హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక,న్యాయ విరుద్ధం
మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు
నడికూడ,నేటిధాత్రి:
రైతాంగ సంక్షేమం,వ్యవసాయ ప్రగతి పట్ల కేసీఆర్ కున్న చిత్తశుద్ధికి తీర్పు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కుట్రలకు న్యాయస్థానం చెక్ పెట్టిందని,తీర్పును యావత్ తెలంగాణ సమాజం స్వాగతిస్తున్నదన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవకతవకలు జరిగినాయనేది పాలన చేతగాక,ప్రజల దృష్టి మళ్లించేందుకు,రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైందన్నారు.జస్టిస్ పి సి ఘోష్ కమిషన్,కేసీఆర్ కాళేశ్వరం విచారణ పేరుతో వ్యవహరించిన తీరు, ప్రాథమిక న్యాయ సూత్రాలకు, రాజ్యాంగపర హక్కులకు విరుద్ధమని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు.కమిషన్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదని బల్లగుద్ది స్పష్టం చేసిందన్నారు.హై కోర్టు ధర్మాసనం తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ చెంపలు పగలగొట్టే తీర్పు అని,కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రేరేపిత ఆరోపణల నేపథ్యంలో,ప్రభుత్వంపై మచ్చ వేయాలనే ఉద్దేశంతో కమిషన్ను ఉపయోగించిన విధానం ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు.కమిషన్ విచారణ ప్రక్రియ ఏకపక్షంగా సాగిందని,సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం, వారి వాదనలు వినకపోవడం వంటి లోపాల వల్ల ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది.కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రతిష్టాత్మక నిర్మాణమని,ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలనే ప్రయత్నాల మధ్య వచ్చిన ఈ తీర్పు కేసీఆర్,హరీశ్ రావుల పై చేసిన ఆరోపణలు తప్పని అన్నారు.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాలేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. తెలంగాణ వ్యవసాయానికి సాగునీటిని అందించాలి రైతాంగం సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా,అబద్దాలు చెప్పిన చివరికి ఎన్నటికైనా ధర్మం గెలుస్తుందన్నారు.
