెల, కోమటిరెడ్డితో సహా పలువురు నేతలు బేజారు అవుతున్నారు. మరి కొద్ది రోజులు వేచి చూసే నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో వైరల్ అవుతోంది.

మహేందర్ రెడ్డి డబుల్ గేమ్.. బూమ్ రాంగ్

Mahender Reddy :

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, వారికి కంటి మీద కునుకు దూరం చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఉంటూనే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇదే ప్రయత్నం చేసారు. తనతో పాటుగా తన మద్దతుదారులకు సీట్ల గురించి మంతనాలు చేసారు. హమీ పొందరు. ఇంతలో ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. హామీలు గుప్పించారు. అక్కడ జీ హుజూర్ అన్నారు. తన స్వలాభం కోసం బీఆర్ఎస్ వైపు ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు అనుచర వర్గానికి ఇది రుచించటం లేదు. ఇక్కడే సీన్ రివర్స్ అయింది. అనుచరుల తాజా వ్యూహాల్లో మహేందర్ రెడ్డి గేమ్ బూమ్ రాంగ్ అయింది.

బీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. పార్టీ హైకమాండ్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాండూర్ నియోజకవర్గంలో పోటీ చేసి, గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే.. పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు పట్నం రూట్ క్లియర్ చేసుకున్నారు.

తనతో పాటుగా తన మద్దతు వర్గానికి సీట్ల పైన కాంగ్రెస్ లో చర్చించారు. అదే సమయంలో కొందరి సీట్ల ఖరరు అంటూ ఒక జాబితా బయట పెట్టారు. అందులో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు జహీరాబాద్, తీగల అనితకు మహేశ్వరం, కేఎస్ రత్నం కు చేవెళ్ళ, తాండూరు నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వాలని..మహేందర్ రెడ్డి సతీమణి సునీతకు చేవెళ్ల లోక్ సభ ఇస్తారంటూ వ్యూహాత్మక లీకులు వచ్చాయి. స్పష్టమైన హామీ తీసుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ ప్రగతి భవన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఫోన్ రావటంతో పరుగున వెళ్లిన మహేందర్ రెడ్డికి ఆయన పాత చిట్టా బయట పెట్టారు. పార్టీ వీడితే జరిగేది ఏంటో సున్నిత హెచ్చరికలతో స్పష్టత ఇచ్చారు. అంతే..మహేందర్ రెడ్డి జీ హుజూర్ అంటూ గులాబీ తోట లోనే పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లేదు. తాండూరు ఈ సారి పైలెట్ కు ఖాయం చేస్తూనే మహేందర్ రెడ్డికి ఆశ పెంచారు. అనుచరులు, సన్నిహిత నేతలకు కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పి..ఇప్పుడు నో అంటూ వారందరికీ మహేందర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ, వారంతా బీఆర్ఎస్ నాయకత్వాన్ని, మహేందర్ రెడ్డి మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. ఎవరికి వారు కంగ్రెస్ నేతలతో మంతనాలు ప్రారంభించారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మహేందర్ రెడ్డిని బేఖాతర్ అంటున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఊహించని మహేందర్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. ఆయన ప్లాన్స్ అన్నీ బూమ్ రాంగ్ అయ్యాయి. ఒంటరి వాడయ్యాడు. ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ ఇచ్చిన హామీ అమలు అవుతుందా లేదా అనేది సందేహమే!

నోరెట్లెచ్చే ‘పాపి’ రెడ్డి?

`బిఆర్‌ఎస్‌ నేతల అగ్రహాం!

`పదవిచ్చిన పార్టీకి ద్రోహమా?

`కులాభిమానం గుర్తొచ్చిందా?

`రెడ్ల రాజకీయం కోసం ఇంత నీచమా?

`గుర్తించి పదవిచ్చినా నీతిబాహ్యమా?

`మళ్ళీ పదవి రాలేదని అక్కసా?

`తెలంగాణ ఉద్యమం చేసింది పదవుల కోసమా?

`ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించని త్యాగధనలు వరంగల్‌ లో లేరా?

`వాళ్లకంటే గొప్పదా నీ ఉద్యమ భాగస్వామ్యం?

`మళ్ళీ, మళ్ళీ పదవులంటే తోటి ఉద్యమ కారులకొద్దా?

`తెలంగాణ కోసం త్యాగమంటే, పదవుల పందేరమా?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ దశాబ్ది ఉత్సవాల సమయంలో కాంగ్రెస్‌ సభకు హజరై చేసిన వ్యాఖ్యలపై ఉద్యమ కారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అర్హత లేకున్నా అందలమెక్కిస్తే తన మిడిసిపాటును పాపిరెడ్డి చూపిస్తున్నాడని ఉద్యమ కారులు విమర్శిస్తున్నారు. అందరికంటే ముందు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తగిన గౌరవం తనకు కల్పించాడన్న కృతజ్ఞత లేకుండా మాట్లాడడం విశ్వాస ఘాతకమని అంటున్నారు. 

పరిటాల సుబ్బారావు లాంటి వారు చేసిన తెలంగాణ ఉద్యమంలో పది శాతం కూడా చేయని పాపి రెడ్డి, పదవీ కాంక్ష కోసం, కులం కోసం కాంగ్రెస్‌ పార్టీ పంచన చేరడం దౌర్భాగ్యం. 

ఉద్యమం ముసుగులో నమ్మక ద్రోహుల కంటే దుర్మార్గుడు పాపిరెడ్డి అని ఉద్యమకారులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఉద్యమ కాలంలోనే అడుగు బైట పెట్టాలంటే తన అవసరాలు ఎవరు తీర్చుతారని చూసిన వ్యక్తి పాపిరెడ్డి. చివరకు వెహికల్‌ లో కూడా పెట్రోల్‌ పోయిస్తే తప్ప కదలని పాపిరెడ్డి నీతులు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వున్నాయంటున్నారు. నిజానికి వరంగల్‌ లో ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాలుగా తన భుజస్కందాల మీద మోసిన నాయకుడు పరిటాల సుబ్బారావు. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పడరాని పాట్లు పడ్డాడు. ఉద్యోగులను ఉద్యమంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించాడు. రూపాయి, రూపాయి పోగేసి ఉద్యమ కారుల అవసరాలు తీర్చాడు. చివరకు తన జీతం కూడా ఉద్యమానికే ఖర్చ చేసిన చరిత్ర సుబ్బారావుది. అయినా ఆయన ఇప్పటి వరకు తనకు పదవి కావాలని అడగలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. నిజానికి సుబ్బారావు లాంటి వారు పదవులకు వన్నె తెస్తారు. పాపిరెడ్డి లాంటి వారు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఉద్యమ సహచరులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆనాడు ఉద్యమానికి ముందుండి నడిచిన వారెవరూ ఇప్పటి వరకు మాకు పదవులు కావాలని కోరలేదు. అదీ ఉద్యమ త్యాగం. 

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు రాక ఎదురుచూపుల్లో ఎంతో మంది ఉద్యమకారులున్నారు. 

వాళ్లంతా తెలంగాణ వస్తే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని నిస్వార్థంతో పోరాటాలు చేశారు. అందుకే వాళ్లు ఎక్కడా రాజకీయాలు చేయడం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఎంతో మంది రిటైర్డ్‌ ఉద్యోగులు తమ సేవలు అవసరమనుకుంటే చేయడానికి సిద్దంగా వున్నారు. కానీ తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడిన తొలినాళ్ళలో ఉద్యమం వైపు చూడని మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఉద్యమ నాయకులు తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఓ వైపు అన్ని రంగాలలో అన్ని రాష్ట్రాల కంటే ముందు దూసుకెళ్తుంటే పాపిరెడ్డి పిచ్చి ప్రేలాపణలు చేయడం కాదా? అని ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం మొత్తం ప్రస్తానంలో పాపిరెడ్డి పాత్ర ఎంత? రవ్వంత. 

కాకతీయ విశ్వవిద్యాలయం లోని విద్యార్థులు, సిబ్బంది, సకల జనులందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కూడా పాపిరెడ్డి జై తెలంగాణ అన్నది లేదు. ఉద్యాగ సంఘాల నాయకులు ఒత్తిడి చేయడంతో ఉద్యమంలోకి వచ్చినా, కొట్లాటలో ముందున్నట్లు నటించడం తప్ప, ఒంటరిపోరు పాపిరెడ్డి చేసింది లేదు. అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పిలిచి మరీ పాపిరెడ్డికి పెద్ద పీట వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ గా పాపిరెడ్డి పని చేసిన నాడు కాంగ్రెస్‌ పార్టీ అనేక ఆరోపణలు చేసేది. పరీక్షల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా పాపిరెడ్డి నిర్వహించారో అందరకీ తెలుసు. పాపిరెడ్డి మూలంగా ప్రభుత్వం ఎంతో అబాసుపాలైంది. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాపిరెడ్డిని కడుపులోనే పెట్టుకున్నాడు. కానీ పాపిరెడ్డి మాత్రం తన అసలు స్వరూపాన్ని చూపుతున్నాడు. అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహించలేదు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో పాపిరెడ్డి ఆడుకున్నాడు. అలాంటి పాపిరెడ్డి ఇప్పుడు తెలంగాణ కలలు నరవేరలేదని మాట్లాడడం విడ్డూరం. విద్యార్థుల జీవితాలను పాపిరెడ్డి చేతిలో పెడితే ఒళ్లు దగ్గర పెట్డుకొని పని చేయకపోగా, మళ్ళీ తన పదవి కొనసాగించలేదని ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడాన్ని ఉద్యమ నాయకులు తప్పు పడుతున్నారు. పదవిచ్చిన పార్టీకి ద్రోహం చేయడం, ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేయడం పాపిరెడ్డి ఆత్మ ద్రోహం చేసుకోవడమే అవుతుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అవకాశం కల్పించిన పార్టీకి ద్రోహం చేసి, కులాభిమానం గుర్తొచ్చి కాంగ్రెస్‌ వైపు చూడడం అంటే పచ్చి అవకాశవాదం అంటున్నారు. ఆనాడు గుర్తించి పదవిచ్చినా ఇంత నీతిబాహ్యమా పాపిరెడ్డి అని తిట్టిపోస్తున్నారు. మళ్ళీ పదవి రాలేదని అక్కసు పెట్టుకొని పాపిరెడ్డి చిలకపలుకులు పలకడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది? తెలంగాణ ఉద్యమం చేసింది పదవుల కోసమా? ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించని త్యాగధనలు వరంగల్‌ లో లేరా? వాళ్లకంటే గొప్పదా నీ ఉద్యమ భాగస్వామ్యం? మళ్ళీ, మళ్ళీ పదవులంటే తోటి ఉద్యమ కారులకొద్దా? తెలంగాణ కోసం త్యాగమంటే, పదవుల పందేరమా? అని ఉద్యమకారులు పాపిరెడ్డిని తూర్పారపడుతున్నారు.

వాళ్లకు వెళ్లాలనుంది! వీళ్లకు వెళ్తేనే బాగుండనుంది!!

`ఇరు శిబిరాల మనసులో ఒకటే వుంది?

`ఒకే ఒరలో ఇమడలేక ఇదంతా జరుగుతోంది.

`మమ్మల్ని పట్టించుకోవడం లేదని వీళ్లకుంది?

`ఇక్కడ అందరూ ఒక్కటే అని వాళ్లంటోంది?

`వెనుకొచ్చిన కొమ్ములు మాకొద్దని వాళ్లకుంది?

`మేము షార్ప్‌ అని వీళ్లకుంది?

`లేదు.. లేదనుకుంటూనే కుంపటి రగులుతోంది!

`పోతా అనుకునేవారిని ఆపేదేముంది?

`బండి సంజయ్‌ మాటలు ఆజ్యం పోసినట్లైంది!

`ఇప్పుడేం జరగనుంది?

`అంతటా ఆసక్తి నెలకొన్నది!

`ఈటెల, కోమటి రెడ్డి డిల్లీ లో… ఏం జరుగుతోంది?

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాష్ట్ర బిజేపిలో పలు శిబిరాలు వున్నా, తెరమీదకు మాత్రం ఇరు శిబిరాలు ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌ కు పార్టీలో ప్రాధాన్యత పెరుగుతోందన్నప్పుడల్లా బిజేపిలో అలజడి మొదలౌతోంది. నిజానికి ఈటెల రాజేందర్‌ బిజేపి చేరిన నాటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ఆనాడు ఈటెల రాజేందర్‌ వస్తే బాగుంటుందని, రావాలని కోరుకున్న వారు కూడా ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో బిజేపిని వాడుకోలేదు. ఆ సమయంలో బండి సంజయ్‌ యాత్రలో వున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లాంటి వారి ప్రచారం అవసరం రాలేదు. బిజేపి అగ్రశ్రేణి నేతలెవరూ వచ్చింది లేదు. పైగా వాళ్లు రావొద్దనే ఈటల కూడా సూచించారు. తమకు శ్రమ తప్పుతోందని, ఇక్కడికి ఇదే మంచిది అన్నట్లు బిజేపి పెద్దలు కూడా భావించారు. కానీ ఆ గెలుపు ఖాతా బిజేపి లో పడలేదు. కేవలం ఈటెల రాజేందర్‌ వ్యక్తి గత ప్రతిష్ఠ మూలంగానే గెలవడం జరిగిందనేది జగమెరిగిన సత్యం. అయితే ఈటెల రాజేందర్‌ గెలిచాక పార్టీలో ఆయన కు కీలక స్థానం కల్పిస్తారని అందరూ ఊహించారు. కానీ అదేదీ జరగలేదు. కనీసం అసెంబ్లీలో బిజేపి పక్ష నాయకుడుగా కూడా గుర్తించడానికి పార్టీకి మనసు రాలేదు. నిజానికి ఈటెల రాజేందర్‌ మనస్తత్వానికి బిజేపి పార్టీ తగదు. ఆయనే అనేక సార్లు చెప్పిన విషయం ఒకటుంది. తనకు రాజకీయాలలోకి రాకముందు గుడికి వెళ్లే అలవాటు లేదు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం, రాజకీయాలు సాగుతున్న తరుణంలో ఏ గ్రామానికి వెళ్ళినా ముందు గుడికి తీసుకెళ్లడం జరిగేది. దాంతో ప్రజల అభిప్రాయం, మనో భావాలను గౌరవించడం అలవాటైందని చెప్పారు. అలాంటి ఈటెల రాజేందర్‌ బిజేపి మనుగడ అంటే కష్టమే. అయినా కొనసాగాలనే నిర్ణయించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఒక దశలో ఈటెలపై, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తర్వాత పరిస్థితులు సర్థకున్నాయి. ఆ తర్వాత ఈటెల పట్ల పార్టీలో కొంత వ్యతిరేకత మెల్లిగా మొదలైంది. పనిలో పనిగా ఈటెల రాజేందర్‌, మాజీ ఎంపి. వివేక్‌ వెంకటస్వామి వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఈటెల వ్యక్తిత్వాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేశారు. అప్పటికీ ఈటెల ఇమిడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. అనువుగాని చోట అధికుల మనరాదు..అనేది గుర్తు చేసుకుంటూ వచ్చినట్లున్నారు. అయితే బిఆర్‌ఎస్‌ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బయటకు పంపించడంతో ఈటెల తనకు పని దొరికింది అనుకున్నారు.

