Vizag’s Longest Sky Glass Bridge
విశాఖ సిగలో అద్దాల వంతెన..
పర్యాటకులకు విశాఖపట్నంలో మరో ఆకర్షణ తోడయ్యింది. ఇప్పటి దాకా విదేశాల్లో మాత్రమే చూసిన అద్దాల వంతెనపై నడక అనుభవాన్ని ఇక నుంచి మనమూ పొందొచ్చు. దేశంలోనే అతి పొడవైన ‘స్కై గ్లాస్ బ్రిడ్జ్’ని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిర్మించింది.
విశాఖలోని కైలాసగిరిపై ‘టైటానిక్ పాయింట్’ పర్యాటకులకు సుపరిచితమే. అక్కడి నుంచి కొండ ఏటవాలు ప్రాంతంలో… సముద్రం వైపు 55 మీటర్ల పొడవున గ్లాస్ బ్రిడ్జ్ని నిర్మించారు. ఇది భూమి నుంచి 862 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టం నుంచి వేయి అడుగుల ఎత్తులో ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ దృఢంగా నిలబడేందుకు కింద క్యాంటీలీవర్ ఏటవాలుగా నిర్మించారు. దీనికి సముద్రపు గాలులకు తుప్పు పట్టని స్టీల్ను 40 టన్నులు ఉపయోగించారు. ఇప్పటివరకూ కేరళలోని వాగమన్లో నిర్మించిన 38 మీటర్ల గ్లాస్ బ్రిడ్జే దేశంలో అతి పొడవైనది. దానికి మించి విశాఖపట్నంలో 55 మీటర్ల పొడవున నిర్మించారు. చదరపు మీటరుకు 500 కిలోల బరువును తట్టుకునే అద్దాలను దీనికోసం వినియోగించారు. ఈ గ్యాస్ ప్యానెళ్లను జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.
