పల్లె మళ్ళీ కన్నీరు పెడుతోంది.

https://epaper.netidhatri.com/

నీటి కోసం గోస పడుతోంది.

పైరు గొంతెండుతోంది.

చేతికి రావాల్సిన పంట చుక్క కోసం కలవరిస్తోంది.

అడుగంటుతున్న జలాలతో బోరు బోరుమంటోంది.

బావుల భవితవ్యం మొదటికొచ్చింది.

పెట్టుబడి …ఆరు గాలం శ్రమ వృధా కానుంది.

రైతు బతుకు ఆగం కానుంది.

అప్పుల బాధ మొదటికొచ్చింది.

పల్లెకు వలస ముప్పు ముందు ముందు రానుంది.

కేసీఆర్‌ కోసం తెలంగాణ కలవరిస్తోంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
పల్లె మళ్లీ కన్నీరు పెడుతోంది. గోసపడుతోంది. మళ్లీ పల్లె రూపు మారుతోంది. పల్లెల్లో నిన్నటి దాకా కాలు మీద కాలేసుకొని కూర్చన్న రైతన్న ఎందుకు దిగాలు పడుతున్నాడు. దిగులతో ఎందుకు దిజగారి పోతున్నాడు. మళ్లీ ఊరు వదిలి పోయే పరిస్ధితులు ఎందుకు వస్తున్నాయి? ఇలా మారుతుందిన ఎవరూ ఊహించలేదు. తెలంగాణలో ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మందాకా ఎక్కడా ఒక్క గుంట కూడా ఎండిపోకుండా, పండిన పంటలు మూడు నెలల్లోనే ఎందుకు ఎండిపోతున్నాయి. నిన్నటిదాకా పారిన నీళ్లు ఎందుకు ఆగిపోయాయి? పదేళ్లలో ఏనాడు పడిపోని భూగర్భ జనలాలు మూడు నెలల్లోనే ఎందుకు అందకుండా పోతున్నాయి. పల్లె పదేళ్ల తర్వాత మళ్లీ విలవిలలాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పడరాని పాట్లు పడి, తెగించి తెలంగాణ తెచ్చుకున్నది మళ్లీ ఎండబెట్టుకోవడానికేనా? అన్న ప్రశ్న ప్రతి మదిలో ఉత్పన్నమౌతోంది. పైరు గొంతెండిపోతోంది. చుక్క నీటి కోసం పొలం విలవిలాడుతోంది. దాన్ని చూసి చూసి రైతు గుండె తరుక్కుపోతోంది. బోరు వేసినా నీళ్లు రావడం లేదు. నిజంగా కాళేశ్వరం పూర్తిగా పనికి రాకుండాపోయిందా? మరమ్మత్తులకు కూడా నోచుకోలేనంత పాడైపోయిందా? గత పాలకులు తప్పు చేశారా? లేదా? అన్నది తర్వాత సంగతి. ముందు దానిని బాగు చేయమని బి ఆర్‌ఎస్‌ కూడా చెబుతోంది. రైతులను ఇబ్బంది పెట్టొద్దని కేసిఆర్‌ కూడా చెబుతున్నాడు. మా మీద ఏదైనా కోపం చూసుకోండి. కాని రైతులను గోస పెట్టకండని కేటిఆర్‌ కూడా అంటున్నారు. అయినా ఎందుకు సాగుదీస్తున్నారో…నీళ్లు లేని తెలంగాణగా ఎందుకు మార్చుతున్నారో అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లకోసం…నిధులు,నియామకాలు తర్వాత అంశాలు. ముందు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తేనే బతుకు. ఆ తర్వాతే జీవితం. పదుల సంఖ్యల బోర్లు వేసి అప్పుల పాలైన రైతులు కూడా గత పదేళ్లలో పండుగ చేసుకున్నారు. వ్యవసాయం దండగ అన్న వాళ్ల కళ్లముందు కేసిఆర్‌ పండుగ చేశారు. ఎంత కంప్యూటర్‌ ముందు పెట్టుకున్నా, అన్నమే తినాలి. అన్నం తింటేనే కంప్యూటర్‌ పనైనా చేసేది. ఆ మాత్రం కనీస జ్ఞానం లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు లాంటి వారు కంప్యూటర్‌ నేర్చుకుంటే కడుపు నిండుతుందన్నారు. తర్వాత ఆయన కూడా రైతు లేనిదే ప్రపంచం లేదని ఒప్పుకున్నాడు. ఎంత పెద్ద దేశమైనా, ఎంత సంపన్నమైనదైనా సరే ఆహారం మీద ఆధారపడాల్సిందే. ఆహార భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కాని ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది. ఒక్క పంట నష్టపోతే రైతులు ఎంత అప్పుల్లో కూరుకుపోతారో? పాలకులకు అర్దం కావాలి.
