ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
యాదగిరిగుట్టకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు పర్యటన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందుకు అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య,యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించారు.
అలాగే ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను సందర్శించి, అక్కడ చేపట్టిన సదుపాయాలను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రాకతో టెంపుల్ సిటీ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