చేయాల్సినంత కృషి చేశారు. కానీ వ్యవహారం సాగలేదు. చేరికల కమిటీ పేరు మీద నమ్మకంతో ఎవరూ రావడం లేదు. అదే సమయంలో ఈటెల రాజేందర్‌ ఖమ్మం వెళ్లి పొంగులేటిని కలవడం తనకు తెలియదని బండి సంజయ్‌ చెప్పడం వివాదాలు ముదిరి పాకాన పడ్డాయన్నది అందరికీ అర్థమైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత బిజేపి గ్రాఫ్‌ పడిపోవడం, బిజేపి లో ఈటెలకు ప్రాధాన్యత పెరుగుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇక్కడ కూడా ఈటెల స్వయం కృతాపరాధం మళ్ళీ ఆయనను మొదటికి తీసుకొచ్చింది. పొంగులేటి, జూపల్లి ని నేను బిజేపి లోకి రావాలని కోరితే, నాకే కౌన్సిలింగ్‌ ఇచ్చారని అనడంతో బిజేపి పని అయిపోయిందని ఈటెల నే స్వయంగా ప్రకటించినట్లైంది. తన అశక్తతను బైట పెట్టుకున్నట్లైంది. అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చేరికల కమిటీ అనేది వుండదు అని ఈటెల అన్నారు. అంటే నర్మగర్భంగా తాను అసంతృప్తి తో వున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది. ఇది బిజేపి అసలు శ్రేణులకు నచ్చలేదు. వాళ్లు జీర్ణించుకోలేదు. ఈటెల మీద ఆఫ్‌ ద రికార్డు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా బండి సంజయ్‌ వ్యాఖ్యల దుమారం ఎంత దూరం పోతుందో అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈటెల రాజేందర్‌ తో పాటు, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఒక జట్టుగా మారారన్నది ఓ ప్రచారం. ఇద్దరూ అసంతృప్తి గానే వున్నారు. అందుకే ఇరు వర్గాల మనసులో ఒకటే వుంది? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతోంది. 

కర్ణాటక ఎన్నికల తర్వాత తన ప్రాభవం తగ్గుతుందేమో? 

అన్న భావన బండి సంజయ్‌ లో మొదలైనట్లు తొలుత ప్రచారం మొదలైంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఈటెల పదే, పదే డిల్లీ ప్రయాణం, కేంద్ర బిజేపి శిబిరంలో ఏదో జరుగుతోందనేది విసృత చర్చకు దారి తీసింది. ఈటెల కు ప్రచార కమిటీ బాధ్యతలు ఇక అప్పగించినట్లే అన్నది కూడా వినిపించింది. అంతకు ముందు బండిని తొలగించి, ఈటెలతో భర్తీ చేస్తారని కూడా వినిపించింది. ఇది బండి సంజయ్‌ శిబిరంలో కలకలం రేపింది. ఆ తర్వాత ఈటెల పక్క చూపులు అనేది ప్రచారంలోకి వచ్చింది. ఇదే ఒకే ఒరలో ఇమడలేక ఇదంతా జరుగుతోంది.

మమ్మల్ని పట్టించుకోవడం లేదని సాక్షాత్తు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తోడు బిజేపిలో కొత్త నేతలకు ప్రత్యేక ఆహ్వానాలు ప్రత్యేకంగా వుండవన్నది తేల్చి చెప్పారు. ఇక్కడ అందరూ ఒక్కటే అని బండి వర్గం కరాఖండిగా చెప్పినట్లు కూడా తెలుస్తోంది. 

 వెనుకొచ్చిన కొమ్ములు మాకొద్దని కూడా అసలైన బిజేపి వాదులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేము షార్ప్‌ అని ఈటెల వర్గానికి వుంది. అయినా మాలో ఎలాంటి దూరం లేదు… లేదు.. లేదనుకుంటూనే కుంపటి రగులుతోంది! ఇలాంటి సమయంలో బండి సంజయ్‌ పోతా అనుకునేవారిని ఆపేదేముంది? అని ప్రకటన చేశారు. బండి సంజయ్‌ మాటలు ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లైంది! ఇప్పుడేం జరగనుంది? అనే దానిపై అంతటా ఆసక్తి నెలకొన్నది! ఈటెల, కోమటి రెడ్డి డిల్లీ లో… ఏం జరుగుతోంది? అనే చర్చనే కాదు, కాంగ్రెస్‌ లో చేరిక ఊహాగానాలే నని రాజగోపాల్‌ రెడ్డి అంటూనే..ఏదైనా వుంటే చెబుతా? కదా!? అని అన్నారు. దీని భావం విడమర్చి చెప్పాల్సినంత అవసరం వుండదేమో!!

కాంగ్రెస్ లోకి పొంగులేటి..లెక్క పక్కా..బీఆర్ఎస్ కు ఆ వర్గం ఇక దూరమేనా…

 

Ponguleti Srinivas Reddy :

తెలంగాణలో చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటి ఎంట్రీ తో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం ఆషామాషీగా జరగలేదు. సుదీర్ఘ కసరత్తు..పక్కా వ్యూహం..బీఆర్ఎస్ లక్ష్యంగా నిర్ణయం తో పక్కాగా డిసైడ్ అయింది. పొంగులేటి తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత. పొంగులేటి చేరిక పార్టీకి ఖచ్చితంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం వలన తమకు జరిగే నష్టం పై బీఆర్ఎస్ లోనూ చర్చకు దారి తీస్తోంది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణతో పాటుగా ఢిల్లీ స్థాయిలోనూ మంచి పలుకుబడి ఉన్న నేత. 2014 లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలోనూ పొంగులేటికి అనుచర వర్గం ఉంది. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తరువాత టీఆర్ఎస్ కు దగ్గరయ్యారు, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ కోసం పని చేసారు. 2018 ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించినా ముఖ్యమంత్రి హామీతో సీటు దక్కక పోయినా పార్టీ అభ్యర్ధి గెలుపుకు సహకరించారు. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ..వ్యయ ప్రయాసలను తట్టుకొని నిలబడ్డారు. యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేసే బీఆర్ఎస్ నేతల వైఖరితో మనస్థాపానికి గురైన పొంగులేటి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేసారు.

పొంగులేటిని చేర్చుకోవటానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. కోరిన సీట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పార్టీలో పదవుల పై హామీలు గుప్పించారు. కానీ, క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో ఉన్న మూడ్ గుర్తించిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ను మట్టు బెట్టాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని తేల్చారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఖమ్మం జిల్లాలో సీట్ల గురించి మద్దతు దారుల నుంచి హామీ పొందాలనే ఒత్తిడి ఉన్నా..అవసరమైతే నాలుగు అడుగులు వెనక్కు తగ్గుదామని పొంగులేటి చెబుతున్నారు. అందరి లక్ష్యం బీఆర్ఎస్ ను ఓడించటమేనని తేల్చి చెప్పారు. ఆ దిశగా కాంగ్రెస్ లో ఏ బాధ్యతలు అప్పగించినా…పని చేసేందుకు సిద్ధమని పొంగులేటి స్పష్టం చేసారు.

తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టిని పొంగులేటి కలిసారు. మండుటెండల్లో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండ వంద రోజుల పాదయాత్ర చేయటం పైన అభినందించారు. పార్టీలో చేరిక అంశంతో పాటుగా ఖమ్మం జిల్లాలో రాహుల్ సభ పైన చర్చించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల కలయిక తో వచ్చే ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లు క్లీన్ స్వీప్ చేయటం ఖాయమనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు.

ఇక పొంగులేటి కాంగ్రెస్ లో చేరిక ద్వారా తమ పైన పడే ప్రభావం పైన బీఆర్ఎస్ ఆరా తీస్తోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పోలరైజ్ అయ్యే అవకాశం ఉందనే నివేదిక లు ఇప్పుడు బీఆర్ఎస్ కు గుబులు పెంచుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉంది. ఆ జిల్లాల్లోని ఆ వర్గానికి చెందిన నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్దికంగానూ.. రాజకీయ వ్యూహాల్లోనూ పొంగులేటికి పట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించటం..తనను అవమానించిన వారిని రాజకీయంగా కనుమరుగు అయ్యేలా చేయటం తన లక్ష్యమని ప్రకటించిన పొంగులేటి రాక ఇప్పుడు కాంగ్రెస్ కు అదనపు బలంగా మారనుంది.

బడుగులొద్దు! రెడ్లే ముద్దు!?

` రెడ్లకు మాత్రమే రెడ్‌ కార్పెట్‌!

` బడుగులు ఓట్లకు…రెడ్లు సీట్లకు!

` కాంగ్రెస్‌ తోనే రెడ్లకు పూర్వ వైభవం?

` ఇదే అంతటా రేవంత్‌ చేస్తున్న ప్రచారం!

` అమెరికాలో వున్నా, ఇంకెక్కడున్నా రెడ్లనే తెస్తాం?

` రెడ్లకే టిక్కెట్లిస్తాం?

` తెలంగాణ లో రెడ్ల రాజ్యం తెస్తాం?

` ఓట్లు బడుగులవి…రాజ్యం రెడ్లది!

` కాంగ్రెస్‌ లో ఇప్పుడు, ఎప్పుడూ కనిపించే ధోరణి?

` రేవంత్‌ ప్రకటించిన ఘర్‌ వాపసీ అందుకే!

` రెడ్లను మళ్ళీ ఏకం చేసేందుకే?

` బడుగులలో ఎంత బలవంతుడైనా పక్కకు పెట్టాల్సిందే?

` పొన్నాలను గతంలోనే దూరం పెట్టిన సంగతి తెలిసిందే!

` హనుమంతన్నకు ఎప్పుడూ మెండిచేయే?

` దామొదర రాజనర్సింహకు అడుగడుగునా అవమానమే!

` బలమైన సమాజంలో బడుగులే బలహీనులా?

`బలం లేని రెడ్డీలకే పెత్తనమా?

` రెడ్డిలకే రాజ్యమా? బడుగులు ఓట్లకే పరిమితమా?

`ప్రచారానికి పనికొచ్చే కూలీలతో సమానమా?

` రెడ్ల ఆధిపత్యం కోసం ఏకమౌతున్న కుల రాజకీయమా?                                      

హైదరబాద్‌,నేటిధాత్రి:    

తెలంగాణలో మళ్లీ రెడ్డి రాజకీయం మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ వేధికగా మళ్లీ చిగురిస్తోంది. రెడ్ల పెత్తనానకి వేళయ్యింది. కాంగ్రెస్‌లో ఇతరులకు వున్న ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదముంది. ఇతర సామాజిక వర్గ నేతలు కనీసం గాంధీ భవన్‌ మెట్టు ఎక్కలేని పరిస్ధితి మళ్లీ రానున్నది. ఆ మధ్యనే జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. సాక్ష్యాత్తు మాజీ పిసిసి. అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించిన నాయకులకు ఓటింగ్‌ వేసేందుకు అవకాశం వున్నప్పటికీ గాంధీ భవన్‌లో వారికి ఎంట్రీ లేకుండాచేశారు. బడుగులపై రెడ్డి పెత్తనానికి అప్పటికే తెరతీశారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉద్యమానికి చోదోడు వాదోడుగా వున్న దామోదర రాజనర్సింహ కూడా గాంధీ భవన్‌ ముందు ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడిరది. కారణం వీళ్లు బడుగు నేతలు కావడమే కాంగ్రెస్‌లో కొనసాగడమే శాపంగా పరిణమించింది. ఈ మధ్య కాలంలో ఇంతలా బడుగులపై కాంగ్రెస్‌లో వివక్ష కనిపించలేదు. కాని పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ అరాచకం మరీ ఎక్కువైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా కాంగ్రెస్‌లో వున్న రెడ్డి సామాజిక వర్గ నేతలు బైటకి కొట్లాడుకుంటున్నట్టు నటించినప్పటికీ, కాంగ్రెస్‌పార్టీజాతీయ అధ్యక్షుడి ఎన్నికల్లో ఏ ఒక్క రెడ్డి నాయకుడు వీధికెక్కన సందర్భం లేదు. కేవలం బడుగు నేతలకే తీవ్ర అవమానం జరిగింది. అయినా వాళ్లు కాంగ్రెస్‌ పార్టీకోసమే జీవితాంతం పనిచేస్తూ వస్తున్నారు. కాని ఒక్కసారిగా తెలంగాన కాంగ్రెస్‌లో రెడ్డి రాజకీయం చోటు చేసుకోవడం అంటే, బడుగులకు తీవ్ర అన్యాయం జరిగేందుకు ఇవి తొలి సంకేతాలే అని చెప్పకతప్పదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఇలా రెడ్డి రాజకీయం కాంగ్రెస్‌లో ముదిరితే బడుగులకు టిక్కెట్లు కష్టమే అన్నది జరుగుతున్న చర్చకు నిదర్శనం. 