రాజకీయం చేసేవారికి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా పైర్లు ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడి అప్పుడే మొదలైంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు బతికింది లేదు. బాగు పడ్డలేదు. తెలంగాణ వారికి అన్నమంటే ఏమిటో తెలియని కాలంలోనే రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి తినడం నేర్పింది తెలుగుదేశం పార్టీయే అని చంద్రబాబు అన్నాడు. ఆ మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. కాని నాయకులు మర్చిపోయారు. తెలంగాణ ఎందుకు పనికి రాదని, తొండలు కూడా గడ్లు పెట్టవని ఎగతాలి చేశారు. అలాంటి భూములు ఎలా పచ్చని మాగాణాలైనయ్యాయి. ఎలా పాల పొంగులు నింపుకొని తెలంగాణ పల్లెల్లో గోదారి నీళ్లు పరవళ్లు తొక్కాయి. ఇది ఎప్పటి చరిత్రో కాదు. సరిగ్గా మూడు నెలల క్రితం వరకు ప్రజల కళ్లముందున్న చరిత్ర. మూడు నెలల్లోనే తెలంగాణ ఎందుకు ఎండిపోతోంది. గతం కన్నా గడ్డు పరిస్ధితులు ఎందుకొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా, దీన పరిస్ధితులు ఎందుకు వస్తున్నాయి. కాళేశ్వరం మూడేళ్ల క్రితమే పనికి రాకుండాపోతే ఈ మూడేళ్లుగా కేసిఆర్‌ నీళ్లెలా ఇచ్చాడు. కాళేశ్వరం కట్టకముందే తెలంగాణలో చెరువులు ఎలా నింపాడు. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా కొత్తగా సాగు కాలేదన్నప్పుడు, ఇప్పుడు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి. రైతులు ఎందుక కన్నీరు పెడుతున్నారు. చేతికి అందాల్సిన పంట ఎండిపోతుంటే ఎందుకు పశువులు మేస్తున్నాయి. రైతులు తిన్నదరక్క పంటలు పాడు చేసుకుంటున్నారా?
తెలంగాణ వచ్చిన రోజు నుంచి రైతుకు నీళ్లెలా అందించాలన్నదానిపై కేసిఆర్‌ దృష్టిపెట్టకపోతే ఈ రోజు తెలంగాణలో రైతు ఎందుకు పచ్చగా వున్నాడు.
మూడు నెలల్లోనే ఎందుకు సతమతమౌతున్నాడు. కేసిఆర్‌ అధికారంలోకి వచ్చిన నాడు కనీసం చెరువులు కూడా సక్కగ లేదు. చెరువుల్లో చుక్క లేదు. ఇప్పుడు కనీసం చెరువుల్లో నీటి పదునైనా వుంది. ఆనాడు చెరువులు ఎండిపోయి, తుమ్మలు మొలిచి, హద్దులుచెరిగిపోయి వున్నాయి. వాటిని మళ్లీ పునరుద్దరించడం అంటే మాటలు కాదు. అయినా ఒక యజ్ఞంలా మిషన్‌ కాకతీయ పనులు చేపట్టి, చెరువులను బాగు చేశారు. వాటికి పూర్వ వైభవం తెచ్చారు. కొత్త సొగసులు అద్దారు. కొత్త కట్టలు వేశారు. కట్టలపై తాడి చెట్లు పెట్టారు. పల్లెకు సింగారం అద్దారు. ఎండిపోయిన చెరువులకు మళ్లీ జీవం పోశారు. జలాలతో నింపారు. మూడేళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించి, తెలంగాణలో వున్న 46 వేల చెరువులను బాగు చేశారు. పూడికల