22 Students Get Jobs at Narsampet Job Mela
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా – 22 మందికి ఉద్యోగాలు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. బైరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ప్లేస్మెంట్ సెల్ అధికారి ఎం.ఎం.కె. రహీముద్దీన్ ఆధ్వర్యంలో టీ. సందీప్ మరియు కరుణాకర్ బృందం ప్లేస్మెంట్ డ్రైవ్ను సమర్థవంతంగా నిర్వహించారు.ఈ జాబ్ మేళాలో సుమారు 56 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, ఇంటర్వ్యూలు, నైపుణ్య పరీక్షలు మరియు ఎంపిక ప్రక్రియల అనంతరం 22 మంది విద్యార్థులు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. బైరి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్లేస్మెంట్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జీ కే హ్యూమన్ రిసోర్స్ సంస్థ ప్రతినిధి టి. సందీప్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని అకాడ్ పవర్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్సికాన్ వంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ ఎం.ఎం.కె. రహీముద్దీన్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, భవిష్యత్తులో మరిన్ని ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్ సెషన్లు, జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్. కమలాకర్, డాక్టర్ ఎం. సోమయ్య, డాక్టర్ ఎం. రాంబాబు తోపాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
