తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50 శాతంకు పైగా ఉన్న బీసీల పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏమిటని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో గులాబీ దళపతి..మాజీ సీఎం కేసీఆర్ తన సుదీర్ఘ ప్రసంగంలో బీసీల ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో..రాష్ట్రంలో బీసీ వాదం రోజురోజుకు పెరిగిపోతుంటే..బీసీల్లో వచ్చిన చైతన్యం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ..చట్టం చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో ప్రతి అంశంపై మాట్లాడిన కేసీఆర్..బీసీల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని..బీసీలు అంటే కేసీఆర్ కు అంతా అలుసా అని మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ప్రశ్నించిన కేసీఆర్..బీసీల హక్కులు, డిమాండ్లపై ఎందుకు నిలదీయలేదన్నారు. బీసీ బిల్లు అమలుపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించి..బీసీ బిల్లు అమలు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేస్తే బీసీలు హర్షించే వారని తెలిపారు. బీసీ బిల్లును గవర్నర్ వద్దకు పంపకుండా..కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. బీసీల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగేదన్నారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కేసీఆర్ ఇవ్వాల్సిందన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు..బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు..మొదట జీవోలు జారీచేసి ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తెలంగాణలో బీసీ బిల్లు అమలు కాకుండా ఉండేందుకు కొందరు కోర్టుకు వెళితే..సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే..అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి సవరణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచిస్తే..బీసీలు..బీఆర్ఎస్ ను ఆదరించేవారన్నారు. బీసీల ప్రస్తావన లేకపోవడంతో..బీసీలు..కేసీఆర్, బీఆర్ఎస్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version