తీశారు. రైతులు ఆ మట్టిని స్వచ్చందంగా పొలలాకు తరలించుకుపోయారు. చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. మండుటెండల్లో చెరువులు నిండుతుంటే ప్రజలు కళ్ల నిండా సంతోషం నింపుకొని చూశారు. ఆనందబాష్పాలు రాల్చారు. రాత్రుళ్లు కూడా సెల్‌ ఫోన్‌ లైట్లతో చెరువులకు తరలుతున్న జలాలను చూసి మురిపోయారు. మత్తళ్లు దుంకుంతుంటు స్నానాలు చేశారు. చెరువుల్లో ఈతలు కొట్టారు. తెలంగాణ అంతా పులకరించిపోయింది. తెలంగాణ ఆనంద తాండవమాడిరది. జలాల పరవళ్లు చూసి ప్రతి మది నాట్యమాడిరది. అప్పటితో మొదలైన రైతు సంతోషం పదేళ్లలో ఏనాడు కంట చుక్క కన్నీరు చూడలేదు. పెట్టుబడి కోసం బాధ పడలేదు. దిగుబడి రాలేదని దిగులు పడలేదు. అమ్ముకున్న పంట దళారులు తిన్నారన్న ఆరోపణ లేదు. అలా రైతులు పదేళ్ల పాటు సుఖశాంతులతో బతికారు. ఒకనాడు రైతు ఇంట సైకిలు కూడా వుండని రోజులనుంచి, పదేళ్లలో పల్లెల్లో సగటు రైతు ఇంట కారు వుంది. పదేళ్లలో పాత ఇండ్ల స్ధానంలో కొత్త ఇల్లు కట్టుకున్న పరిస్ధితులున్నాయి. ఒకప్పుడు పది ఊళ్లకో ట్రాక్టర్‌వుండేది. ఇప్పుడు ప్రతి ఇంటికో ట్రాక్టర్‌ వుంది. ఒకప్పుడు వరికోత మిషన్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదరుచూసేవారు. కాని ప్రతి ఊరిలో కూడా ఆ మిషన్లు వచ్చాయి. ఇప్పుడు వాటికి పనిలేకుండాపోతోంది. ఏ పల్లెలోనూ ఇప్పుడు వరికోత మిషన్‌ లేదు. ఏం మాయ జరిగింది. ఏం ఉపద్రవం వచ్చింది. తెలంగాణ ఎందుకు ఏడుస్తోంది.
గూడు చెదిరిపోయి, గుండె చెదిరిపోయిన తెలంగాణ మళ్లీ కావాలా?
గుక్కెడు మంచినీళ్లకోసం విలవిలలాడే తెలంగాణ మళ్లీ చూద్దామా? ఇంకా ఎండా కాలం సరిగ్గా రానేలేదు. గొంతు ఎండిపోతోంది. పంట ఎండిపోయింది. ఇది సగటు రైతు ఆవేదన. ఆక్రందన. రైతు ఆక్రోశపడేదాకా ఏ పాలకులు తెచ్చుకోవద్దు. రైతు కన్నెర్ర ఎవరూ తట్టుకోలేరు. కేసిఆర్‌ ఎరువులు ఇస్తా అని ఇవ్వలేదని నిత్యం ప్రశ్నించిన వాళ్లు, ఇప్పుడు నీళ్లెందుకు రావడం లేదని ఎందుకు అడడంలేదు? ఇదంతా రైతు గమనిస్తున్నాడు. శాపాలు పెట్టేదాకా తెచ్చుకుంటున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు రాకముందే తెలంగాణ చెరువులు నించిన చరిత్ర వుంది. మరి ఆ పని ఎందుకు చేయడం లేదు. రైతులకు ఇబ్బందులు ఎందుకు తొలగించడం లేదు. రైతులకు కరువు పనులు దిక్కయ్యేలా వున్నాయి. అంతే కాదు రైతులకు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు. ఈ పంటలే ఎండిపోతున్నాయి. మళ్లీ రైతులు పంటలు వేసుకోవడానికి జూన్‌ వరకు ఆగాల్సిందేనా…తొలకరి కురిసేదాకా సాగును ఆపుకోవాల్సిందేనా… చెరువుల్లో నీళ్లుంటే, రైతులకు నీళ్లందితే, బోర్లు ఎండిపోకుండా చూసుకుంటే ఈ తిప్పలు వచ్చేది కాదు. అందుకే రైతులు మూడు నెలల్లోనే కేసిఆర్‌ గురించి కలవరిస్తున్నారు. కేసిఆర్‌ ఎప్పుడొస్తాడా? అని ఎదరుచూస్తున్నారు. కాలమహిమ…కేసిఆర్‌కు రైతు మీద ప్రేమ. రైతుకు కేసిఆర్‌ అంటే ప్రేమ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!