అదేంటో రాజకీయాలంటే రెడ్డిలకు వున్నంత స్వేచ్ఛ ఏ సామాజిక వర్గానికి వుండదు. 

వ్యక్తిగత స్వార్ధం కోసం ఒకరినొకరు గొడవకు దిగినా, వ్యవస్ధ పరమైన అవసరం అనుకున్నప్పుడు ఆ సామాజిక వర్గమంతా ఏకం కావడం ఒక్క రెడ్డిలలోనే చూస్తుంటాం. ఇది ఇప్పుడు కాంగ్రెస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఆరు నెలల క్రితం వరకు కాంగ్రెస్‌లో ఉప్పు,నిప్పులాగా వున్న నేతలందరూ నేతుల వాసనతో కనిపిస్తున్నారు. అంటే అంతా ఒక్కటయ్యారు. ఈసారి కలిసి కట్టుగా లేకపోతే ఇక తెలంగాణలో రెడ్ది రాజకీయం కష్టమన్న భావనకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌లో కూడికలు పెరిగాయి. ఎక్కడా తీసివెత అన్న మాటలు లేకుండా పోయాయి. మొత్తానికి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గమంతా ఏకం కావడానికి ముందుగా ఘర్‌ వాపసీ అనే కార్యక్రమం చేపట్టారు. గతంలో ఓసారి అమెరికా వెళ్లినా, ఎడమొహం, పెడ మొహం పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఆసారి కలిసి అమెరికా వెళ్లారు. మేం కలిసిపోయామని సంకేతాలు ఇస్తున్నారు. పననిలో పనిగా పార్టీని వీడి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని కూడా పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇకదేశంలోనే లేచే పరిస్ధితి లేదు. తెలంగాణలో అసలే లేదు. ఇక కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్లే అన్నంత మాటలు మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డికి మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పేందుకు చూస్తున్నారు. ఇక ఇటీవల పార్టీలో చేర్చుకొని ప్రోత్సహిస్తున్న వారిలో అందరూ రెడ్డిలే. ఒకప్పుడు టిఆర్‌ఎస్‌లో వున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి లాంటి వారిని ప్రోత్సహిస్తూ, పిసిసి. మాజీ అధ్యక్షుడైన పొన్నాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇదే పొన్నాల మీద గతంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా వున్న జంగా రాఘవరెడ్డిని ఉసిగొల్పే రాజకీయాలు చేశారు. ఇప్పుడు కొమ్మూరికి మాటిచ్చి, జనగామలో ఆ కాస్త బడుగుల రాజకీయాన్ని దూరం చేయడానికి చూస్తున్నారు. మొత్తం పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని, 2014 ఎన్నికల ప్రచారం బాధ్యతలు మోసిన పొన్నాలకు రాజకీయాలు దూరం చేస్తున్నారు. 

ఇక ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని తీసుకొని, అక్కడ కూడా అదే పనిచేసేందుకు సిద్ధమౌతున్నారు. 

ఖమ్మంలో పట్టు కోసం రెడ్డి రాజకీయం మొదలుపెట్టారు. ఇలా జిల్లాల వారిగా రెడ్డి సామాజిక వర్గ నేతలను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అనేక మంది రెడ్డి నేతలకు గాలం వేసి, టిక్కెట్లు ఇస్తామని ఆఫర్‌ ఇస్తున్నట్లు కూడా సమాచారం. పట్నం మహెందర్‌రెడ్డి లాంటి వారిని తీసుకొని పోయిన రెడ్డి రాజకీయంతో చక్రం తిప్పుదామని చూస్తున్నారు. తమ దారిలోకి కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా తెచ్చుకునే ప్రయత్నం కూడా సాగుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి డి.కే అరుణ లాంటి వారిని మళ్లీ పార్టీలోకి తెచ్చే సంప్రదింపులు సాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించి, ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లు కాంగ్రెస్‌ కోసమే పనిచేస్తున్నవారు చాల మంది వున్నారు. అందులోనూ బడుగు నేతలే ఎక్కువ వున్నారు. కేవలం రెడ్డి రాజకీయం కోసమే వారిని పక్కన పెట్టే కుట్రకు తెరతీసినట్లు సమాచారం అందుతోంది. ఒకప్పుడు డాలర్‌ లక్ష్మయ్యగా వరంగల్‌ రాజకీయాలకు పెద్ద దిక్కుగా పనిచేసి, పార్టీ కార్యక్రమాల కోసం ఎంతో శ్రమ పడిన పొన్నాల లక్ష్మయ్య లాంటి వారికి సేవలను పార్టీకి దూరం చేయడం సరైంది కాదు. 2014లో పార్టీ ఓడిపోయినా, ఆయన ఓడిపోయినా పొన్నాల పార్టీకి ఏనాడు దూరం కాలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరం గా వుండలేదు. కరోనా సమయంలో కూడా ఆయన ఎంతో ఆక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించడంలో అందరికంటే ముందున్నారు. అయినా అలాంటి బిసి. నేతను గత ఎన్నికల సమయంలోనే పక్కన పెట్టే ఎత్తుగడ వేశారు. 2014 ఎన్నికల్లో పొన్నాల చేతిలో బిఫామ్‌ తీసుకున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, 2018 ఎన్నికల్లో పొన్నాలకు టికెట్‌ కట్‌ చేశారు. ఆఖరుకు ఆయన డిల్లీలో పోరాటం చేసి ఆఖరు నిమిషంలో టికెట్‌ తెచ్చుకున్నారు. మనోవేధనుకు గురయ్యారు.

నేను రెడ్డి కాకపోవమే శాపం: వి. హనుమంతరావు. 

నిజానికి కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడు వి. హనుమంతరావు. సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన. ఆయన పిసిసి. అధ్యక్షుడుగా పనిచేసిన సమయంలో రేవంత్‌ రెడ్డి లాంటి వారికి లోక జ్ఞానం కూడా తెలియని వయసు. అలాంటి నేతలకు ఈసారి టికెట్‌ వుంటుందన్న నమ్మకం లేదు. 1985 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌పార్టీని నిలబెట్టిన వారిలో హనుమంతరావు ఒకరు. యూత్‌కాంగ్రెస్‌ ప్రెసిడెంటుగా ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అక్కడి నుంచి ఆదిలాబాద్‌ వరకు యాత్ర చేపట్టి, కాంగ్రెస్‌ను గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన నాయకుడైనా హనుమంతారావు ముఖ్యమంత్రి కాలేకపోయారు. కారణం ఆయన రెడ్డి కాకపోవడమే అని ఇప్పటికే చెప్పుకొని మధనపడుతుంటారు. పార్టీకి కోసం అంత కష్ట పడ్డా తాను రెడ్డి రాజకీయం ముందు ఓడిపోయానని అంటుంటారు. ఆ సమయంలో ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా, ముగ్గురూ రెడ్డిలే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ వచ్చినా అప్పుడూ ఇద్దరు రెడ్డిలే పాలించారని హనుమంతరావు భహిరంగంగానే చెబుతుంటారు. ఇటీవల కాలంలో అడుగుగడుగునా ఆయనను అవమానాల పాలు చేసినా, పార్టీ కోసం ఈ వయసులోనూ పనిచేస్తున్నారు. ఇప్పటి తరం నాయకులకంటే ఉత్సాహంగా వున్నారు.

ట్రెండ్ క్రియేటర్ గా భట్టి విక్రమార్క..

 

Bhatti Vikramarka as trend creator :

సీఎల్పీ భట్టి నేత పేరు ట్విట్టర్ లో ఇండియా లెవల్ లో ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. భట్టి విక్రమార్క్ ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ ఈ రోజుతో వందో రోజుకు చేరింది. ఈ మార్చ్…బీఆర్ఎస్ ను గద్దె దింపే మార్చ్ గా మారింది. కాంగ్రెస్ కు ఎన్నికల వేళ సెలబ్రేషన్ గా మారింది. మండుటెండల్లో పేదల మధ్యే భట్టి గ్రామా గ్రామన తన యాత్ర సాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అండ..ఆశీస్సులతో ఒక్కో అడుగుతో బీఆర్ఎస్ లో టెన్షన్ పెంచారు. పార్టీ నేతలను ఏకం చేసారు. ఇతర పార్టీల నేతలు కదలి కాంగ్రెస్ లో కలిసేలా చేసారు.

ఇప్పుడు ఇదే కాంగ్రెస్ లో నయా ట్రెండ్ సెట్టెర్ గా భట్టిని నిలిపింది. కర్ణాటక తరువాత తెలంగాణ పైన ఆశలు పెట్టుకున్న వేళ పార్టీలో జోష్ పెంచింది. వంద రోజులు ప్రతీ రోజు ప్రజల మధ్యనే ఉంటూ సాగిన భట్టిపై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురుస్తున్నాయి. భట్టికి అనుకూల స్లోగన్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. కాంగ్రెస్ లో భట్టి పేరుతో సాగుతున్న సెలబ్రేషన్స్ బీఆర్ఎస్, బీజేపీల్లో వైబ్రేషన్స్ కు కారణమయ్యాయి. తెలంగాణ గడ్డలో ప్రతీ ప్రాంతం నుంచి భట్టికి మద్దతుగా నిలుస్తున్నారు.

భట్టి వంద రోజుల యాత్ర..బీఆర్ఎస్ పాలనకు ముగింపు యాత్రగా క్యాంపెయిన్ సాగుతోంది. భట్టి అన్నా ఇదే ఊపుతో ముందుకు దూసుకుపో.. కేసీఆర్ దుకాణం సర్దుకు పో అంటూ తెలంగాణలోని సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటం..రాహుల్ ప్రధాని కావటంతోనే తన యాత్ర లక్ష్యం పూర్తయినట్లు భట్టి విక్రమార్క్ తన యాత్ర వందో రోజు చేరిన సమయంలో స్పష్టం చేస్తున్నారు. భట్టికి పార్టీ అగ్రనాయకత్వం వంద రోజుల యాత్ర పూర్తయిన వేళ అభినందనలు తెలిపింది.

Bhatti Vikramarka : పీపుల్స్ లీడర్ … భట్టి విక్రమార్క @ 100 డేస్

 Bhatti Vikramarka Completed his 100 Days of Padayatra :

మల్లు భట్టి విక్రమార్క. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక బ్రాండ్ గా మారింది. పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. పార్టీలో కొత్త ఊపును తీసుకొచ్చింది. నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. ప్రజలతో మమేకం అవుతూ.. వారికలో ఒకరిగా నిలుస్తూ..సమస్యల పరిష్కారానికి స్వాంతన కల్పిస్తూ యాత్ర సాగింది. భట్టికి పార్టీ హైకమాండ్ యాత్ర వేళ ఇచ్చిన మద్దతు బరింత బలాన్నిచ్చింది. కొత్త నేతల చేరికకు ఈ యాత్ర ప్రేరణగా నిలిచింది. ప్రజలతో కలిసి పీపుల్స్ లీడర్ గా చేసిన మార్చ్..వందో రోజుకు చేరింది.

కాంగ్రెస్ కుటుంబానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు అదే పార్టీలో కీలకంగా మారారు. భట్టి సోదరుడు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు. భట్టి వైఎస్సార్ హాయంలో చీఫ్ విప్ గా.. తరువాత డిప్యూటీ స్పీకర్ గా..తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ప్రస్తుతం నరనరాకన జీర్ణించుకున్న కాంగ్రస్ భావాలతో ఆ పార్టీని తెలంగాణలో అధికారం..తమ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయటం లక్ష్యంగా భారత్ జోడో యాత్ర స్పూర్తితో పీపుల్ మార్చ్ ప్రారంభించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిరాటంకంగా ముందుకు సాగుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తోంది.

గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లతో భట్టి మమేకమయ్యారు. వారి నుంచి విక్రమార్క యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ స్పందనే అధికార బీఆర్ఎస్ లో గుబులు పెంచింది. తొలి నుంచి కాంగ్రెస్ నే నమ్ముకున్న ఈ వర్గాలు తిరిగి ఇప్పుడు భట్టి యాత్ర ద్వారా పార్టీకి దగ్గరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ ఆప్తుడుగా ఉన్న భట్టి పాదయాత్ర నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. అందరినీ కలిపింది. పార్టీ కోసం పని చేయాలనే లక్ష్యాన్ని నూరిపోసింది. పట్టుదల పెంచింది. ఫలితంగా ఈ యాత్ర ద్వారా వస్తున్న స్పందన..పార్టీలో మార్పు హైకమాండ్ ను ఆకర్షించింది. పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే తో సహా పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. సభల్లో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ సైతం భట్టి యాత్రపై ఆరా తీసారు. భట్టి పాదయాత్రతో వస్తున్న స్పందన పార్టీలో చేరికలను పెంచింది. పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు భట్టి చొరవ తీసుకున్నారు. మంతనాలు చేసారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటానికి కలిసి వచ్చేలా ఒప్పించారు. ఖమ్మం వేదికగా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు. భట్టి సొంత జిల్లాలో జరిగే సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ ,ప్రియాంక తరలి వస్తున్నారు. మండుటెండలో అస్వస్థతకు గురైనా స్వల్ప విరామం మినహా.. వెనుకడుగు వేయకుండా భట్టి యాత్ర కొనసాగింది. ఈ యాత్ర వంద రోజుల కాలంలో ఇంటి వైపు తిరిగి చూడలేదు. పండుగలు..జన్మదినాలు..సందర్భాలు ఏవైనా అన్నీ ప్రజల మధ్యనే నిర్వహించారు.

