కేరళలో కమల వికాసానికి బీడీజేఎస్‌ అడ్డంకి?

`బీజేపీ సొంత ప్రయత్నాలు చేసుకుంటేనే మేలు

`బీడీజేఎస్‌తో పొత్తు వల్ల ప్రయోజనం శూన్యం

`కమ్యూనిస్టులను ఎదుర్కోవాలంటే వ్యూహం మార్చక తప్పదు

`వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే చెమటోడ్చక తప్పదు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పరశురాముడు నడయాడిన నేల కేరళ. దేవభూమిగా చెప్పుకునే ఈ రాష్ట్రంలో సనాతనధర్మం, హిందూత్వ సిద్ధాంతంతో భాజపా ఎందుకని చొచ్చుకొని లేకపోతున్నదని ప్రశ్నిస్తే అనేక కారణాలు చెప్పవచ్చు. ముఖ్యంగా వామపక్ష భావజాలం ప్రజల్లో బలీయంగా నాటుకొనివుండటం ఒకవైపు కాగా మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ కూటమి కూడా బలమైన పునాదులు కలిగివుండటమన్నది సాధారణంగా చెప్పే కారణం. మరో విషయమేంటంటే రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింల జనాభా అధికంగా వుండటం, వీరిలో క్రైస్తవులు కాంగ్రెస్‌కు, ముస్లింలు వామపక్ష కూటమికి గట్టి మద్దతుదార్లుగా వుండటంతో బీజేపీ రాష్ట్రంలో వేళ్లూనుకోలేకపోతున్నదనేది సాధారణవిశ్లేషణ. వీటితోపాటు పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా విస్తరణను అడ్డుకుంటున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఇదిలావుండగా రాబోయే ఏడాదికాలం లోగా బీజేపీ కేరళలో ఎన్నికల పరంగా రెండు పరీక్షలను ఎదుర్కోబోతున్నది. మొదటిది వచ్చే డిసెంబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు కాగా, వచ్చే ఏడాది ఎండాకాలంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లో గట్టి ప్రభావశీలక పనితీరు ప్రదర్శించకపోతే, రానున్న కాలంలో పార్టీ విస్తరణఅవకాశాలు దెబ్బతినే ప్రమాదం వుంది. ప్రస్తుతం బీజేపీకి కేరళలో భారత ధర్మ జనసేన(బీడీజేఎస్‌) భాగస్వామిగా కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో (2024) ఈ రెండు పార్టీలు కలిపి రాష్ట్రంలో 19శాతం ఓట్లు సాధించాయి. ఇదే ఎన్నికల్లో త్రిస్సూర్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గె లుచు కుంది కూడా. రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో ఈ రెండు పార్టీలు గత ఎన్నికలకంటే కొంత మెరుగైన పరితీరు ప్రదర్శించిన మాట వాస్తవం. ఇదే సమయంలో అట్టింగళ్‌, అలప్పుజా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ మూడోస్థానంలో వుండటం గమనార్హం. ఇందుకు మురళీధరన్‌, బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ శోభా సురేంద్రన్‌ల ప్రచార సరళే కారణ మని చెప్పక తప్పదు. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 19 కాంగ్రెస్‌ కూటమివిజయం సాధించగా, కమ్యూనిస్టుల కూటమి కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల కృషి కారణంగా ఆరు సెగ్మెంట్లలో పార్టీకి 40శాతం ఓట్లు పోలవడం గమనార్హం. ఇక నిమమ్‌ సెగ్మెంట్‌లో ఏకంగా 45శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. మ రో 17 సెగ్మెంట్లలో 30శాతం వరకు ఓట్లు సంపాదించుకోగలిగింది. కాంగ్రెస్‌ వృద్ధనేత రమేష్‌ చెన్నితలకు కంచుకోటగా పరిగణించే హరిపాడ్‌ సెగ్మెంట్‌లో బీజేపీ సహచరి బీడీజేఎస్‌ వెయ్యి ఓట్ల లీడ్‌ సాధించింది. అయితే ఈస్థానాన్ని గతంలో బీజేపీ గెలుచుకుందన్న విషయం మరువరా దు. మరో 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 25శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా పోలవడం, లెఫ్ట్‌ రమరియు కాంగ్రెస్‌ కూటములను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సీట్లు గెలుచుకోకపోయినా క్రమం గా రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదనడానికి ఇవి సంకేతం. గతంతో పోలిస్తే పార్టీ కొంత సానుకూల స్థితికి చేరుకునేదిశగా అడుగులు పడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. సరిగ్గా ఇదేసమ యంలో నూతన బీజేపీ సారథిగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ను రాష్ట్ర రథసారథిగా పార్టీ నియమించడంగమనార్హం. ఇదిలావుండగా పార్టీకి మద్దతుగా వున్న బీడీజెఎస్‌ పనితీరు నిరాశాజనకంగా వుండటాన్ని ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం. 

