రూ.2,200 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి
అప్పటివరకు 25వేల పనుల ప్రతిపాదనలు కలెక్టర్ల పరిశీలనలోనే
పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం తీవ్ర జాప్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల మంజూరుపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కలెక్టర్లకూ అదే సూచన చేసింది.
గత ఏడాది (2024-25) చేపట్టిన పనులకు కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యంతో రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రూ.2,200 కోట్లకు చేరాయి.
ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్ గత మూడు నెలల్లో నాలుగుసార్లు దిల్లీ వెళ్లి పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు.
ఈ పరిణామాలతో కొత్త పనుల మంజూరుకు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం తొందరపడట్లేదు. బిల్లుల పెండింగ్ కారణంగా కొత్త పనులు చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువగా ఉంటారన్నది ఒక కారణమైతే..

వర్షాలు మొదలైనందున ఆదరాబాదరాగా చేసే పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించే అవకాశం ఉందన్నది మరో కారణం.
ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 25వేలకు పైగా కొత్త పనుల ప్రతిపాదనలను కలెక్టర్లు తాత్కాలికంగా పక్క పెట్టారు.
వర్షాకాలం ముగిశాకే కొత్త రోడ్ల పనులు
పూర్తయిన పనులను పోర్టల్లో అప్లోడ్ చేసిన 45 రోజుల్లో కేంద్రం బిల్లులు చెల్లించేది.
గత ఏడాది చేసిన మెటీరియల్ పనులకు అన్ని రాష్ట్రాలకూ అక్టోబరు నుంచి నిధులు నిలిపివేసింది.
గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో 2025-26 వార్షిక ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ నుంచే కొత్త పనులు మొదలవ్వాలి.
ఈ ఏడాది కూడా 4,000 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని రాష్ట్రప్రభుత్వం భావించింది.
పనులను తాత్కాలికంగా పక్కన పెట్టి కేంద్రం ఇచ్చే నిధుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.
మరో రెండు వారాల్లో అవి విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అయినా వర్షాకాలం ముగిశాకే పనులు మంజూరుచేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
తాత్కాలిక సర్దుబాటుకు సమస్యలు
ఉపాధిలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున తాత్కాలికంగా నిధుల సర్దుబాటుకు సాంకేతిక సమస్యలు అడొస్తున్నాయి.
ఉపాధి సిబ్బందికి రెండు నెలల జీతాల బకాయిల చెల్లింపులకు ఇటీవల రూ.60 కోట్లు సర్దుబాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
మెటీరియల్ పనులకు బిల్లుల విషయంలో వెనకడుగు వేస్తోంది.
ఉపాధి పనులకు మెటీరియల్ సరఫరా చేసే వెండర్లకు కేంద్రం నేరుగా బిల్లులు చెల్లిస్తోంది.
గతంలో పంచాయతీలకు చెల్లించేది. 2019-24 మధ్య వెండర్ విధానం తీసుకొచ్చింది.

మెటీరియల్ సరఫరాదారులను వెండర్ల కింద రిజిస్ట్రేషన్లు చేయించారు. వారికే కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా నిధులు సర్దుబాటు చేసినా ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం అసాధ్యమని అధికారులు అంటున్నారు.
ఉద్యోగుల జీతాలు, కార్యాలయాల నిర్వహణకు లేబర్ బడ్జెట్లో 4% నిధులు పరిపాలన ఖర్చులకు (అడ్మిన్ కాస్ట్) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తోంది.
దీనివల్ల సిబ్బంది జీతాలకు ప్రస్తుతం సర్దుబాటు చేసిన రూ.60 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేశాక తిరిగి వెనక్కి తీసుకునే వీలుంది.
మెటీరియల్ పనుల బిల్లులు నేరుగా వెండర్లకు చెల్లిస్తున్నందున, ప్రస్తుతం నిధులు సర్దుబాటు చేసినా తరువాత వెనక్కి రావడం కష్టమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.