పీపుల్స్ మార్చ్ తో పార్టీలో..ప్రజల్లో భట్టి స్థానం మరో స్థాయికి చేరింది. ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వంద రోజుల్లో 1150 కిలోమీటర్లు పాదయాత్ర నేడు వందో రోజుకు చేరింది. వందో రోజు పాదయాత్ర నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. కాంగ్రెస్ లో చేరనున్న నేతలు భట్టిని పరామర్శించారు. భట్టి పట్టుదలన ప్రశంసించారు. మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ టు ఢిల్లీ భట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వంద రోజుల యాత్ర ముగించిన భట్టికి పార్టీ శ్రేణులు..అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఉత్తదే.. జగడం ఉత్తుత్తి ..రగడం

`రక్తి కట్టిస్తున్న తండ్రీ కూతుళ్లు!

`తండ్రి మీద కోపం వున్నట్లు కూతురు?

`కూతురు మీద ప్రేమతో భూములు కొన్నట్లు తండ్రి?

`ఆక్రమించుకున్నారన్న అపవాదు మాయం చేసేందుకు? 

`అద్భుతమైన నటనకు తెరతీశారు?

`అటు సానుభూతి కోసం!

`ఇటు భూమి కొన్నట్లు రుజువుల కోసం?

`లా పాయింట్‌ తో ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం?

`తండ్రిని నిలదీయాలంటే ప్రజల్లోకి రావాలా?

`తన సంతకం ఫోర్జరీ చేశాడని వీధికెక్కడం ఎందుకు?

`ఆ భూములు కూతురు ప్రజలకు రాసిస్తే చాలదా?

`ఎక్కడైనా ఆస్థులు ఇవ్వకుంటే గొడవలు చూస్తాం?

`నాకు ఆస్తిమీద ఆసక్తి లేదన్నట్లు నటన కొత్తగా చూస్తున్నాం?

`ఆ ఆస్థులు వద్దనుకుంటే ప్రజలకు రాసివ్వండి?

`జనం అంటున్నట్లు, భూముల ఆక్రమణ కాదని నిరూపించాలి?

`కూతురు పేర కొన్నట్లు చర్చ జరగాలి?

`న్యాయ స్థానాన్ని తప్పు దోవ పట్టించాలి?

`ప్రజలను మాయ చేయాలి?

`జాగలపై జనగాం ఎమ్మెల్యే జంతర్‌ మంతర్‌!?

 హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాను రాను రాజకీయాలలో ఏది నీతో, ఏది అవినీతో అర్థం కాకుండా పోతోంది. ఏది నిజాయితో, ఏది సానుభూతో ఏది తెలియకుండా పోతోంది. ఏది అక్రమమో, ఎంత కక్కుర్తో కనపడకుండా పోతోంది. మనుగడ కోసం ఎంతటికైనా దిగజారడం బెటరని నిరూపించే దాకా వెళ్తోంది. అదేంటో చిత్ర, విచిత్రమైన రాజకీయాలన్నీ తెలంగాణలోనే కనిపిస్తున్నాయి. గతంలో రాజకీయాలలో కుటుంబ సభ్యుల మధ్య కూడా రాజకీయ వైరం కనిపించేది. వేర్వేరు పార్టీలలో వుంటూ, అందరూ ఒకే గూడులోనే వుంటూ రాజకీయాలు చేసేవారు. బయటకు రాగానే తిట్టుకునేవారు. ఇంటికి చేరుకోగానే కలిసి భోంచేసే వారు.వాళ్ల కోసం బైట నాయకులు, కార్యకర్తలు కొట్టుకునే వారు. జనం కూడా రాజకీయాలంతే అనుకునే వారు. ఇప్పుడు రాజకీయాలు వ్యాపార ముసుగేసుకున్నాయి. వ్యాపారాలు సాగిస్తే గాని రాజకీయాలు గడవని రోజులొచ్చాయి. ఆక్రమణలు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలను అమాయకులను చేసి ఆడిరచేందుకు రాజకీయాలు వేధికలౌతున్నాయి. సంపాదనలకు మార్గాలౌతున్నాయి. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత పోగేసుకునేందుకు ఎంతకైనా దిగజారిన కాలం కళ్లముందు కనబడుతోంది. 

నాన్న…నా సంతకం ఫోర్జరీ చేసి ఆ స్థలం ఎందుకు కొన్నావు? 

కూతురు నిలదీత. అవన్నీ ఇంటి దగ్గర మాట్లాడుకుందాం..ఇప్పుడు తండ్రి మాట. ఇక్కడే తేలిపోవాలి. కూతురు వాదన. నా సంతకం ఫోర్జరీ ఎందుకు చేశావ్‌? నా పేరు మీద భూమి ఎందుకు కొన్నావ్‌? ఇదీ కూతురు పదే, పదే అడుగుతున్న ప్రశ్న. పాపం తండ్రికి ఎంత కష్టమొచ్చింది. కూతురు నిలదీస్తోంది…ప్రతిపక్షాలు అందిస్తున్నట్లు ఆడుతోంది. అయ్యకే ఎదురుతిరుగుతోంది. పార్టీ నాయకుల ఆవేదన. అయినా కన్న తండ్రి భూమి కొనిస్తే ఎందుకు కొన్నవంటుంది. తండ్రిని ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి కూతురు ఎవ్వరికీ వుండోద్దు ? సగటు నాయకుడి ఆవేదన. అదేంటి తన తండ్రి ఎమ్మెల్యేగా వుండి ఆ భూములు ఆక్రమించుకున్నాడని కదా? జనం అనుకుంటున్నది. ప్రభుత్వ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని కదా? ప్రజలు ఆరోపిస్తున్నది. మరి కూతురు పదే పదే ఎందుకు కొన్నావు…నాన్న అంటూ ప్రశ్నిస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనేది అందరికీ అర్థమైవుంటుంది. ఆయన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. కూతురు తుల్జా భవానీ రెడ్డి. చెరువు శిఖం భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించుకున్నారనేది రైతుల వాదన. నా పేరు మీద ఎందుకు కొన్నావంటూ కూతురు వితండ వాదన. ఇదే కూతురు సరిగ్గా గత ఎన్నికల ముందు చేర్యాల పెద్ద చెరువు మత్తడి వద్ద భూమిని ప్రజలకు పంచుతానంటూ రైతులకు హామీ ఇచ్చింది. ఎన్నికలయ్యాక ఫలానా రోజు వస్తానని మాట ఇచ్చి వెళ్లిపోయింది. ఎన్నికలు అయిపోయాయి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మళ్ళీ గెలిచాడు. ఇక ముత్తిరెడ్డి కూతురు వస్తుందని రైతులు ఎదురు చూశారు. కానీ ఇంత వరకు రాలేదు. మళ్ళీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది. మళ్ళీ కూతురు రంగంలోకి దిగింది. ఇప్పుడు తండ్రి తో గొడవ నాటకానికి తెరతీసింది. ఆక్రమణ అన్నది జనం మర్చిపోయి, కొన్నారన్న దానికి బలం చేకూర్చే ఎత్తుగడ మొదలుపెట్టింది. రైతులు వేసిన కేసు వీగిపోవాలంటే కూతురు పేరు మీద కొనుగోలు అన్నది తెరమీదకు వస్తే, ఆక్రమణ అన్నది పక్కకు వెళ్లిపోతుంది. లీగల్‌ గా ఎదురయ్యే అవాంతరాలు దూరమౌతాయి. ఇదీ అసలు సంగతి. కూతురు కోపంగా వచ్చినట్లు, నాన్న మీద చిర్రుబుర్రులాడినట్లు కాసేపు, వెళ్లే ముందు నాన్న వెళ్తున్నాను..అంటూ నవ్వుకుంటూ వెళ్తుంటే జనం వెర్రివెంగలప్పలౌతున్నారు. ఆ స్థలం కూతురుకు అవసరం లేకపోతే, ప్రజలకు రాసి ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం. గతంలో రైతులకు రాసిస్తానని తప్పించుకోవడంలో ఆంతర్యం…అంతా ఉత్తుత్తి లొల్లి. నిజంగా తండ్రి మీద కూతురుకు కోపం వుంటే ఇళ్లు పీకి పందిరేస్తుంది. లేకుంటే ఇంటి ముందు ధర్నా చేపడుతుంది. తండ్రికి చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పరం చేస్తుంది. ఇవన్నీ ఏవీ జరగడం లేదు. తండ్రి, కూతుళ్ల జగడం ఆగడం లేదు.

రాజకీయ తులాభారంలో  జగన్‌ వైపే జనం మొగ్గు!

` జగనే మళ్ళీ సిఎం డి.ప్యాక్‌ కధనంపై సర్వత్రా చర్చ.

` వైసిపి సర్వేలకు సమానమైన లెక్కలు చెప్పిన డి.ప్యాక్‌.

`డీ ప్యాక్‌ సర్వే వివరాలతో ప్రతి పక్షాలలో గందరగోళం.

` డీ ప్యాక్‌ సర్వే వివరాలు తెలుసుకునే ప్రయత్నం.

`ఎలా సాధ్యమన్న దానిపై ప్రతిపక్షాల ఆసక్తి?

` వైసిపిలో కూడా మొదలైన చర్చ?

`నేటిధాత్రి లో కథనం వచ్చిన రోజే సిఎం. జగన్‌ ఎమ్మెల్యేలతో బేటీ?

` ప్రజలలో వైసిపిపై అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం.

` సర్వేలు డేగ కన్నుతో ప్రజల ఆలోచనలు పసిగడుతున్నాయి!

` సర్వేల ద్వారా పరిస్థితి వివరిస్తున్నాయి!

`ఇప్పటికైనా జనంలో వుండండి. ఎమ్మెల్యేలకు సిఎం. జగన్‌ ఆదేశం.

` జనంలో వుండే ఎమ్మెల్యేలకే టిక్కెట్లు అని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ?

` నేటిధాత్రి పత్రికలో వచ్చిన వార్తపై సర్వత్రా నెలకొన్న ఆసక్తి!

` జగన్‌ వైపే జనం మొగ్గు అన్నది డి.ప్యాక్‌ తో అందరిలో నానుతున్న మాట.

`ప్రతిపక్షాల పరిస్థితి ఎలా వుంటుందనే వివరాలు తెలుసునే ప్రయత్నం.

`భవిష్యత్తు రాజకీయాలపై నేటిధాత్రి కి ఫోన్‌ చేస్తున్న పార్టీల నేతలు

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ది ధైర్యమో, తెగింపో గాని ఈ సమయంలో జాగ్రత్తగా మాట్లడకపోతే ఎమ్మెల్యేలు చే జారిపోతారేమో! అన్న భయం ఆయన లో లేదు. అందుకే బుధవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మరోసారి ఎమ్మెల్యేను హెచ్చరించారు. గతం నుంచి కూడా ఇదే చేస్తున్నారు. కానీ అప్పుడు వేరు. ఇప్పుడు వేరు. అప్పుడు ఎన్నికలకు చాలా సమయం వుంది. ఇప్పుడు ఎన్నికలకు కొద్ది సమయమే వుంది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ 84 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత 74 మంది ఎమ్మెల్యేలు తేల్చారు. ఆ తర్వాత 53 మంది ఇంకా మారలేదని గుర్తు చేశాడు. ఆ మధ్య 22 పేర్లు చెప్పేశాడు. టిక్కెట్లు ఇవ్వడం కుదరదని వారి ముఖం మీదే చెప్పేశాడని జరిగిన ప్రచారం చూస్తున్నాం. అందులో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలేశారు. తాజాగా బుధవారం జరిగిన సమావేశంలో 18 ఎమ్మెల్యేలకు జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్‌ లోపు మీ పని తీరులో మార్పు రాని పక్షంలో టిక్కెట్లు ఇవ్వడం కచ్చితంగా కుదరదని వారి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదంతా నేటిధాత్రి లో కథనం వచ్చిన రోజే జరగడం గమనార్హం. 

ఇప్పుడున్న పరిస్థితుల రాజకీయ తులాభారంలో 

జగన్‌ వైపే జనం మొగ్గు! అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. జనం గురించి ఆలోచించే నేత ఎవరైనా వున్నారంటే అది జగనే అనే అభిప్రాయం సామాన్యులు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అయితే ఎంతటి సంక్షేమ ప్రభుత్వమైనా సరే కొన్ని సార్లు ఐదేళ్ల తర్వాత ప్రజా వ్యతిరేకత కనిపించడం కామన్‌. ఇటీవల ప్రజల తీర్పులో కూడా మార్పులు వస్తున్నాయి. ఐదేళ్ల పాలన పూర్తయినా, జరిగిన ఎన్నికలలో అంతకు ముందు కంటే ఎక్కువ మెజారిటీతో తెలంగాణ లో బిఆర్‌ఎస్‌ గెలవడం చూశాం. కేంద్రం లో బిజేపి చూశాం. కానీ ఆంద్రప్రదేశ్‌ పరిస్థితి కొంత భిన్నం. నిజానికి ముఖ్యమంత్రి జగన్‌ తాను అనుకున్నది కచ్చితంగా చేస్తారని ప్రజలకు నమ్మకం. ఆ నమ్మకం తోనే గతంలో ఎవరికీ ఇవ్వని మెజారిటీ సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించుకున్నారు. అయినా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ అంచనాలు తలకిందులయ్యాయని మాత్రం చెప్పొచ్చు. పోలవరంపై ప్రజల నమ్మకాన్ని జగన్‌ పూర్తి చేయలేదు. ఇది కొన్ని ప్రాంతాలలో ప్రభావం చూపుతుంది. అదే విషయాన్ని నేటిధాత్రి నిర్మొహమాటంగా చెప్పింది. ప్రజలు ఏమనుకుంటున్నారో నిజంగా చెప్పగలిగినప్పుడే ఆ సర్వే సంస్థకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇదే ముఖ్యమంత్రి జగన్‌ కు కూడా నచ్చుతుంది. నేటిధాత్రి కథనంలో చెప్పిన దాదాపు అవే అంశాలను కూడా ఎమ్మెల్యేల సమావేశంలో జగన్‌ ప్రస్తావించారన్న సంగతి తెలిసిందే. 

