ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…
మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి…
జూన్ 25న చలో వరంగల్ రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయండి…
నేటి ధాత్రి- గార్ల:-
ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి. సక్రు డిమాండ్ చేశారు. మంగళవారం సత్యనారాయణపురం లో ఈ నెల 25న వరంగల్ లో తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సక్రు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకు పూనుకుందని పేర్కొన్నారు. ఆదివాసి, గిరిజన ప్రజలను అటవీ సంపదకు దూరం చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఎన్కౌంటర్లు,హత్యాకాండ పతాక స్థాయికి చేరి ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఎవరినైనా కాల్చి చంపి ఎన్ కౌంటర్గా ప్రకటించే ఆనవాయితీని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని అన్నారు.2004లో వైయస్సార్ ప్రభుత్వానికి పీపుల్స్ వార్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరిగాయి కానీ ఆ చర్చల్లో కీలక భూమిక పోషించిన భూమి విషయం వచ్చేసరికి రెండవ దప చర్చల్లో పరిష్కరించుకుందామని మొదటిదప చర్చలను ముగించడం జరిగిందని రెండవ దప చర్చలేమో కానీ మళ్ళీ నల్లమల్ల అంతా రక్తం ఏరులై పారి చర్చల వాతావరణమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజన ప్రజలను అటవీ సంపదకు దూరం చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరరావు, బొమ్మగంటి రాధా,దబ్బేటి శారద,మంకిడి భారతి, లక్ష్మయ్య,సుమన్, సక్రు, రామదాసు,రమేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.