మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇఫ్తార్ విందులు: షాకిర్ అలీ
జహీరాబాద్. నేటి ధాత్రి:
పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని కోహీర్ మండల మాజీ ఎంపీపీ ఎండి షాకీర్ అలీ అన్నారు. కోహీర్ పట్టణంలోని అజిజియా మజీద్ ప్రాంగణంలో ప్రజాబంధు షాకీర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో షాకీర్ అలీ మాట్లాడుతూ… పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లా ద్వారా పవిత్రమైన దివ్య ఖురాన్ మానవాళికి అందిందని, ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించే ఇఫ్తార్ మరియు సెహ్రీ విందు కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతికలుగా నిలుస్తూ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. సూర్యోదయానికి ముందు ఉదయం నిర్వహించే విందును సెహ్రీ అంటారని,సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం నిర్వహించే విందును ఇఫ్తార్ అంటారని, రంజాన్ మాసంలో రోజాలో ఉన్నవారు సెహ్రీ మరియు ఇఫ్తార్ విందుల ధ్వారా ఉపవాస దీక్షలను విరమించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రంజాన్ మాసంలో జకాత్ ద్వారా పేద ప్రజలకు దానధర్మాలు చేయడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కోహీర్ మండల మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ మొఖీమ్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ గని,సాజిద్ అలీ,అక్షయ్ జాడే, బిఆర్ఎస్ నాయకులు నాగరిగారి సంపత్ కుమార్,ఉమర్ అహ్మద్, వస్త్ర వ్యాపారులు రాచూరి చంద్రశేఖర్, రాచూరి కనకరత్నం,ముక్క శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.