జగనే మళ్ళీ సిఎం డి.ప్యాక్‌ కధనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. డి.ప్యాక్‌ సర్వే 

వైసిపి సర్వేలకు సమానమైన లెక్కలు చెప్పినట్లు గమనించారు. అందుకే వెంటనే ఎమ్మెల్యేల సమావేశం జరిగినట్లు కూడా తెలుస్తోంది. 

 డీ ప్యాక్‌ సర్వే వివరాలతో ప్రతి పక్షాలలో గందరగోళం నెలకొన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ప్రతిపక్షాలు చేయించుకుంటున్న సర్వేలను వాళ్లే నమ్మడం లేదు. కేవలం మొహమాటానికో, మరే అవసరానికో సర్వే సంస్థలు కొన్ని నిజాలు దాచుతుంటాయి. అందుకు ఒక సంఘటన గురించి ఇక్కడ చెప్పుకుందాం. గతంలో ఓ సీనియర్‌ మంత్రి తెలుగుదేశం లో కీలక భూమిక పోషిస్తూ వుండేవారు. అప్పట్లో ఎవరికి టిక్కెట్‌ వస్తుంది? ఎవరికి రాదు…అనే విషయాలు ఆయన వెల్లడిస్తుండే వారు. అలాంటి నాయకుడు తనకు టికెట్‌ వస్తుందో లేదో అన్న ఆందోళనను ఓ విలేఖరి తో పంచుకున్నాడు. అది అప్పట్లో పెద్ద సంచలనమైంది. సర్వే సంస్థలు కూడా అలా మారిపోయాయి. అందుకే డీ ప్యాక్‌ సర్వే వివరాలు తెలుసుకునే ప్రయత్నం తెలుగు దేశం, జనసేన పార్టీలు చేస్తున్నాయి. 

సర్వే వివరాలలో కొన్ని కచ్చితమైన లెక్కలు చెప్పడంలో డి. ప్రత్యేకతను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అది ఎలా సాధ్యమన్న దానిపై ప్రతిపక్షాల ఆసక్తి? మరింత పెరిగిపోతోంది. ఇదే ఆసక్తి వైసిపిలో కూడా కనిపిస్తోంది. అందుకే వైసిపిలో కూడా చర్చ మొదలైంది. అసలు గెలిచే ఆ వంద సీట్లు ఏవి? అన్నది తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

కేసీఆర్ కు దిమ్మతిరిగేలా..కాంగ్రెస్ వైపు బీసీ ఓట్ బ్యాంక్

 

 

KCR VS CONGRESS :

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పునాదులపై దెబ్బ కొట్టేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూత్ లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకొనేందుకు ప్రకటించిన డిక్లరేషన్ పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే బీసీ వర్గం కష్టాల పైన ఫోకస్ చేస్తూ..వారికి అండగా నిలుస్తూ..వారి మద్దతు కూడగట్టేందుకు సిద్దం వుతోంది. బీసీ డిక్లేరేషన్ లో అనూహ్య నిర్ణయాలతో ముందకు వస్తోంది.

రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని యోచిస్తోంది. త్వరలో సూర్యాపేటలో బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. సిద్దరామయ్య చేత బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేలా ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ గా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. యూత్ డిక్లరేషన్ ప్రియాక ప్రకటించటంతో యువతలో నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే తరహాలో బీసీ డిక్లరేషన్ కు ప్లాన్ చేస్తోంది. తాము ప్రకటించిన తరువాత బీఆర్ఎస్, బీజేపీ ఏం చేసినా బీసీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏదైనా చెప్పినా తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేయని పార్టీగా ఇప్పటికే ముద్ర పడిందని..ఇక నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హామీ ఇస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల న్యాయమైన డిమాండ్లను కూడా చేర్చుతామని చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకొంటామని ప్రకటకు సిద్దం అవుతున్నారు. బీసీ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో బీసీ సంఘాల ముఖ్యుల అభిప్రాయాలకు విలువ ఇచ్చేలా వారికి భాగస్వామ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు లక్ష సాయం ప్రకటన కూడా మోసపూరితంగా మారుతోంది. కేవలం14 బీసీ కులవృత్తులకే లక్ష సాయం ఇస్తామంటోందని, బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికల్లో గెలవాలంటే బీసీ వర్గాలదే డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో, గతం కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించే ఆలోచన కూడా జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఒకటి , రెండు వర్గాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం బీసీల్లో బలంగా ఉంది. అదే సమయంలో బీజేపీలోనూ అదే తరహాలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒక్కో వర్గం సమస్యల పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బీసీలకు 50 శాతం టికెట్లు దిశగా ఆలోచన జరుగుతోంది. బీసీ గణన పైన పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని పార్టీ భావిస్తోంది. బీసీ డిక్లరేషన్ పూర్తయిన తరువాత మహిళలు..రైతుల అంశాల పైన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని భావిస్తోంది.

కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ తో యువతకు భవిత..బీఆర్ఎస్ లో టెన్షన్

 

తెలంగాణ అధికార బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఫోబియా మొదలైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నీళ్లు..నిధులు..నియామకాల నినాదం తో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఒక్క విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతలో ఆశలు నింపిన నేతలు నేడు వారి వైపు కనీసం చూడటం లేదు. ఉద్యోగాల విషయంలోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగుల ఊసే లేదు.ఈ సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ యువతలో ఆశా కిరణంగా మరింది. యవత భవితకు కాంగ్రెస్ నిర్ణయాలు భరోసాగా మారాయి.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన లేదు. కనీసం పోటీ పరీక్షలు సక్రమంగా నిర్వహించ లేని దుస్థితి. పోటీ పరీక్షలకు కేంద్రంగా ఉండే టీఎస్పీఎస్సీలోనే అక్రమాలు. దళారులు తిష్ఠ వేసారు. నిర్వహించిన పరీక్షలు రద్దు చేసారు. ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని దీన స్థితి. నిరుద్యోగులు ఆందోళన చేస్తే వారి పైన కేసులు. వయసు దాటి పోతున్నా..ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఆత్మహత్యలు. కుటుంబాల్లో కన్నీరు. ఈ సమయంలో యువత కోసం కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ పైన ఆసక్తి పెరిగింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో టెన్షన్ పెంచుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు యువ సంఘర్షణ సభలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని చెప్పారు ప్రియాంక గాంధీ. తాము మాట తప్పితే తమను గద్దె దించాలని సూచించారు. యూత్ డిక్లరేషన్ కు జవాబుదారీగా ఉంటామని పేర్కొన్నారు. తను సోనియాగాంధీ కుమార్తెనని నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ లో భాగంగా..తెలంగాణ తొలి,మలి విడత ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పాటుగా తల్లి, తండ్రి లేదా భార్యకు రూ 25 వేల అమర వీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.

ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయటంతో పాటుగా జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందిస్తామని యూత్ డిక్లరేషన్ లో వెల్లడించారు. దీంతో పాటుగా పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి..సెప్టెంబర్ 17 లోగా నియామకాల పూర్తి చేస్తామని స్పష్టంగా పార్టీ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ..ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ 4 వేల చొప్పున నిరుద్యోగ భ్రుతి చెల్లింపు పైన హామీ ఇచ్చారు. ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్పీ తరహాలో పునరుద్దరిస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దేందుకు పలు నిర్ణయాలు ప్రకటించారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిన పైన హామీ ఇచ్చారు. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఈడబ్ల్యుఎస్ వర్గాల విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ తోపాటు పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేసి 6 నుంచి పట్టభద్రులు అయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో 18 సంవత్సాలు పైబడిన చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందచేస్తామని ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ లో స్పష్టం చేసారు.

బిసిల అడ్డ…మునుగోడు గడ్డ!

`మునుగోడు లో బిసిలకు కలిసొచ్చే కాలమే!

` పార్టీలన్నింటి చూపు బిసిల వైపే…

`పార్టీ లన్నీ బిసిల కోసం వెతుకులాటే!

` రెడ్డి లీడర్లది పలాయనమే!

` మరో నియోజకవర్గం వెతుక్కోవడమే!

` బిఆర్‌ఎస్‌ బిసిలకు గాలమందుకే!

`కాంగ్రెస్‌ రెడ్డి ల విషయంలో అంతంత మాత్రమే…

`మునుగోడు లో రేవంత్‌ రెడ్డి అనుచరుడైన ఆ బిసికే..

`రాజగోపాల్‌ రెడ్డి దూరం.. దూరమే!!

` మునుగోడు లో బిజేపి గెలవడం కష్టమే?

` బిజేపి కూడా బిసి నాయకుడి వేటలోనే!

` కాంగ్రెస్‌ కూడా అదే బాటలోనే…

`రాజగోపాల్‌ రెడ్డి కమలం వదిలి కాంగ్రెస్‌ స్నేహ హస్తమే…

` ఎల్‌ బి. నగర్‌, భువనగిరి కోరుతున్నది నిజమే?

` గేర్‌ మార్చింది కొత్త దారి కోసమే?

`మునుగోడు లో పెరుగుతున్న బిసి నేతల హవా!

` బలమైన బిసి నేతలకు పార్టీల వల.

`మొదటి నుంచి నేటిధాత్రి చెబుతున్నదిదే!

`మునుగోడు లో నిజమౌతున్నది అందుకే

హైదరబాద్‌,నేటిధాత్రి: 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మునుగోడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఉప ఎన్నికల జరగడమే అందుకు కారణం. తెలంగాణ రాష్ట్రం లో జరిగిన ఉప ఎన్నికల నియోజకవర్గాలలో మునుగోడు ప్రత్యేకతను సంతరించుకున్నది. అక్కడి నుంచి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అనూహ్యంగా అపజయం పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికలలో గెలిచినా వెంకటరెడ్డి కాంగ్రెస్‌ రాజకీయాలపై ఆసక్తి కనబర్చలేదు. అడుగడుగునా కోమటి రెడ్డి బ్రదర్స్‌ కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ రాజకీయాలు సాగుతూవచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా తదుపరి పిసిసి. నేనే అన్న భ్రమలో వున్న అన్న వెంకటరెడ్డి కి కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. గత ముందస్తు ఎన్నికలలో వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఓటమిపాలయ్యారు. అది ఆయనకు పెద్ద మైనస్‌ అయ్యింది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో టిక్కెట్‌ తెచ్చుకొని గెలిచినా వెంకటరెడ్డి ఆశలు తీరలేదు. అనూహ్యంగా పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి రావడం, కోమటి రెడ్డి సోదరులకు నచ్చలేదు. దాంతో అన్నదమ్ములు ఇద్దరూ బిజేపి వైపు చూశారు. కాంగ్రెస్‌ పార్టీ మీద అనేక విమర్శకులు కూడా చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే కాంగ్రెస్‌ లో కోమటి రెడ్డి సోదరులు ఏం చేసినా చెల్లింది. అయినా వారి అసంతృప్తి ఆగలేదు. తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి బిజేపి బాటపట్టారు. కాంగ్రెస్‌ కు హాండిచ్చారు. దాంతో రాజీనామా చేసి తన పవర్‌ చూపించుకుందామని, రాజగోపాల్‌ రెడ్డి ఉన్న పవర్‌ పోగొట్టుకున్నాడు. ఉప ఎన్నికలలు రానే వచ్చాయి. మునుగోడు మీద అన్ని పార్టీలు ఫోకస్‌ చేశాయి. రాజీనామా చేసి బిజేపి లో చేరిన రాజగోపాల్‌ రెడ్డి ని ఎదుర్కొనేందుకు మునుగోడు నుంచి అనేక మంది బిసి. నాయకులు ముందుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి కి టిక్కెట్‌ ఇవ్వడం బిఆర్‌ఎస్‌ శ్రేణులకు సుతారం ఇష్టం లేదు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. కాకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహించి నేతలంతా కలిసి మునుగోడు లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ని ఉప ఎన్నికలలో గెలిపించారు. 

ఇక్కడితో అసలు కథ మొదలైంది. ఆ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపే ఓట్ల శాతం ఎవరివి? నాయకులు ఎవరు? 

అన్న విషయాలు తెరమీదకు వచ్చాయి. పట్టుమని పది శాతం కూడా లేని రెడ్డి సామాజిక వర్గం ఇంత కాలం పెత్తనం చేస్తూ వస్తోంది. ఇక వారి ప్రాతినిధ్యాన్ని తగ్గించాలంటే అత్యధిక సంఖ్యలో వున్న బిసిలు ఎన్నికలలో పోటీకి ముందు రావాలన్న బలమైన కోరిక వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు రానున్న ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపనున్నది. మునుగోడు లో బిసిలకు కలిసొచ్చే కాలమే! అన్నది కనిపిస్తోంది. 

ఒక్క సారిగా మునుగోడు లో పార్టీలన్నీ బిసిల వైపు చూస్తున్నాయి. 

ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ నుంచి బిసిలలో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్‌ కు చెందిన నారబోయిన రవి పేరు బాగా వినిపిస్తోంది. గత కొంత కాలంగా డి.ప్యాక్‌ తో కలిసి, నేటిధాత్రి చేపట్టిన సర్వే వివరాలు కూడా వెల్లడిరచడం జరిగింది. ఎమ్మెల్యే కూసుకుంట్లపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ విషయమే నేటిధాత్రి చెబుతూ వస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల పై మునుగోడు లో ఎదురౌతున్న వ్యతిరేకత ఆయన కు కూడా తెలుసు. ఈసారి పార్టీ టికెట్‌ ఇచ్చినా గెలిచే పరిస్థితులో లేనని కూడా కూసుకుంట్ల కు తెలుసు. మునుగోడు లో బిఆర్‌ఎస్‌ మళ్ళీ గెలవాలంటే, బిఆర్‌ఎస్‌ ఖాతాలోనే మునుగోడు వుండాలంటే కూసుకుంట్ల పక్కకు తప్పుకోవాలని కూడా తెలుసు. అటు ప్రజలు, పార్టీ శ్రేణులు కూడా మార్పు కోరుకుంటున్నారు. మునుగోడు లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఎంతో దగ్గరౌతున్న రవి నారబోయిన రవికి టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా క్రమంగా పెరుతూవస్తోంది. ఇదే నేటిధాత్రి కూడా చెప్పింది. దాంతో కూసుకుంట్ల చేతులెత్తేసినట్లే అనే ప్రచారం కూడా జోరందుకున్నది. పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరం కలిసి పని చేయాల్సిందే..పార్టీని గెలిపించాల్సిందే అనే మాట ఎమ్మెల్యే కూసుకుంట్ల నుంచి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈసారి టికెట్‌ నారబోయిన రవి కే దక్కుతుందని కూసుకుంట్ల కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే రవికి అనుకూలంగా కూసుకుంట్ల ఈ వ్యాఖ్య చేసి వుంటాడని నియోజకవర్గం మొత్తం చెప్పుకుంటోంది. అంటే కూసుకుంట్ల తప్పుకున్న నేపథ్యం ముందే తెలియడంతో శ్రేణులన్నీ మళ్ళీ ఒక్కతాటి మీద కు వచ్చి బిఆర్‌ఎస్‌ గెలిపించే యోచన కు కసరత్తు మొదలైందనే అంటున్నారు. ఇప్పటికే నారబోయిన రవి ని అభినందనలు కూడా తెలుపున్నట్లు చెబుతున్నారు. మునుగోడు విషయంలో బిఆర్‌ఎస్‌ ఈసారి బిసి మంత్రం జపించే అవకాశం వుందని తెలియడంతో బిజేపి, కాంగ్రెస్‌ లు డైలమాలో పడ్డట్టు సమాచారం. 

దాంతో మునుగోడులో పార్టీ లన్నీ బిసిల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది.

 మునుగోడు లో ఇప్పటి దాకా ఏలిన రెడ్డి లీడర్లకు ఒక్కసారిగా కుదుపు కనిపిస్తోంది. అందుకే రాజగోపాల్‌ రెడ్డి మునుగోడు నుంచి పలాయనం చిత్తగించున్నారన్న ప్రచారం మొదలైంది. మరో నియోజకవర్గం వెతుక్కోవడమే! తాజాగా వినిపిస్తున్న ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం రాజగోపాల్‌ రెడ్డి కమలం వదిలి మళ్ళీ హస్తం గూటికి చేరుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విసృత ప్రచారం సాగుతోంది. ఒకవేళ రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నా అక్కడ ఆయన కు అవకాశం ఇవ్వదు. అందుకే ముందుగానే పక్క నియోజకవర్గం ఎల్‌ బినగర్‌ కానీ, భవనగిరి ఇవ్వాలని పార్టీని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మునుగోడు లో బిఆర్‌ఎస్‌ ను ఓడిరచి తీరుతా? అని శపథం చేసిన రాజగోపాల్‌ రెడ్డి కి దేశ రాజకీయాలలో వస్తున్న మార్పులు కళ్లు తెరిపించినట్లున్నాయి. అందుకే మళ్ళీ హస్తానికి దగ్గరౌతున్నారు. కానీ మునుగోడు కోరుకోవాలనుకోలేదు. పార్టీ మారి మళ్లీ టికెట్‌ తెచ్చుకుని ఎంత ఖర్చు చేసినా గెలవడం కష్టమని తెలిసే రాజగోపాల్‌ రెడ్డి దూరం జరుగుతున్నాడు. దాంతో కాంగ్రెస్‌ కూడా బిసి నాయకుడిని వెతికే పనిలో పడినట్లు సమాచారం. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కి సన్నిహితుడైన ఓ బిసి నేతకు టికెట్‌ ఇస్తే ఎలా వుంటుంది? అన్నదానిపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. బిజేపి లో చేరి జెళ్లకొట్డిన రాజగోపాల్‌ రెడ్డి స్థానంలో బిజేపి కి బలమైన రెడ్డి సామాజిక వర్గ నేత మునుగోడు లో లేడు. కానీ బిసి నాయకులు వున్నారు. అందులో బిఆర్‌ఎస్‌ నుంచి బిజేపి లో చేరిన భువనగిరి మాజీ ఎంపి. బూర నర్సయ్య గౌడ్‌ ను బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మునుగోడు రాజకీయాలు అటు తిరిగి ఇటు తిరిగి నారబోయిన రవి చుట్టే తిరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. గతంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడుగా పని చేసిన అనుభవం వుంది. మరో వైపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన మీద ఎంతో సంతృప్తి వుండి, బంగారు తెలంగాణ వైపు నిలబడాలనుకున్నారు. తెలంగాణ సాధించిన తర్వాత కొన్ని తొలి ఫలితాలు మునుగోడు కు అందడం తో ఆయన బిఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులయ్యారు. తాను కూడా ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో కొన్ని వ్యాపారాలను వ్యాపకాలను కూడా పక్కన పెట్టి, ప్రజా సేవలో నారబోయిన రవి నిమగ్నమయ్యారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటున్నారు. ప్రజల మధ్య నిత్యం గడుపుతున్నారు. ఇటీవల వ్యాపారాలు కూడా పూర్తిగా పక్కనపెట్టి రాజకీయాల మీదనే దృష్టి పెట్టారు. మంత్రి జగదీష్‌ రెడ్డి ఆశీస్సులు మెండుగా వుండడం, బలమైన బిసి సామాజిక వర్గం నారబోయిన రవి కి కలిసొచ్చే అంశాలుగా మారాయి. పార్టీ లన్నీ రవి మూలంగా బిసిల వైపు చూసేలా చేశాయి.

 ఇదే విషయాన్ని నేటిధాత్రి గత కొంత కాలంగా చెబుతూ వస్తోంది. మునుగోడే రాష్ట్ర రాజకీయాలలో మార్పుకు నాంది పలికే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు సాగిన రెడ్డి ల ఆధిపత్యానికి మునుగోడు లో గండి పడనుంది. ఒక్క అడుగుతో నియోజకవర్గం రాజకీయాలనే మార్చిన రవి రాక, ప్రజల ఆదరణ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో మునుగోడును బిసి ల అడ్డాగా మారడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు‌ వైద్య పరీక్షలు

 

Bhatti Vikramark

CLP leader Bhatti Vikramark second day health update :

కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద కొనసాగుతున్న ట్రీట్మెంట్

వడదెబ్బ కారణంగా ఇంకా తగ్గని జ్వరము, నీరసం.

డిహైడ్రేషన్ కావడంతో సెలైన్స్ పెట్టిన వైద్యులు

భట్టికి కేఎల్ ఆర్ పరామర్శ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం నాడు సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు చికిత్స అందిస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన మల్లు భట్టివిక్రమార్క గారిని సూర్యాపేట జిల్లా కేతేపల్లి గ్రామ పాదయాత్ర శిబిరం వద్ద
సీనియర్ కాంగ్రెస్ నేతలు కేఎల్‌ఆర్,ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు.

కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.

చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ గారు చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి.

గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుతప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా సంస్థలను శ్రీ పద్మాకర్ గారు ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు మాట్లాడుతూ ” ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక” అని చెప్పారు.  

తెలుగువాహిని అధ్యక్షులు శ్రీ త్రివిక్రం సింగరాజు గారు మాట్లాడుతూ ” శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నించి, సభ్యులలో భావుకత పెంచే నేటి తరం వచన కవితలు వ్రాయించే దాకా పూచీ తెలుగువాహినిది” అని తెలియజేసారు. 

 

ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ మురళి పగిడేల గారు మాట్లాడుతూ ” ఓంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీ ఎఫ్ ముఖ్య ఉద్దేశ్యమ”ని తెలిపారు.

జగనే మళ్ళీ సిఎం!

` పేద ప్రజల మద్దతు జగన్‌ కే.

` నేటిధాత్రి, డి.ప్యాక్‌ సర్వేలో ప్రజలు జగన్‌ వైపే మొగ్గు.

` జగన్‌ పై అభిమానం చెక్కు చెదరలేదు.

` రాజధాని అంశంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత నిజం.

` మూడు రాజధానులు అవసరం లేదంటున్న కొందరు.

`అమరావతి అన్ని ప్రాంతాలకు అనుకూలమనే భావన వ్యక్తం.

`జగన్‌ సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి సంతృప్తి.

` రియలెస్టేట్‌ ప్రభావం… ఉపాధి కొంత దూరం.

` పోలవరం పూర్తి అయితే బాగుండేదని ప్రజల అభిప్రాయం.

` రాజధాని, పోలవరం రెండు అంశాలే జగన్‌ కు కొంత ఇబ్బందికరమేమో!

` ఇప్పటికీ మించిపోయింది లేదు…పోలవరం ముందుకు సాగితే ఎంతో మేలు.

` జగన్‌ పై తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసహనం.

` జగన్‌ కారణంగానే గెలిచామన్నది ఆ ఎమ్మెల్యేలు మర్చిపోయారన్నది చెబుతున్న జనం.

`మద్యం విషయంలోనూ కొంత గందరగోళం.

`అది కూడా వైసిపికి కొంత నష్టం చేకూర్చే అంశం.

` విద్య విషయంలో ఆంద్రప్రదేశ్‌ బెస్ట్‌ అనే మాట వినబడుతోంది.

`వైద్యం విషయంలో కొంత వెనుకబాటు వుందనిపిస్తోంది.

`రాజధాని మీద క్లారిటీ ఇస్తే చాలు…వైసిపికి తిరుగులేదు.

`కొంత మంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందే…లేకుంటే నష్టమే…

`ఆంద్రలో ఆరు నెలలుగా డీ ప్యాక్‌ సాగిస్తున్న విస్తృత సర్వే…

`కర్నాటక ఫలితాలతో డి. ప్యాక్‌ గణాంకాలపై ఆంద్రప్రదేశ్‌ లోనూ ఆసక్తి.

` డి.ప్యాక్‌ మీద పెరిగిన మరింత నమ్మకం.

` ఆంద్రప్రదేశ్‌ రాజకీయాలపై డి. ప్యాక్‌ ఏం చెబుతోందో అని చాలా మంది ఎదురుచూపు.

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపికి వంద సీట్లు.

హైదరబాద్‌,నేటిధాత్రి:                             

సహజంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఎవరికైనా ఆసక్తి ఎక్కువ. తెలంగాణలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్దితి ఎలా వుంది? అనిశ్చితి వుందా? అంతా సవ్యంగానే వుందా? అదికార పార్టీలే మళ్లీ గట్టెక్కుయా? ప్రతిపక్షాలకు ఏమైనా అవకాశం వుందా? అన్న సందేహాలు అనేకం వ్యక్తమౌతూనే వుంటాయి. ఏ నలుగురు ఒక్క చోట చేరినా గతంలో కుటుంబాలు, కుటుంబ సమస్యల గురించి మాట్లాడుకునే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మాట్లాడుకోవడం ఎక్కువైంది. పైగా మీడియా పెరిగిపోవడం కూడా ప్రజల్లో ఇలాంటి చర్చ ఎప్పుడూ జరుగుతూనే వుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం జరుగుతూనే వుందని చెప్పాలి. ఎన్నికలు ముగిసేదా సాగే చర్చలు, సర్వేలు…ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం కొలువు తీరిన మరుక్షణం నుంచి వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుకోవడం రాజకీయ పార్టీలకు అలావాటుగా మారింది. ప్రజలు తీర్పిచ్చి అధికారం అప్పగించిన మరుక్షణమే వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని అప్పటినుంచే చెప్పే రాజకీయాలు నేడు వున్నాయి. గతంలో నాలుగున్నరేళ్లు ప్రజలు, పాలన, ఆరు నెలల ముందు రాజకీయాలు అని చెప్పేవారు. ఆ పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? అన్న దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారన్న చర్చలు, సర్వేలు జరిగేదాకా వచ్చేశాయి. అంతే కాదు పాలనలో వున్నవారు, ప్రతిపక్ష పార్టీలు సైతం ఐదేళ్లలో నిరంతరం సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. రాజకీయాలు పాలనపై కన్నా సర్వేల మీద ఎక్కువ దృష్టిపెడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. అందుకు ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేదు. దేశంలో వున్న అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నవే..అనుసరిస్తున్నవే..అయితే ఇటీవల ఎక్కువ సక్సెస్‌ రేటు ఏ సర్వే సంస్ధకు వుందన్న దానిని కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. సర్వేలపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ మధ్య కాలంలో ఖచ్చితమైన లెక్కలతో సహా సర్వే వివరాలు అందిస్తున్న డిప్యాక్‌ సర్వే సంస్ధ, నేటిధిన పత్రికతో కలిసి చేస్తున్న సర్వేలపై దేశం మొత్తం చర్చ జరుగుతోందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన డి.ప్యాక్‌ సర్వే దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించిందనే చెప్పాలి. కర్నాటక ఎన్నికల్లో ఏ సర్వే సంస్ధ చెప్పని లెక్కలు చెప్పింది ఒక్క డిప్యాక్‌ మాత్రమే. అందుకే ఆంధ్రప్రదేశ్‌రాజకీయాలపై డిప్యాక్‌ సర్వేచేస్తుందని తెలిసి, అనేక మంది సంస్ధ ప్రతినిధులకు ఫోన్లు చేస్తూ, పరిస్ధితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారి ఆసక్తి, ప్రజలకు డిప్యాక్‌పై వున్న నమ్మకం నేపధ్యంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజలు అభిప్రాయాలను కొన్నింటిని విడుదల చేయాలని నిర్ణయించాం. అందులో భాగమైన కొన్ని విషయాలు, వివరాలు పాఠకుల కోసం వెల్లడిస్తున్నాం.

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే వైసిసి మరోసారి విజయం సాధిస్తుందని తెలుస్తోంంది. 

