డ్యూటీ చేస్తున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ
బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసులపై “అనవసర విమర్శలు”?
చట్ట పరిరక్షకులైన పోలీసుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి.
భద్రత కోసం కష్టపడుతున్న పోలీసుల గౌరవాన్ని కాపాడటం కూడా ప్రజాప్రతినిధుల బాధ్యతే
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ పరిసరాల్లో ఉదయం నుండి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న పోలీసు సిబ్బందిపై కొంతమంది ప్రజా ప్రతినిధులు చేసిన విమర్శలు విమర్శనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మున్సిపల్ కౌన్సిల్ సభా కార్యక్రమాలు జరిగిన ప్రదేశంలో క్రమశిక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజాప్రతినిధుల రక్షణ కోసం పోలీసులు చేపట్టిన సాధారణ చర్యలను తప్పుబట్టడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని స్థానికులు అన్నారు.
పోలీసుల విధి నిర్వహణలో ఎటువంటి అధికారం దుర్వినియోగం జరగలేదని, భద్రతా ప్రమాణాల ప్రకారం అనుసరించిన ప్రతి చర్య కూడా చట్టబద్ధమైందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అయితే, ఎమ్మెల్సీ సారయ్య పోలీసులు తనపై ప్రవర్తించిన తీరు అనుచితమని ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.
మట్టేవాడ సీఐ కర్ణాకర్ రావుపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేసిన విధానం కూడా విమర్శనీయమని, అందరి ముందే అధికారులను బెదిరించే తీరు అప్రజాస్వామికమని పలువురు నిపుణులు అంటున్నారు.
నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా ఇంత భద్రత లేదని ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్య వాస్తవానికి దూరమైందని.., ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల రక్షణ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పోలీసులు తీసుకున్న చర్యలను తప్పుగా చూపడం సరైన పద్ధతి కాదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
పోలీసులపై నిందలు వేయడానికి ముందుగా ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తించుకోవాలని, చట్ట పరిరక్షకులైన పోలీసుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉదయం నుంచే బందోబస్తులో నిలబడే పోలీసుల విధుల్లో జోక్యం చేసుకుంటూ, వారి గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు నాయకుల నుంచి రావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కౌన్సిల్ హాల్ కు వెళ్ళే దారిలో జరిగిన ఒక చిన్న గందరగోళ సమయంలో పోలీసులపై చేసిన తీవ్రమైన విమర్శలు, ముఖ్యంగా ఒక “సీఐ” ని అందరి ముందూ మందలించడం సరైన పద్ధతి కాదని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డ్యూటీ చేసే కానిస్టేబుల్లు, పోలీసు అధికారులపై అంత ఆగ్రహం ఎందుకో? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే సారయ్య, వరంగల్ తూర్పులో గ్రూపు రాజకీయాలు చేసే మీరు పోలీసులపై ఆగ్రహం చేయడం సమంజసమా? అంటూ సొంత పార్టీ కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ప్రజాప్రతినిధులే చట్టసంరక్షకుల గౌరవాన్ని కాపాడాల్సిన సమయంలో, ఆగ్రహావేశంతో మాట్లాడటం పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని అధికారులు భావిస్తున్నారు.
పోలీసులు గంటల తరబడి బందోబస్తులో నిలిచి ప్రజలకు, ప్రత్యేకంగా ప్రజా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. అలాంటి సమయంలో వారి పనితీరును నక్సలైట్ల కాలంతో పోల్చడం, అనవసర ఆరోపణలు చేయడం రాజకీయ నాయకుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
భద్రతా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను, అందరి ముందూ అవమానించడం ప్రజాస్వామ్య పద్ధతులకు, ప్రజాప్రతినిధుల మర్యాదకు విరుద్ధమని పలువురు సూచిస్తున్నారు.
నాయకుల ఆగ్రహం పేరుతో పోలీసుల పనితీరును నీరుగార్చే వ్యాఖ్యలు కాకుండా, సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు చెబుతున్నాయి.
మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరుగుతున్న సమావేశ భద్రత కోసం కష్టపడుతున్న పోలీసుల గౌరవాన్ని కాపాడటం కూడా ప్రజా ప్రతినిధుల బాధ్యతే అని ప్రజలు గుర్తుచేస్తున్నారు
