లంచావతారులు…ఎపిసోడ్‌-1 లంచాధికారులు!

https://epaper.netidhatri.com/

`వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు.

`సమాజానికి పట్టి పీడిస్తున్న జలగలు.

`పట్టపగలు ప్రజలను దోచుకుంటున్న గజదొంగలు

`కాసు కనిపించనిదే కలం కదపరు.

`అవినీతి సొమ్ముమే ఆదాయమార్గాలు.

`ఒక్కసారి ఉద్యోగంలో చేరి ముప్పై ఏళ్లు పాపం పోగేసుకుంటారు.

`వాడిది కాని సొమ్ము మూటలుగట్టుకుంటారు.

`దొరికితే దొంగ ఏడుపులేడుస్తారు.

`పత్తిత్తులా మొహం దాచుకుంటారు.

`లంచం తప్పని తెలిసినా తీసుకుంటారు.

`పాపపు కూడు తింటూ మురిసిపోతుంటారు.

`ఉద్యోగి రూపంలో సాటి మనిషి రక్తం తాగుతుంటారు.

`మారలేరా! మనుషులుగా బతలేరా!!

`సామాన్యుడి వేధనలో రక్త పిశాచులురా మీరు!

హైదరబాద్‌,నేటిధాత్రి:

లంచాధికారులు.. లంచావతారాలు ఎత్తారు. ఉద్యోగం అన్నది చదువుకున్న వారి కల. చదువుకున్నంటున్నప్పుడు, ఆకలి వేధించినప్పుడు మంచిగా చదువుకొని, పెద్ద కొలువు సంపాదించుకోవాలని కలలు కంటారు. తాను పడిన కష్టం పగవాళ్లు కూడా పడకూడదనుకుంటారు. తనకు ఉద్యోగం వస్తే పది మందికి సాయం చేస్తానని చెప్పుకుంటారు. చదువు పూర్తయి ఉద్యోగానికి ఎంతో కష్టపడి ప్రిపేర్‌ అవుతారు. ఎంతో శ్రమించి ఉద్యోగం సంపాదించుకుంటారు. మరి కొందరు మరో మార్గంలో ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఎలాగైతేనేమీ మంచి ఉద్యోగి కావాలనుకున్న వారైనా, మంచి భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకున్నానని చెప్పిన వాళ్లైనా, ఉద్యోగాన్ని కొనుగోలు చేసి కుర్చీలో కూర్చున్న వారైనా మొదటి జీతం అందుకునే దాకా వున్న ఆశయాలు, ఆలోచనలు తర్వాత వుండదు. అయితే అందరూ అదే బాపతు అని చెప్పడం లేదు. కాకపోతే ఒకరిని చూసి ఒకరు అన్నట్లు ఆ ఉద్యోగ వ్యవస్ధలో అవినీతిని కూడా హక్కుగా మార్చుకొని నిత్యం అవినీతి రూపాయి జేజులో పడనిదే ఇంటికి వెళ్లని ఉద్యోగులు ఎంతో మంది వున్నారు. అందులో కింది స్దాయి నుంచి పై స్దాయిదాకా , ఆ స్ధానాన్ని బట్టి జేబులు నింపుకుంటారు. వీళ్లంతా మన వ్యవస్ధకు పట్టిన అవినీతి చెదలు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న జలగలు. అసలు ప్రజలకు పని చేసి పెట్టడం అన్నది ఉద్యోగి కర్తవ్యం. ఉద్యోగుల నుంచి పనులు చేయించుకోవడం సమాజం హక్కు. కాని ఇక్కడ అవినీతి చేయడం అదికారుల హక్కుగా మారిపోయింది. పని చేయించుకోవడానికి తప్పనిసరిగా సొమ్ము జనం ముట్టజెపాల్సివస్తోంది. ఇదే పెద్ద విచిత్రం.
గత పదేళ్లలో తెలంగాణలో అవినీతి విపరీతంగా పెరిగింది.