సరే వైసిపి పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏకంగా 175 సీట్లు సాధిస్తామని చెబుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అది వేరే సంగతి. కాని డిప్యాక్‌ సంస్ధ, నేటిధాత్రి తో కలిసి గత రెండేళ్లుగా సర్వేలు చేస్తూనే వుంది. అయితే ఆరు నెలలుగా మరింత కీలకంగా సర్వేను జరుపుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల నాడిని పూర్తిగా అంచనా వేసే ప్రయత్నం లోతుగా చేస్తూ వస్తోంది. ప్రజలనుంచి సమాచారం సేకరించడంలో డిప్యాక్‌ సంస్ధది ప్రత్యేక శైలి. అందుకే ఎవరూ అంతుచిక్కని రహస్యాలు కూడా చెప్పడంలో డిప్యాక్‌ అందరికంటే ముందుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వస్తున్న మార్పులపై మీడియా చేస్తున్న హడావుడికి, డిప్యాక్‌ చేస్తున్న సర్వేకు వున్న తేడా ఏమిటో వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలు కలిస్తే..అన్న చర్చ అప్పుడే జరిగి, అప్పుడే చల్లారిపోయే రాజకీయాలను చూసి లెక్కలేసుకోవడం సరైంది కాదు. ప్రజలు క్షేత్రస్ధాయిలో పార్టీలపట్ల వున్న అభిప్రాయాన్ని పూర్తిస్ధాయిలో వడపోయాల్సిన అవసరం వుంది. అందుకే లోతైన సర్వేలు చేయడంలో ఆరితేరిన డిప్యాక్‌ కొన్ని కఠినమైన వాస్తవాలు చెప్పడం జరుగుతోంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే డిప్యాక్‌ పూర్తిగా ప్రజల పక్షంలో సర్వేచేయడం వల్లనే ఖచ్చితమైన లెక్కలు చెబుతోందని చెప్పగలుగుతున్నాం. 

వైసిసి ఈసారి ఎందుకు విజయం సాధిస్తుందని చెప్పడానికి ప్రధాని కారణం నవరత్నాలు ప్రజలకు ఎంతో భరోసా కల్గించాయని మాత్రం చెప్పగలం.

 పేద ప్రజల మద్దతు మాత్రం ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి, వైసిపికి మాత్రమే వుందని స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాదు కేవలం జగన్మోహన్‌రెడ్డికి విధేయులకు మాత్రమే ఈసారి కూడా విజయం వరిస్తుందని కూడా చెప్పగలం. జగన్‌తో విభేదిస్తున్న నాయకులకు మాత్రం ప్రజాక్షేత్రంలో కష్టమే అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ,పార్టీకి బాధ్యులుగా వ్యవహరించని నేతలు, మీడియా చేస్తున్న హడావుడిని నమ్మి, తెలుగుదేశం వైపు చూస్తున్నవారికి ప్రజలనుంచి వ్యతిరేకత తప్పదని మాత్రం అర్ధమౌతోంది. జగన్‌పై ఆంద్రప్రదేశ్‌ ప్రజల్లో వున్న నమ్మకం చెక్కుచెదరలేదు. కాకపోతే ఐదేళ్ల పాలన తర్వాత ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత రావడం అన్నది సహజం. ముఖ్యంగా రాజధాని అంశం వైసిపికి కొంత ఇబ్బంది కరమే అన్నది నిర్వివాదాంశం. రాజధాని అన్నదానిపై ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేయడాన్ని ప్రజలు కూడా ఆహ్వానించడం లేదు. తొలుత మూడు రాజధానులు అన్నదానిపై ప్రజలు కూడా ఆసిక్తిని కనబర్చారు. కాని అటుగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు. స్పష్టంగా ఒక రాజధాని అంటూ అభివృద్ధి కాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా పడిపోయిన భూముల ధరలు, రాజధాని చుట్టుపక్కల కూడా భూములు విలువ తగ్గిపోవడం అన్నది రాష్ట్రానికి నష్టదాయకంగా పరిణమించిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో వైసిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు కనిపించక, తెలంగాణకు లక్షలాది మంది వలసలు వస్తున్నారన్నది నిజం. వాళ్లంతా జగన్‌ అంటే ఇష్టమంటూనే, బతకాలి కదా? అంటున్నారు. అంటే జగన్‌ పాలనలో ఉపాధి లోటు అన్నది కనిపిస్తోంది. దానికి తోడు రియలెస్టేట్‌ వ్యవస్ధ కుప్పకూలిపోయింది. విశాఖ రాజధాని నగరంగా అక్కడి ప్రజలు కూడా పూర్తిగా స్వాగతించడం లేదు. అందువల్లమూడు రాజధానుల మాట ఇప్పటికైనా పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన అమరావతి అభివృద్ధి మీద దృష్టి పెడితే ప్రజలంతా మళ్లీ జై జగన్‌ అనడం ఖాయం. అంతే కాకుండా పోలవరం గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలవరం దివంగత వైఎస్‌ కల. జగన్‌ ఆ కల పూర్తిచేస్తాడన్న నమ్మకం ప్రజల్లో వుంది. కాని పనులు నత్తనడకన సాగడం అన్నది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌తో మొదలైన నత్తనడక..ఇంకా అలాగే సాగడాన్ని రైతుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్య మాత్రం సూపర్‌ అంటున్నారు. ఏ ప్రభుత్వ బడిలోనూ సీట్లు లేవు అన్న బోర్డులు కనిపించడం విశేషం. కరోనా సమయంలో ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది, అత్యాధునిక వసతులు ఏర్పాటుచేసి, డిజిటల్‌ విద్యను, ఆంగ్ల విద్యను ప్రోత్సహించడాన్ని అన్నివర్గాలు స్వాగతిస్తున్నాయి. దానికి తోడు అమ్మఒడి కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తోంది. అయితే ఆరోగ్య రంగం కొంత కంటుపడిరదనే ప్రజలు అంటున్నారు. మద్యం పాలసీపై కూడా ప్రజలు గుర్రుగా వున్నారు. బ్రాండ్‌ల విషయంలో అందరూ చెప్పుకుంటున్నదే ప్రజలు కూడా చెబుతున్నారు. ఎంత సంక్షేమం చేపట్టినా, ప్రజల జీవితాల మీద ప్రభావం చూపే, వైద్యం, మద్యం, వ్యవసాయ రంగానికి అవసరమై పోవలరం, రాజధాని నిర్మాణం మీద ప్రభుత్వం దృష్టిపెడితే జగన్‌కు తిరుగులేదు. అయినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా వైసిపికి వంద సీట్లు గ్యారెంటీ…ఈ పనులన్నీ పూర్తిచేస్తే మరోసారి డబుల్‌ గ్యారెంటీ…!

ట్రెండ్ సెట్టర్ గా భట్టి పాదయాత్ర..కర్ణాటక సీఎం ఆసక్తి.. డీకే శివకుమార్ ఆరా..

 

 

తెలంగాణ కాంగ్రెస్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ట్రెండ్ సెట్ చేస్తోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావటం..రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి యాత్ర తో తెలంగాణ కేడర్ లో జోష్ పెరిగింది. ఇవే నివేదికలతో కాంగ్రెస్ నాయకత్వం భట్టి చొరవను ప్రశంసించింది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తెలంగాణలో భట్టి యాత్ర పైన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆరా తీసారు. భట్టి పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో కాంగ్రెస్ నాయకత్వం ప్రశంసిస్తోంది. రాహుల్ ను ప్రధానిగా చేయటం ఈ సారి దక్షిణాది రాష్ట్రాలు కీలక భూమిక పోషించనున్నాయి. అందునా తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుంది. ఆ దిశగా భట్టి తన పాదయాత్రలో వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. పదేళ్ల గులాబీ పార్టీ పాలన పైన విసుగెత్తిపోయారు. ప్రతిపక్షాలను అణిచివేయాలనే కుట్రలు కొనసాగుతున్నాయి. కేంద్ర…రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అక్కడ బీజేపీ..ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరరకు జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ స్పూర్తి తో తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారు. మార్చి 16న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ప్రారంభమైన భట్టి యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. అనారోగ్య సమస్యలు వచ్చినా..యాత్ర కొనసాగింపులో వెనుకడుగు వేయలేదు. పార్టీ ప్రముఖులు..సీనియర్లు..కేడర్ భట్టి యాత్రకు అండగా నిలిచింది.

భట్టి పాదయాత్ర ప్రణాళికా బద్దంగా కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల మధ్యకు వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు ఓదార్పు ఇచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. కేంద్రంలో ప్రధానిగా రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే మంచిని ప్రజల మధ్య విశ్లేషించారు. భట్టికి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ కనిపించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందన పార్టీ అధినాయకత్వం వరకు వెళ్లింది. తెలంగాణలో పార్టీ కోసం భట్టి చేస్తున్న పాదయాత్ర పైన స్వయంగా రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ థాక్రే నుంచి ఆరా తీసారు. భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలంగాణలో భట్టి పాదయాత్రకు వస్తున్న ఆదరణ పైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను వివరాలు కోరారు. సిద్దరామయ్య ఆదేశాలతో డీకే తెలంగాణలో భట్టి పాదయాత్ర గురించి ఆరా తీసారు. పాదయాత్రలో భాగంగా గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లతో భట్టి మమేకమవుతున్న తీరు.. వస్తున్న స్పందన బాగుందని సర్వే సంస్థలు డీకేకు..పార్టీ అధినాయకత్వానికి నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పాద‌యాత్ర‌లో 500 వందలకు పైగా గ్రామాలు.. తండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు కవర్ అయ్యాయి.వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చటం లక్ష్యంగా ఈ పాద‌యాత్ర ముందుకు కొనసాగుతోందని డీకే సేకరించిన సమాచారంలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఈ సారి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ కేడర్ కు ఈ యాత్ర మరింత విశ్వాసం నింపుతోందని గుర్తించారు. కర్ణాటక తరువాత ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ కు తెలంగాణ కీలకంగా మారుతోంది. 2024లో రాహుల్ ని ప్రధాని చేయడంలో దక్షిణాది రాష్ట్రాలుకిలకంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం..2024లో రాహుల్ ప్రధాని కావటం తన లక్ష్యమని భట్టి స్పష్టం చేస్తున్నారు. పార్టీ భవిష్యత్ కోసం భట్టి చేపట్టిన పాదయాత్ర ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇప్పుడు భట్టి పాదయాత్ర కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోంది.

Political Heat Rises in Telangana: తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? ఒక్కటంటే… ఒక్కటి! రాజా సింగ్ మాత్రమే తన స్వంత బలంతో ఓల్డ్ సీటీలో గెలిచాడు. మిగతా అన్ని చోట్లా కాషాయం కొట్టుకుపోయింది. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది! అయినా కూడా ‘ట్రిపుల్ ఆర్’ ఎమ్మెల్యేలతో కమలం ఇంకా హస్తం కంటే బాగా వెనుకబడే ఉంది! అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు…
తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. కేసీఆరే సీఎంగా కొనసాగుతున్నారు. అయితే, ఆయనపై అలుపెరుగని పోరాటం చేస్తోంది మాత్రం… గత దశాబ్ద కాలంగా… కాంగ్రెస్ పార్టీయే. ఇప్పటికిప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హస్తం పార్టీయే. మరి బయట బోలెడు ప్రగల్భాలు పలికే బీజేపీ పరిస్థితి ఏంటి? హిమాచల్ మొదలు కర్ణాటక దాకా అనేక చోట్ల ఓడిపోతోన్న కమల దళం తెలంగాణలో ఏ మాత్రం ఎదిగే సూచనలు కనిపించటం లేదు. ఈటెల రాజేందర్ గెలిచాక ఆయనను చేరికల కమీటి అంటూ ఒకటి ఏర్పాటు చేసి… దానికి నాయకుడ్ని చేశారు. అయినా చేరికలూ జరగలేదు. తీసివేతలు కాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది టీ బీజేపీ పరిస్థితి. పైగా గత కొన్ని రోజులుగా తెలంగాణ కమలంలో ముసలం పుడుతోంది…
టీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ పోకడలు ఈటెల మొదలు ధర్మపురి అరవింద్ వరకూ చాలా మందికి నచ్చటం లేదట. ఈ విషయం వారు స్వయంగా అంగీకరించనప్పటికీ అనేక లుకలుకలైతే ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ దిల్లీ హైకమాండ్ వద్దకి బండి సంజయ్ వ్యతిరేకులు బృందంగా వెళ్లి రావటం కూడా బహిరంగ రహస్యమే! అలాగని వారి కోసం బండిని అధ్యక్ష పదవి నుంచీ తొలగిస్తారా? మోదీ, అమిత్ షా అటువంటి నిర్ణయం తీసుకుంటారా? అబ్బే అలా జరగదంటున్నారు బీజేపీలోని వారే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిపోతోన్న వేళ ప్రెసిడెంట్ ని మార్చితే గందరగోళం అవుతుందని వారి వాదన!
బీఆర్ఎస్ ను అధికారంలోంచి దించి భాగ్యనగరంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికిన టీ బీజేపీ నాయకులు ఇప్పుడు అంతర్యుర్ధాలతో సతమతం అవుతున్నారు. మరోవైపు, దిల్లీ కాషాయ పెద్దలు కేసీఆర్ కుమార్తె విషయంలో మొదట్లో తెగ హడావిడి చేశారు. కవితని అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా వాతావరణం సృష్టించారు. ఇప్పుడు చూస్తుంటే లిక్కర్ కేసు మత్తు మొత్తం దిగిపోయినట్టే కనిపిస్తోంది. కవిత అరెస్టు ఒట్టి మాటేనని బీజేపీలోని వారే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. కవిత ఎపిసోడ్ వల్ల జనం ముందు బీజేపీ చులకనైందని వారి ఆవేదన. బీఆర్ఎస్ తో గట్టిగా పోరాడేది బీజేపీ కాదు కాంగ్రెస్సేనని క్షేత్రస్థాయిలో జనం భావిస్తున్నారట!
ప్రస్తుతానికి బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ ల తరువాతి స్థానంలో ఎక్కడో సుదూరంగా ఉన్న బీజేపీ ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా అప్పుడే అనేక సమస్యలతో కుదేలవుతోంది. జనంలో నమ్మకం కలిగించలేక, పార్టీలోని నేతల్లో ఐకమత్యం తీసుకురాలేక కమల దళం చేతులు ఎత్తేస్తోంది. అందుకు మంచి ఉదాహరణే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావుల వ్యవహారం. మొదట్లో వారిద్దరూ కాషాయ కండువా కప్పేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంత వరకూ అది జరగలేదు. మరోవైపు, కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పొంగులేని, జూపల్లి టీ కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వచ్చారట. వారిని ఎలాగైనా పార్టీలోకి తీసుకోవాలని హస్తం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే వలసలపై బీజేపీ పెట్టుకున్న ఆశలు ఆడియాశలే అవుతాయి. బీఆర్ఎస్ వద్దనుకున్న వారికి కాంగ్రెస్సే ఛాయిస్ గా మారుతుంది. బీజేపీ 2018లో మాదిరిగానే… మరోసారి మూడు, నాలుగు సీట్లతో మూడో స్థానానిక పరిమితం అవుతుంది!
ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ హస్తం పార్టీ చరిత్ర సృష్టిస్తే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. మరి బీజేపీ సంగతేంటి? ఆటలో అరటి పండుగా మిగలటమే!

పచ్చగా తిన్నదెక్కడ ! వెచ్చగా పన్నదెక్కడ!?

రేవంత్‌ తర్కం రమ్మన్నట్టా!

 వద్దన్నట్టా!! 

`రండి..రండి అంటున్నట్లా?

`మీ ఖర్మ అని జాలిపడినట్లా?

`రేవంత్‌ వ్యాఖ్యలెవరి కోసం?

`కమలం నుంచి హస్తానికి క్యూ..నిజమేనా?

`ఒక్క సీటిస్తాం..పది సీట్ల ఖర్చు అప్పగిస్తాం!

`ఆప్షన్‌ లేదు…ఈటెలకూ బిజేపి మీద నమ్మకం లేదు?

`రెడ్డి రాజకీయంలో రేవంత్‌ వింత పోకడ?

`బిజేపి రెడ్డీలంతా కాంగ్రెస్‌ గూటికా!

`గుండుగుత్తగా జంపా!?

`జూపల్లి రావడం ఇష్టం లేకనా?

`పొంగులేటి రాకుండానే పొగబెట్టడమా?

`పది మెట్లు దిగుతా అన్నది ఇందుకేనా?

`పాపం పొంగులేటి..జాలి పడేవారు లేకుండా పోయిరి?

`అయినా కాంగ్రెస్‌ తప్ప దిక్కులేకుండా చేసుకుంటిరి?

`ఈటెలకు ఉమ్మడి కరీంనగర్‌ ఖర్చులు?

`పొంగులేటి కి ఖమ్మం లెక్కలు?

`నల్గొండ వెంకటరెడ్డికి అప్పగింతలు?

`బోనస్‌ ఎల్‌ బి.నగర్‌ తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి కి?

`రంగారెడ్డి ఎవరికి?

`జితేందర్‌ రెడ్డికి దిక్కేమిటి?

`రాములమ్మ కూడా కాంగ్రెస్‌ గూటికి…?

`భబ్రాజమానం భజగోవిందం!

`ఆలస్యం కొంప ముంచుతుందేమోనని భయం!

`తట్టా బుట్టా సర్థుకొని అంతా సిద్ధం?

`బిజేపిలో మొదలైన అంతర్మధనం!

`ఈటెల అందుకే ఈ మధ్య దూరం.. దూరం.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసే రోజులు. అలాంటి కాలంలో కూడా నాయకులు ప్రజలను మభ్యపెట్టాలని, తాము పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు తెలియకుండా పోతుందా? తాజా రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు విచిత్రమైన వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ఎటు పోతున్నామో తెలియని దారిలో పయనిస్తున్నాయి. ఎవరు తోడు వస్తారో తెలియని వైపు అడులేస్తున్నాయి. ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరు వస్తారో అని ఎదురుచూస్తున్నాయి. గతంలో ఇలాంటి రాజకీయాలు ఎన్నడూ విన్నది లేదు. చూసింది లేదు. ఎన్నికల తరుణం వచ్చేసిందటే ప్రతిపక్షాలు బలంగా వున్నట్లు కనిపించేవి. ప్రజలు కూడా ముందే సంకేతాలిచ్చినంత పనిచేసేవారు. కాని టెక్నాలజీ పెరిగిన తర్వాత నాయకులు వేసే వింత వేషాలు చూసి, ప్రజలు కూడ తమ తమ పాత్రను బాగానే పోషిస్తున్నారు. నొప్పింపక తానోవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లు ప్రజలు అందరినీ ఆదరిస్తున్నారు. ఎన్నికల్లో మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. గత ముందస్తు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్‌ ఊపు మీద వుందన్న ప్రచారం జోరుగా సాగింది. కాని ఏమైంది? బొక్కా బోర్లాపడిరది. మళ్లీ కోలుకోలేనంత దెబ్బ పడిరది. అయినా ఆ పార్టీలో వచ్చిన ఊపు లేదు. కొత్త బలం లేదు. బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరొస్తారా? లేక బిజేపి నుంచి ఎవరొస్తారా? అని ఎదురుచూస్తోంది. అదేవిధంగా బిజేపికూడా ఎదురుచూస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ఎవరు వస్తారా? బిఆర్‌ఎస్‌ నుంచి ఎంత మంది వస్తారా? అన్నదానిపై ఆశలు పెట్టుకొని రాజకీయాలు చేస్తోంది. కర్నాకట ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్‌తో బిజేపికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఇక కోలుకోలేకపోతోంది. అదలా వుంటే వచ్చినవారు వుంటారా? లేదా? అన్న ఆందోళన బిజేపిలో మొదలైంది. 

 ఉన్న ఫలంగా బిజేపిలో చేరిన నేతలందరూ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్న పెద్దఎత్తున జరుగుతున్న ప్రచారం.

మరో వైపు బిఆర్‌ఎస్‌ బహిషృత నేతలు ఖమ్మం మాజీ ఎంపి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరుకు చెందని మాజీ మంత్రి జూపల్లికృష్ణారావులు బిజేపి వైపు అడుగులేస్తున్నారన్న వార్తలు, కాస్త మాయమై, కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికీ ఆ ఇద్దరు నేతలు ఎటు వెళ్తారన్నదానిపై వారికే స్పష్టత లేదు. కాకపోతే కాంగ్రెస్‌ , వామపక్షాలు ఐడియాలజీలున్న నాయకులంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. బిజేపిలో చేరి తమ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించుకొని, ఇంకా అక్కడే వుంటే ప్రజలు కూడా మర్చిపోతారని భయపడుతున్న నేతలంతా కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారన్న వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. వారిలో బిజేపిలో చేరి ఆ పార్టీలో కొంత కాలం సంచలనంగా మారిన ఈటెల రాజేందర్‌ కూడా తీవ్ర అసంతృప్తిలో వున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన కూడా మూటా ముళ్లె సర్ధుకునేందుకు సిద్దంగా వున్నారని ప్రచారం. ఆయన ఒక్కడు బిజేపినుంచి వెళ్తే ఆయనతో వచ్చిన వారంతా కూడా వెళ్లిపోతారనేది సహజంగా వచ్చే అనుమానమున్నదే. .ఈటెల వెంటే వాళ్లంతా వెళ్తారన్నది జగమెరిగిన సత్యమే. ఈటెలతో సంబంధం లేకుండా బిజేపిలో చేరి సొంత గూటికి చెరినట్లు, పుట్టింటికి చేరినట్లుందని చెప్పిన రాములమ్మ ( విజయశాంతి) కూడా బిజేపిపై తీవ్ర అసంతృప్తితో వున్నట్లు చెబుతున్నారు. కనీసం కాంగ్రెస్‌లో వున్నప్పుడు అడపా దడపానైనా మీడియాలో వుండే అవకాశం వుండేది. కాని బిజేపిలో చేరిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారన్నది ఆమెకు అర్ధమైంది. అందుకే మళ్లీ కాంగ్రెస్‌వైపు చూస్తోందని సమాచారం. మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డి.కే . అరుణ కూడా మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సంసిద్దతమౌతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రియాంకా గాంధీ పర్యటన సందర్భంగా ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక జితేందర్‌రెడ్డి లాంటి మాజీ ఎంపి, కొండా విశ్వేశ్వరెడ్డిలు కూడా త్వరలో కాంగ్రెస్‌ తీర్ధంపుచ్చుకుంటారని అంటున్నారు. 

 ఇక ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక రకంగా తెలంగాణలో రాజకీయ దుమారాన్నే సృష్టించాడని చెప్పొచ్చు.

ఆయన ప్రకంపనలు సృష్టిస్తాడని కూడా చాలా మంది ఊహించారు. కాని తానే ఎటుకాకుండా చౌరస్తాలో నిలబడాల్సి వస్తుందని మాత్రం ఆయన కూడా కలలో ఊహించి వుండకపోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రభంజనమైపోతా? అన్నంతగా పొంగిన పొంగులేటి పాల పొంగు చల్లారినంత సేపు కూడా ఆయన రాజకీయం సాగలేదన్నది వాస్తవం. ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. కొంత కాలం క్రితం వరకు మా పార్టీకి పొంగులేటి వస్తున్నాడు? అని కాంగ్రెస్‌…లేదు..లేదు మా పార్టీకే వస్తున్నాడంటూ బిజేపి చెప్పుకున్నాయి. కాని ఈటెల రాజేందర్‌ చెప్పిన ఒక్క విషయంతో అటు బిజేపి, ఇటు కాంగ్రెస్‌లతోపాటు, ఆఖరుకు పొంగులేటి కూడా తన పరవు తాను తీసుకున్నాడు. ఈటెల రాజేందర్‌ రాజకీయాన్ని ఒక్కసారి దెబ్బతీశాడు. తాను బిజేపిలో చేరడం కాదు. నువ్వొస్తే మరో వేధిక ఏర్పాటు చేద్దామంటూ తనకే కౌన్సిలింగ్‌ ఇచ్చారని ఎప్పుడైతే ఈటెల చెప్పారో అప్పటి నుంచి ఆయన మనసు కూడా చెదిరినట్లే వుంది. బిజేపిలో ఇన్ని తలనొప్పులు భరించడం తన వల్ల కాదన్న నిర్ణయానికి కూడా ఈటెల వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఈటెల కాంగ్రెస్‌లోకి వస్తానంటే మాత్రం కళ్లకు అద్దుకొని తీసుకుంటారనేది మాత్రం వాస్తవం. మరి ఊగిసలాడుతున్న పొంగులేటి వ్యవహారాన్ని మాత్రం కాంగ్రెస్‌ ఇప్పటికే జీర్ణించుకోలేకపోతోంది. 

  తాజాగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొంగులేటికి ద్వారాలు మూసినట్లా? తెరిచినట్లా? అన్నది అర్ధంకాకుండాపోయింది.  

పచ్చగా వున్న చోట తిని, వెచ్చగా వున్న చోట పందామని చూస్తున్నట్లునున్నారు…అంటూ పొంగులేటి, జూపల్లి ల గురించి చెప్పినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఓ వైపు తాను పది మెట్లు దిగుతానంటూ ఓ వైపే రేవంత్‌రెడ్డి ప్రకటిస్తూనే మరోవైపు ఇలా చురకలంటిండంలో ఆంతర్యమేమిటన్నది ఎవరికీ అర్ధంకాకుండావుంది. అయితే ఇదంతా పొంగులేటి ఇక తప్పని పరిస్ధితుల్లో కండువా కప్పుకున్నా, ఖమ్మంలో ఒక్క సీటు తప్ప మరే సీట్లు ఇవ్వమని పరోక్షంగా ఇచ్చిన సంకేతంగా భావించొచ్చన్నది కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్న మాట. అంతే కాదు ఒక్క సీటిచ్చి, ఖమ్మం పది సీట్లు గెలిచే ఖర్చు కూడా పొంగులేటే పెట్టుకునేలా షరతు కూడా పెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్దంగా వున్నట్లు సమాచారం. అయితే ఒక్క పొంగులేటితోనే కాకుండా కాంగ్రెస్‌వైపు చూస్తున్న ఈటెలకు కూడా ఉమ్మడి కరీంనగర్‌ బాధ్యతలు అప్పగించి, ఖర్చు బాధ్యతుల కూడా ఆయనకే అప్పగించాలని చూస్తున్నారట. నల్గొండ బ్రాండ్‌ అంబాసిడర్లుగా చెప్పుకున్న కోమటి రెడ్డి సోదరుల్లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మనసు మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లిందని సమాచారం.. అందుకే ఆయనకు ఎల్‌బినగర్‌ టిక్కెట్‌ ఇస్తే, ఉమ్మడి నల్లగొండ ఖర్చులు చూసుకునేందుకు ఆ సోదరులు కూడా సిద్దమైనట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా జరిగుతుందా? లేదా? అన్నది ఇప్పటికప్పుడు తేలకపోయినా, జూన్‌ లో రావాల్సిన రుతుపవనాలు ఎలా ఊరిస్తున్నాయో? నాయకులు కూడ అలాగే ఆలస్యం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చినా ఎండలు మండిపోతున్నట్లు, రాజకీయాలు వేడెక్కిస్తున్నారు…మరి చినుకులెప్పుడు పడతాయో? ఈ నాయకులంతా ఎప్పుడు పార్టీలు మారుతారో..అని మాత్రం మీడియా ఎదురుచూస్తోంది. ఎందుకంటే మీడియా హడావుడి లేకపోతే…రాజకీయాలే సప్పగా వుంటాయి.

error: Content is protected !!
Exit mobile version