భారత ఐక్యత పితామహుడు — సర్దార్ వల్లభాయ్ పటేల్
: ఎస్పీ మహేష్ బి. గితే
– “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతం
– సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహణ
– రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని ఎస్పీ పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.