గత లోక్‌సభ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీడీజేఎస్‌ ఓట్లశాతం సింగిల్‌ డిజిట్‌ను మించకపోవడం నిరాశను కలిగిస్తోంది. అదీకాకుండా ఆయా సెగ్మెంట్లలో పోలైన ఓట్లశాతం బీజేపీకిస్థానికంగా వున్న బలం వల్ల వచ్చినవేనని కూడా విశ్లేషణలో తేలింది. ఉదాహరణకు కయాంకు లం అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీడీజేఎస్‌ అభ్యర్థికి 33శాతం ఓట్లు పోలయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పోలయిన ఓట్లు 26శాతం! అంటే ఇక్కడ బీడీజేఎస్‌ అభ్యర్థికి ఈమాత్రం ఓట్లు పోలయ్యాయంటే అందుకు బీజేపీకి స్థానికంగా వున్న బలమే కారణమన్నది స్పష్టమైంది. నిజానికి బీడీజేఎస్‌ 2015లో ఏర్పాటైంది. శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) కు రాజకీయ విభాగంగా, ఎజవా ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)ను కూడగట్టే లక్ష్యంతో వెల్లప్పల్లి నటేషన్‌ నాయకత్వంలో ఇది ఆవిర్భవించింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా వున్న ఎజవావర్గం ప్రజల ఓట్లను ఆకర్షించడం దీని ఏర్పాటు లక్ష్యం. ఇదే సమయంలో ఎజవా వర్గాల్లో క మ్యూనిస్టు కార్యకర్తల హింసాత్మక దాడులనుంచి రక్షణగా వుంటుందన్న లక్ష్యంతో కూడా ఈ బీడీజేఎస్‌తో భాజపా జతకట్టింది. లక్ష్యం ఏదైనా ఓట్ల విషయానికి వచ్చేసరికి ఎజవా వర్గంవారు కమ్యూనిస్టులకే సానుకూలంగా వ్యవహరించడంతో బీడీజేఎస్‌ నుంచి ఆశించిన ప్రయోజనాన్ని బీజేపీ పొందలేకపోయింది. ఎన్నికల్లో ఎజవా వర్గం ఓట్లు ఎన్నికల్లో అత్యంత కీలకం. ఈ వర్గా ల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి బీడీజేఎస్‌తో కలిసి పనిచేయడం బీజేపీకి కలిసిరాలేదు. అదీకా కుండా ఎజవా వర్గ ప్రజల్లోకి తనకై తాను చొచ్చుకొని వెళ్లాలంటే బీడీజేఎస్‌ పెద్ద అడ్డంకిగా మారింది. అట్లాగని కమ్యూనిస్టు కార్యకర్తల దాడులు ఆగాయా అంటే అదీలేదు. ఈ నేపథ్యంలో బీడీజేఎస్‌ భాజపా ఎదుగుదలకు ఒక గుదిబండలా మారుతోందనేది క్రమంగా వెల్లడవుతున్న సత్యం. అదీకాకుండా ఈ వర్గాల్లో ఎస్‌ఎన్‌డీపీ, కమ్యూనిస్టు కార్యకర్తల మధ్య తరచుగా జరిగే సంఘర్ష ణలు బీజేపీ విస్తరణకు ప్రధాన అవరోధంగా మారాయి. ఈ సంఘర్షణలు ఎంతమాత్రం వాంఛనీయం కావనేదీ బీజేపీ నాయకత్వ ఉద్దేశమైనా, స్థానిక రాజకీయ పరిస్థితులు, మార్క్సిస్టుల దా డులు, స్వీయరక్షణకోసం ప్రతిఘటించక తప్పని పరిస్థితులున్నాయి. ప్రస్తుతం మార్క్సిస్టు కార్యకర్తల దాడులనుంచి రక్షణకోసం బీడీజేఎస్‌పై ఆధారపడుతున్నప్పటికీ, భాజపా తనకు తాను ఎజవా వర్గ ప్రజల్లో పలుకుబడిని పెంచుకోవాలంటే మరో తోవను ఎంచుకోక తప్పదు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్‌లో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, దీన్ని ఎదుర్కొనేందుకు భాజపాఅక్కడ తనకంటూ ఒక వ్యూహాన్ని అమలు చేసింది. అదేమాదిగా ఇక్కడ కూడా వ్యవహరించకపోతే తన ఉనికిని విస్తరించుకోవడం కష్టం కాగలదు. అట్లాగని ఎజవా వర్గాల్లో విస్తరించే ప్రయ త్నాలను కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకుంటారనుకోవడం కూడా భ్రమే. అయితే ఇక్కడ గుర్తుం చుకోవాల్సిన అంశమేంటంటే బీజేపీ`బీడీజేఎస్‌ కూటమిగా వుండటం పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తున్నదనేది తిరుగులేని సత్యం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్సీ/ఎస్టీలకు రిజర్వ్‌ అయిన 14 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంకు తిరుగులేని ఆధిపత్యం వుంది. ఎట్లా అంటే, మహారాష్ట్రలో బీజేపీ`శివసేన కూటమిగా కొనసాగినంత కాలం మరాఠా ఓట్లను కోల్పోయారు. ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు బీజేపీకి ఈ వర్గాల్లోకి చొచ్చుకెళ్లడానికి వీలైంది. అదేవిధంగా బీడీజేఎస్‌నుంచి విడిపోతే భాజపా సొంతంగా ఈ వర్గ ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవచ్చనేది ఒక విశ్లేషణ. ఇక్కడ ‘కులాలకతీతంగా’ అనే భావన ప్రతికూల ప్రభావానే చూపుతుంది తప్ప సానుకూల ఓట్లను రా ల్చదనేది సుస్పష్టం. 

