హేమాహేమీల ఖాళీ భర్తీ
‘నేషనల్’ స్టార్ గా రేవంత్ రెడ్డి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దక్షిణాది గళంగానే కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వ్యూహకర్త గా అవతరిస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలంగాణలో అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ను ఓడించి సీఎం కావడంతో రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఎక్స్ పోజర్ పెరిగింది. తన మాట తీరు..స్పాంటేనియస్ అటాకింగ్తో డైనమిక్ లీడర్గా పేరు తెచ్చుకున్న రేవంత్..కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో మొదటి వరుసలో చేరిపోయారు. ఎన్నిక ఏదైనా..కాంగ్రెస్ పార్టీకి దాని అలయన్స్ పార్టీలకు మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు రేవంత్. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. లేటెస్ట్గా కేరళలో రేవంత్ చేసిన క్యాంపెయిన్..కమ్యూనిస్ట్ పార్టీలు..ప్రధాని మోదీ టార్గెట్గా ఆయన చేసిన విమర్శలు పెద్ద చర్చకు దారితీశాయి. తన ప్రసంగాలతో మలయాళీల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు రేవంత్.
ఏదో ఒకరోజు కచ్చితంగా తెలంగాణకు సీఎం అవుతానంటూ బహిరంగంగా సవాల్ చేసి..టార్గెట్ రీచ్ అయిన రేవంత్..ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉంటూనే మరో టార్గెట్పై ఫోకస్ పెట్టారట. ఇప్పటికే తెలంగాణకు మరోసారి సీఎంగా ఉంటానని బహిరంగంగా చెబుతూనే..నేషనల్ పాలిటిక్స్లో ఎమర్జ్ అయ్యే స్కెచ్ వేస్తున్నారట. అందుకు తగ్గట్లుగా టైమ్..టైమింగ్ కలిసి వస్తోందని..జాతీయ రాజకీయాల్లో లోటు కూడా ఉందని భావిస్తున్నారట. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్, అశోక్ గెహ్లాట్, వసుందరా రాజే, మాయవతి, ములాయమ్ సింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, శివరాజ్సింగ్ చౌహాన్..ఇలా చాలామంది హేమాహేమీలు ఇప్పుడు సీఎం పదవిలో లేరు. పైగా కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీల్లో ఆ స్థాయి గుర్తింపు ఉన్న నేతలు కూడా కరువయ్యారు. ఇదే సరైన అవకాశమని లెక్కలు వేసుకుంటున్న రేవంత్..నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే స్కెచ్ వేస్తున్నారట.
గతంలో నేషనల్ పాలిటిక్స్ లో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు నేతలు చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావుకు ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జాతీయ రాజకీయాలను శాసించిన వారిలో ఎన్టీఆర్, చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీయే సర్కార్ను నిలబెట్టడంలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టాలని చూస్తున్నారట. నేషనల్ పాలిటిక్స్లో ఉన్న లోటును ఆక్యుపై చేయాలని భావిస్తున్నారట. సేమ్టైమ్ ఏఐసీసీకి కూడా ఈ తరం లీడర్ల అవసరం ఉంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సౌత్కు చెందిన మల్లిఖార్జున ఖర్గే ఉన్నారు. ఆయనకు వయోభారంతో..ఆరోగ్యం పెద్దగా సహకరించడం లేదు.
ఇక కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదంతో ఇంటిపోరుకే సరిపోతున్నారు. ఇదే అదునుగా సీఎం రేవంత్ రెడ్డి చాలా వేగంగా పావులు కదుపుతున్నారట. అందుకే జాతీయ స్థాయి అంశాలపై తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతూ నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేలా వ్యూహాలకు పదును పెడుతున్నారట రేవంత్. డీలిమిటేషన్ అంశంలో..రేవంత్ తెచ్చిన ప్రతిపాదన ఎంత పెద్ద చర్చకు..రచ్చకు దారితీసిందో చెప్పక్కర్లేదు. కానీ రేవంత్ సెంట్రిక్గానే డీమిలిటేషన్ ఫైట్ నడిచిందనడంలో మాత్రం డౌటే లేదు.