తెలంగాణ ఉద్యమం కోసంపనిచేశారని, ఉద్యమానికి ఆయువు పట్టుగా మారారాని ఆనాడు కేసిఆర్‌ పెద్దఎత్తున ఉద్యోగులకు జీతాలు పెంచారు. ఆ సమయంలో ఒక మాట కూడా చెప్పారు. దేశంలో ఎక్కడా లేనంత జీతాలు తెలంగాణ ఇస్తాం. కాని అదికారులు అవినీతి చేయొద్దు. నిజాయితీగాపనిచేయాలని సూచించారు. ఒక రకంగా హెచ్చరించారు. అధికారులు మాత్రం కేసిఆర్‌ మాటలు ఆ క్షణమే పెడ చెవిన పెట్టేశారు. వద్దన్న పనినే చేసి చూపించారు. ఎక్కడిక్కడ అందినంత దోచుకున్నారు. అమాయ ప్రజలను కాల్చుకుతిన్నారు. వ్యాపారుల నెత్తి కొట్టారు. ఆ వ్యాపారులు దానిని మళ్లీ జనం మీద తీసుకున్నారు. పెద్దఎత్తున జీతాలు పెంచినా అధికారుల తీరు మారలేదు. సరికదా అంతకు ముందు చేసిన దానికన్నా ఎన్నో రెట్లు అవినీతి చేయడం అలవాటు చేసుకున్నారు. అది ఈ శాఖ, ఆ శాఖ అన్న తేడా లేదు. అన్ని శాఖలు భరితెగించాయి. ఒకప్పుడు ఎక్కడో ఒక అదికారి అవినీతి చేశాడని వార్త వస్తే అందరూ ముక్కున వేలేసుకునేవారు. కాని ఇప్పుడు అధికారుల అవినీతి అన్నది ఒక బ్రాండ్‌గా మారింది. పట్టుబడిన అధికారుల ఇళ్లలో వందల ఎకరాల స్ధలాల డాక్యుమెంటు. కోట్లాది రూపాయల కట్టలు. అనేక బ్యాంకుల్లో లాకర్లు. కిలలో కొద్ది బంగారం. అత్యంత ఖరీదైన గిఫ్ట్‌లు. లక్షలాది రూపాయాల విలువ చేసే కార్లు. విదేశాలలో పిల్లల చదువులు. అసలు అదేలా సాధ్యం.
ఈ పదేళ్ల కాలంలో పట్టుబడ్డ అధికారులలో ఎవరూ సామాన్యులు కాదు.
వందల ఎకరాల స్ధలాలను గోల్‌ మాల్‌ చేయడం, ఎకరాల కొద్ది స్ధలాలు కొనుగోలు చేయడం చూస్తుంటే అవినీతి ఏ స్ధాయికి చేరుకున్నదో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా హెచ్‌ఎండియేలో రెరాగా పనిచేసిన అధికారి బాలకృష్ణ పోగేసిన ఆస్ధులు లెక్క తేలడం లేదట. అంటే ఏ రేంజ్‌లో సంపాదించారో అర్ధం చేసుకోవచ్చు. నెల జీతం మీద ఆధారపడి జీవితాలు గడపాల్సిన అధికారులు ఇలా కోట్లు కూడబెట్టుకునేందుకు కారకులెవరు? ప్రభుత్వాలు కాదా? వారి ఉదాసీనత కాదా? వారి చేత పనులు చేయించుకునే నాయకులు కాదా? గతంలో ఎమ్మార్వో స్దాయి అధికారికి స్కూటర్‌ వుంటే ఎక్కువ. కాని ఇప్పుడు జూనియర్‌ అసిస్టెంట్లకు కూడా కార్లు వుంటున్నాయి. వారి జీతాలు కూడా అంతే గొప్పగా వున్నాయి. అయినా వారికి ఆ సంపాదన చాలడం లేదు. సగటు వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టాలంటే జంకుతున్నాడు. భయపడిపోతున్నాడు. అధికారులు చిన్న పనికి ఎంత అడుగుతారో అన గుండెను అదిమిపట్టుకొని వెళ్తున్నారు. అయినా పని అవుతుందన్న నమ్మకం లేదు. తమకు న్యాయంగా చేసి పెట్టాల్సిన పనిని మరొకరికి చేసి పెడుతున్న దుర్మార్గపు పనులు కూడా చేస్తున్నారు.

