Mass Protest in Narsampet Demanding Repeal of 4 Labour Codes
నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
పట్టణంలో కార్మిక వర్గం భారీ ప్రదర్శన
నర్సంపేట,నేటిధాత్రి:
కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలో బిఆర్టియు, ఏఐఎఫ్టియు (న్యూ), ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, టియుసి సంఘాల ఆధ్వర్యంలో* వరంగల్ రోడ్డు కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యాకూబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎఫ్టియు
న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేష్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు,ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంపేల్లి మునీశ్వరు,హమాలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మినారాయణలు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేటు బహుళ జాతి యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా 4 లేబర్ కోడులను తీసుకువచ్చారని కనీస వేతనం అమలు చేయాలని, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సవరణలు చేయడం సరికాదని రైతాంగం హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విధంగా కార్మికుల కూడా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువల లలిత కార్యదర్శి సంధ్య సిఐటియు పట్టణ కార్యదర్శి కందికొండ రాజు, ఆయా సంఘాల నాయకులు రాజు, నాగులు,మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