ప్రస్తుతం ఎజవా కమ్యూనిటీలు అధికంగా వున్న ప్రాంతాల్లో ‘ఉద్రిక్త శాంతి’ కొనసాగుతున్నదంటే, ఇక్కడ బీజేపీ విస్తరణకు తన ప్రయత్నాలకు తాత్కాలిక విరామం ఇవ్వడమే. గత మార్చి 25 నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పార్టీ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. ఆయనకు ముందు పనిచేసినసురేంద్రన్‌ పార్టీ పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లా ను పాలనాపరంగా రెండుగా విభజించారు. బూత్‌ స్థాయివరకు సమన్వయ సహకారాలు కొనసా గేలా చర్యలు తీసుకున్నారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇప్పటివరకు ఆయా జిల్లాల నాయకత్వాలతో రెండుసార్లు చర్చలు జరిపారు. ఇదే సమయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. యాప్‌ ఆధారంగా నిర్వహించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం రెండు నెలల కాలంలో అప్పటివరకు 19వేలుగా వున్న సభ్యత్వం ఏకంగా లక్ష దాటింది!

ఇప్పుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రధానంగా వచ్చే డిసెంబర్‌లో జరిగే పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరిని అదేవిధంగా ప్రతి పట్టణ మున్సిపల్‌ వార్డుకు ఒకరిని చొప్పున ఇన్‌చార్జ్‌ నియామకాలు పూర్తిచేశారు. ‘వికసిత కేరళం’ కింద జిల్లాలో ఐదుగురితో కూడిన ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలోపేతంగా పనిచేసేందుకు వీలుగా చేసిన సంస్థాగత ఏర్పాటిది. అయితే రాష్ట్రస్థాయిలో ఆర్గనైజేషనల్‌ సెక్రటరీ పోస్టు ఇంకా ఖాళీగానే వుంది. ఇదే సమయంలో మధ్యస్థాయి పోస్టులు కూడా చాలావరకు బర్తీ కాలేదు. ఉన్నతస్థాయి, క్షేత్రస్థాయి నాయకత్వాల మధ్య ప్రథానమైన అనుసంధానాన్ని ఏర్పచ డంలో ఇవి కీలకం. ఈ నియామకాల్లో జాప్యం జరిగేకొద్దీ పార్టీలో గ్రూపులు, రాజకీయాలు మరింత బలోపేతమవుతాయి. అందువల్ల ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం పార్టీకి ఒక శాపం వంటిదనే చెప్పాలి. గ్రూపు రాజకీయాలు ఎదగడానికి యత్నిస్తున్న పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ గ్రూపురాజకీయాలు పెచ్చరిల్లితే రాజీవ్‌ చంద్రశేఖర్‌ వాటిని అరికట్టడంతో పరిమిత పా త్రనే పోషించగలరు తప్ప పూర్తిస్థాయిలో నియంత్రించలేరు. ఎందుకంటే ప్రస్తుతం పార్టీని ఏకతాటిపై నడిపించే సామర్థ్యమున్న రాష్ట్రస్థాయి నాయకుడు అత్యంత అవసరం. కొన్ని దశాబ్దాల క్రితం కె.జి.మారర్‌ ఆవిధంగా పార్టీని నియంత్రించగలిగారు. అటువంటి నాయకత్వం ఇప్పుడు పార్టీకి అత్యవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత బలంగా వున్న సీపీఐఎం మాదిరిగానే సంస్థాగతంగా పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొనిరాక తప్పదు. వీటితో పాటు రాష్ట్రంలో అధికార కూటమికి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే యంత్రాంగం ఇప్పుడు పార్టీకి అవసరం. బాహ్య సమస్యలను ఎదుర్కోవడానికి, అంతర్గత సమస్యల పరిష్కారానికి, పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం కావడానికి నిధులు కూడా అవసరమే. ఇన్ని సమస్యలను అధిగమించి రానున్న పంచాయతీ ఎన్నికల్లో మంచి పనితీరు ప్రదర్శించాలంటే చమటోడ్చక తప్పదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!