అక్రమ సంపాదనకు ఎగబడ్డారు. చిన్న చిన్న పనులకు కూడా సామాన్యులు కాళ్లరిగేలా తిరిగినా సరే అనుకున్నంత ముట్ట జెప్పాల్సిందే..
వైద్యం నుంచి మొదలు జాలి అన్న పదం అధికారులు ఏనాడో మర్చిపోయారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచే జీతాలు తీసుకుంటున్నామన్న సంగతి ఎప్పుడో మర్చిపోయారు. పని మీద ఎవరు వచ్చినా ఒట్టి చేతులతో రావొద్దు. నీతి, నిజాయితీ అని మాట్లాడొద్దు. ఒక వేళ ప్రశ్నిస్తే ప్రభుత్వాధికారి మీద దౌర్జన్యం అంటూ పోలీసు కేసులు నమోదు చేయిస్తున్నారు. రైతులను కూడా కాళ్లతో తన్ని, ఆ రైతులపైనే కేసులు పెట్టిన సందర్భాలు మనతెలంగాణలో కోకోల్లలు. ఇలా పట్టపగలు ప్రజలను దోచుకుంటున్న గజదొంగలుగా మారిపోయారు. ఎక్కడిక్కడ అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రతి పనికి రేటు ఫిక్స్‌ చేసి మరీ వసూలు చేస్తున్నారు. కాసు కనిపించనిదే కలం కదపరు. అవినీతి సొమ్మే వారికి ఆదాయ మార్గాలు. ఒక్కసారి ఉద్యోగంలో చేరి ముప్పై ఏళ్ల పాపం పోగేసుకుంటున్నారు. వారిది కాని సొమ్మును మూటలు గట్టుకుంటున్నారు. దొరికితే దొంగేడుపులు ఏడుస్తారు. ముఖాలు చాటేసుకుంటారు. అరచేతులు అడ్డం పెట్టుకొని దాచుకుంటారు. లంచం తప్పని, నేరమని, నైతికత కాదని తెలిసినా తీసుకుంటారు. హక్కులాగా లాక్కుంటారు.
పాపుపు కూడా తింటూ మురిసిపోతుంటారు.
ఉద్యోగి రూపంలో సాటి మనిషి రక్తం తాగుతుంటారు. మారలేరా? అని సమాజం ప్రశ్నించినా మారరు. సామాన్యుడి వేధనలో రక్త పిశాచులు వాళ్లు…అని ప్రజలు ఎంత తిట్టుకుంటున్నా వారికి ఆ మాటలు వినపడవు. ఇక ఉద్యోగులు ముదిరితే రాజకీయ నాయకులు అన్నట్లు పదేళ్లు ఆదాయ మార్గం వున్న ఆఫీసులు పనిచేస్తే చాలు, ఆ సొమ్మును కాపాడుకునేందుకు ప్రజాసేవ అనే ముసుగువేసుకుంటున్నారు. రాజకీయ నాయకుల అవతారాలెత్తుతున్నారు. అసలు రాజకీయాలు చేయాలంటే నాయకుల భయపడుతున్న కాలంలో అధికారులుగా పనిచేసిన వాళ్లు టిక్కెట్లకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలకే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేస్తామంటున్నారు. ఎంతో కష్టపడి పైకి వచ్చామంటారు. పేదరికం చూసి, తోటి సమాజంలో పేదరికం రూపు మాపాలని రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతుంటారు. అలా వచ్చి నాయకులైన ఈ పదేళ్లలో వున్నారు. వాళ్లను చూసి మేమే తక్కువ అని వచ్చిన వాళ్లు చాలా మందే వున్నారు. ఎమ్మెల్యేలైన వారు కూడా మన కళ్లముందే వున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు వున్నారు. కాని వాళ్లకు అంత సంపాదన ఎలా వచ్చిందన్నది మాత్రం ఎవరికీ అవసరం లేదు. గెలుపు గుర్రాల రేసులో వున్నారా? పార్టీకి ఇవ్వాల్సినంత ఇస్తున్నాడా? ఎన్నికల్లో పెట్టుకోవాల్సినంత ఖర్చు పెట్టగలడా? వీటిపై క్లారిటీ వుంటే చాలు…నాయకులు కావొచ్చు. ఇదీ మన ఉద్యోగ భారతం..జనానికి పట్టిన గ్రహణం. అందుకే ప్రజల జీవితాలు ఎప్పుడూ చీకట్లోనే..అధికారులు జీవితాలు వెలుగులోకే…వాళ్లే నాయకులుగా మారితే జనానికి మరిన్ని చీకట్లే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *