అణగారిన వర్గాలు కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాలే
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని :- నేటి ధాత్రి
ఆనాడు పటేల్ పట్వారీ దొర బాంచెన్ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్బంగా మంథని పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల విగ్రహాల వెనుక దాగి ఉన్న చరిత్రను తెలియజేయాలనే ఆలోచనతో మంథనిలో విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఆనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు నేలవంక కింద చూసి నడిచే వారని కనీసం పెద్దవాళ్లను తల ఎత్తి చూసేవారు కాదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చిన చరిత్ర ఎన్టీఆర్దేనని అన్నారు. ఈనాడు బీసీలు రాజకీయంగా ఇంత ఎత్తు ఎదిగారంటే అందుకు ఎన్టీ రామారావు కారణమన్నారు. ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస పార్టీ తమ చెక్కు చేతల్లో ఉండే వాళ్లను మాత్రమే రాజకీయంగా వాడుకునే వారని, ఎస్సీల్లో రిజర్వేషన్లు ఉన్నా స్వతంత్ర ఆలోచన శక్తి ఉండేది కాదన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఎస్సీలను ముందుకు తీసుకువచ్చి రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మనం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు