ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్…
AP BJP Chief: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి పేరు ఖరారైందని ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు.
విజయవాడ, జూన్ 30: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా (AP BJP New Chief) మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Former MLC Madhav) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాల మేరకు మాధవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు చెప్పవద్దని కమలం పార్టీ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త బాస్పై మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.రాష్ట్ర రాజకీయ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికి పేరు నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు. అధికారికంగా అధ్యక్షుడి పేరు ప్రకటించడమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.బీజేపీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నామినేషన్లు వేయడం, సాయంత్రం ఉపసంహరణ జరుగుతుందన్నారు. రేపు అధికారికంగా అధ్యక్షుని పేరు ప్రకటిస్తారన్నారు. రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోందని చెప్పారు. అధిష్టానం నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని..స్వాగతిస్తారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు.